Warangal: ఎన్నికల నోటిఫికేషన్‌ రాలేదు.. కానీ ఆ ఊరికి సర్పంచ్‌ గెలిచాడు.. అదీ ఎకగ్రీవంగా.. ఏం జరిగిందంటే?

తెలంగాణలో పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడు నెలలు కావస్తోంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Written By: Raj Shekar, Updated On : September 10, 2024 3:29 pm

Warangal

Follow us on

Warangal: తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, దాదాపు ఆరు నెలలు దాటింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఇటీవలే సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈమేరకు అధికారులు ఎన్నిల నిర్వహణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇంతలోనే ఓ గ్రామానికి సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాలేదు.. నామినేషన్లు వేయలేదు.. ఉప సంహరణ ప్రక్రియ జరుగలేదు. కానీ, ఆ ఊరికి సర్పంచ్‌ ఎన్నిక పూర్తయింది. అదీ ఏకగ్రీవంగా. దీంతో గ్రామంలో సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించాడు. అదేంటి ఎన్నిక అవ్వకుండానే సర్పంచ్‌ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. ఎలా జరిగిందో తెలుసుకోండి..

వరంగల్‌ జిల్లాలో…
వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా ఉంటారు. వీరిలో 700 మందికి ఓటు హక్కు ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాకముందే ఆ ఊరికి కొత్త సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. ధరావత్‌ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే, సొంత డబ్బులతో ఊళ్లో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయస్వామి ఆలయాలు కట్టిస్తానని, అలాగే విగ్రహాలు పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. బొడ్రాయి పండుగ ఖర్చుల కోసం గడప గడపకు రూ.1000 చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు. ఇందుకోసం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండీషన్‌ పెట్టాడు. దీనికి ఆ గ్రామస్తులంతా ఒప్పుకున్నారు. అయితే సర్పంచ్‌ అయిన తర్వాత మాట తప్పితే ఎలా అని వారంతా బాలాజీని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందే పనులు..
దీంతో బాలాజీ గ్రామస్తుల అనుమానాలు నివృత్తి చేసేందకు ఎన్నికలు జరుగక ముందే పనులు పూర్తి చేస్తానని మాటిచ్చాడు. దీంతో గ్రామస్తులంతా సమావేశమై అగ్రిమెంట్‌ పేపర్‌ రాసుకున్నారు. ఇందులో సర్పంచ్‌ అభ్యర్థి, గ్రామస్తులు సంతకాలు పెట్టారు. గడువులోగా ఈ పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్‌ వేయాలని తెలిపారు. ఈ అగ్రిమెంట్‌ను అతిక్రమించి ఎవరు నామినేషన్‌ వేసినా బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని ఆ పేపర్‌పై రాసుకున్నారు.

తండాల్లో మామూలే..
చిన్న గ్రామపంచాయతీలు, తండాల్లో ఇలా జరుగడం మామూలే అని రాజకీయ నాయకులు అంటున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే, సర్పంచ్‌ అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని వేడుకలు చేసుకున్నారు. బయట గ్రామాల వారికి ఇది ఒక వింత సంస్కృతిలా అనిపించినా, తండాల్లో ఈ తంతు వ్యవహారం మామూలుగానే నడుస్తోందట. ఇలా తమ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో గ్రామాలు, తండాల్లో ఇలాంటి ఎన్నిక జరిగితే సమస్యలన్నీ ముందే పరిష్కారం అవుతాయని ఆ తండావాసులు చెబుతున్నారు.