Janamsakshi Reporter : బెదిరిస్తే భయపడే రోజులు పోయాయ్‌.. జర్నలిస్టు ముసుగులో ఆగడాలు.. కట్టేసి కొట్టిన జనాలు!

జర్నలిస్ట్‌ను ప్రజాస్వామ్యంలో చాలా గొప్పగా వర్ణించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేర్కొన్నారు. ప్రజాసమస్యలను వెలికి తీసి.. పరిష్కారానికి కృషి చేసేవాడు జర్నలిస్టు. కానీ నేడు జర్నలిస్టు అనే పదానికి అర్థం మారింది.

Written By: Raj Shekar, Updated On : September 29, 2024 6:45 pm

Janamsakshi Reporter

Follow us on

Janamsakshi Reporter :  : జర్నలిస్ట్‌ అన్నా.. జర్నలిజం అన్నా.. ఒకప్పుడు సమాజంలో గౌరవం ఉండేది. అవినీతిపరులు, అక్రమార్కులు భయపడేవారు. జర్నలిస్టు అంటే అన్ని అంశాలపై అవగాహన ఉన్న మేధావిగా భావించేవారు. జర్నలిస్టుకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అన్న భరోసా ఉండేది. ఎంతో మంది జీనియర్‌ జర్నలిస్టులు అనేక అవినీతి, అక్రమాలను, కుంభకోణాలను వెలికి తీశారు. స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేశారు. ప్రజాధనాన్ని కాపాడారు. ప్రజల పక్షానే కోట్లాది కథనాలు రాశారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు జర్నలిస్టు అనే పదానికి అర్థం మారిపోయింది. మీడియా సంస్థల యాజమాన్యాలు కూడా అవసరాల మేరకు పనిచేస్తున్నాయి. దీంతో జర్నలిస్టులు కూడా స్వార్థపూరితంగా మారిపోయారు. ప్రజా సమస్యలను వదిలేసి.. అవినీతి, అక్రమార్కులకు కొమ్ముకాస్తూ… వారిచ్చే అవినీతి సొమ్మును పుచ్చుకుంటున్నారు. పార్టీలకు కొమ్ము కాస్తున్నారు. అధికారంలో ఎవరు ఉంటే.. వారికి జై కొడుతున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మాత్రం వృత్తి ధర్మం పాటిస్తున్నారు.

పెరుగుతున్న ఆగడాలు..
ఇక జర్నలిస్టు ముసుగులో చాలా మంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు, డబ్బుల వసూళ్లు, ఎమ్మెల్యేలు, అధికారుల అక్రమాలకు కొమ్ముకాస్తూ. ప్రభుత్వ భూమిని పట్టాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలు, యంత్రాలు, వాహనాల.. మొదట అందేది జర్నలిస్టులకే. రుణాలు కూడా జర్నలిస్టులు తీసుకుని ఎగ్గొట్టిన కేసులు అనేకం ఉన్నాయి. వారిపై అధికారులు ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఒకప్పుడు జర్నలిస్టు అంటే చినిగిన చొక్కా.. ఓ సంచి భుజానికి తగిలించుకుని పుస్తకం, పెన్ను చేత పట్టుకుని వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చిన్న పెద్ద పత్రిక, ఛానెల్‌ అనే తేడా లేకుండా అందరూ కార్లు మెయింటేన్‌ చేస్తున్నారు. ఒకప్పుడు జర్నలిస్టులు ఇన్న ఇళ్లలో ఉండేవారు. కానీ ఇప్పుడు 70 శాతం జర్నలిస్టులు లక్షల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కళ్లు చెదిరే భవనాల్లో నివసిస్తున్నారు. ఇదంతా అక్రమార్జనే అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వ్యక్తిగత అవసరాల కోసం జర్నలిస్టులు వసూళ్లకు పాల్పడుతుంటే.. తమ అవినితి వెలుగులోకి రాకుండా నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జర్నలిస్టులకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. జర్నలిజం అనేది ఇప్పుడు ఆదాయ మార్గంగా మారింది. అందుకే ఒకప్పుడు ఎక్కడో కానీ కనిపించని జర్నలిస్టు ఇప్పుడు గలీలకి ఒకరు ఉన్నారు.

కట్టేసి కొట్టారు..
జర్నలిస్టు అని బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి. అన్యాయం చేసేవారిని బెదిరించాల్సిన జర్నలిస్టులు ఇప్పుడు అక్రమార్కులకు కొమ్ముకాస్లూ.. సామాన్యులను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జనాలు జర్నలిస్టులపై తిరగబడుతున్నారు. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టుల ముసుగులో బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడే వారిపై తిరగబడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన జనం సాక్షి రిపోర్టర్‌ సంతోష్‌నాయక్‌పై జనాలు తిరగబడ్డారు. ప్రజా కోర్టులోనే శిక్షించారు. ఇళ్లు కట్టుకుంటున్న సామాన్యులు పొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తుండడంతో అక్కడి ప్రజలే రిపోర్టర్‌ను పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అయినా తాను రిపోర్టర్‌ అని దబాయించడం కనిపించింది.

స్పందిస్తున్న నెటిజన్లు…
జర్నలిస్టుకు దేహశుద్ధి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. జర్నలిస్టులు అంతా ఇంతే అని కామెంట్‌ చేస్తున్నారు. దొరికినోడు దొంగ అని, దొరకనంత వరకు అందరూ నిజాయితీ పరులు అని పేర్కొంటున్నారు. జర్నలిస్టు ముసుగులో చేసే అక్రమాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.