Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద.. కాంగ్రెస్ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. తమ పరిపాలన గొప్పగా ఉందని.. తెలంగాణ అభివృద్ధి పథంలో సాగిందని.. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని చెబుతుంటారు. సోషల్ మీడియాలో.. మీడియాలో ప్రధానంగా కనిపిస్తుంటారు. అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో పనులు చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారో మాత్రం చెప్పరు.
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగుల సమస్యల మీద సరూర్ నగర్ ప్రాంతంలో భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు.. ఎందుకు రాలేదు అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
హరీష్ రావు సరూర్నగర్ సభకు దూరంగా ఉండడంతో కేటీఆర్, ఆయనకు మధ్య విభేదాలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ పెరిగింది అనే వార్తలు ఇప్పుడే కొత్త కాకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం ప్రచారం చాలా గట్టిగానే సాగుతోంది. హరీష్ రావు ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ వద్ద పాదయాత్ర జరిగింది.. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నింపాలని.. రైతుల పంట పొలాలకు నీళ్లు విడుదల చేయాలని హరీష్ రావు అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు హరీష్ రావు భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బ్యానర్లు పెట్టారు. భారత రాష్ట్ర సమితి జెండాలు.. హరీష్ రావు చిత్రాలతో రూపొందించిన కటౌట్లతో ప్రదర్శన జరిగింది.
హరీష్ రావు పాదయాత్రలో కేటీఆర్ ఫోటో కనిపించలేదు.. హరీష్ రావు ఫోటోలను భారీ పరిణామాల్లో.. కెసిఆర్ ఫోటోలను చిన్నగా వేశారు. వాస్తవానికి సిద్దిపేట కేంద్రంగా ఈ కార్యక్రమం జరిగినప్పటికీ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు. ఆయన చిత్రాలను కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా వెయ్యలేదు. కెసిఆర్ ఫోటోలను. చాలా చిన్నగా వేశారు.
ఇటీవల తాను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. జిమ్ లో జాయిన్ కూడా అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు.. మరోవైపు హరీష్ రావు కూడా సంగారెడ్డి జిల్లా రైతులకు అండగా ఉండడానికి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపడతానని వెల్లడించారు.. ఇప్పుడు తన సొంత జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టుల మంచి హరీష్ రావు పాదయాత్ర చేస్తున్నారు. పైగా పార్టీ జెండాలో కేటీఆర్ ఫోటో కనిపించకుండా ఆయన యాత్ర సాగుతోంది.. అయితే ఇటీవల పార్టీలో కేటీఆర్ పెత్తనం పెరిగిపోయింది. అందువల్లే హరీష్ రావు వర్గం ఈ పాదయాత్రను తెరమీదకి తీసుకొచ్చిందని సమాచారం. పైకి తాము కృష్ణార్జునలమని కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నప్పటికీ.. పైకి జరిగేది జరుగుతూనే ఉంది..
