Telangana Media Politics: ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టారు. ఆ తర్వాత కష్టపడి చదువుకొని ఫార్మా రంగంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఆయన ముట్టుకున్న ప్రతిదీ బంగారమైంది. ఆయన వేసిన అడుగు బలంగా నిర్మితమైంది. ఫలితంగా చూస్తుండగానే వందలు దాటేసి వేల కోట్లకు ఎదిగారు.
ఈ వేల కోట్లలో చాలామంది డబ్బులు ఉన్నాయి. అందులో అధికార పక్షానికి.. ప్రతిపక్షానికి వాటా ఉంది. అంటే అధికార పార్టీలో ఉన్న నాయకులకు.. ప్రతిపక్ష పార్టీల నాయకులకు సదరు ఫార్మా అధినేత బినామీ అన్న మాట. డబ్బు విపరీతంగా రావడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు.
రెండు అక్షరాల పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశారు. మొదట్లో అధికార పక్షానికి భజన చేశారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా ఆదే స్థాయిలో స్పేస్ ఇస్తున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మొన్నటి దాకా ప్రతిపక్షం మీద తన మీడియా సంస్థ లో పూర్తి నెగిటివ్ వార్తలు ప్రసారం చేయించిన ఆ మీడియా అధినేత ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. ప్రతిపక్షానికి కూడా బీభత్సంగా స్పేస్ ఇస్తున్నాడు. ప్రతిపక్షంలో కూడా ఒక కీలక నాయకుడికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు.
సదరు మీడియా అధినేత ఇంటికి ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న కీలక నాయకుడు వెళ్లారు. ఆయనతో గంటలపాటు మాట్లాడారు. దీంతో ఆ మీడియా అధినేత, ప్రతిపక్ష పార్టీలోని కీలక నాయకుడి మధ్య ఏం జరిగింది? వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఎక్కడిది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి గురించి ప్రతిపక్ష పార్టీలోనే పెద్ద తలకాయలు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
“మొదట్లో ఆ మీడియా అధినేత సదరు ప్రతిపక్ష పార్టీలోని కీలక నాయకుడి మీద నెగిటివ్ వార్తలు ప్రసారం చేయించారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా పాజిటివ్ కథనాలను ప్రసారం చేయిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ లోని ఓ ముఖ్య నాయకుడికి బినామీగా ఉన్న సదరు మీడియా అధినేత కం ఫార్మా అధినేత.. ఇప్పుడు ఇలా మారిపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరిగే ఎన్నికల్లో తన స్వస్థలం నుంచి ఈ మీడియా అధినేత పోటీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికార పక్షానికి లేకుంటే ప్రతిపక్షానికి కొమ్ము కాసే మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఉభయకుశలోపరి అనే ట్యాగ్ లైన్ తనమీద వేసుకున్నాడు. ఫలితంగా ఇదిగో అటు అధికార పార్టీకి.. ఇటు ప్రతిపక్ష పార్టీకి సంధాన కర్తగా వ్యవహరిస్తున్నాడు.