HomeతెలంగాణKTR: అపరిచితుడు.. ఆహా నా పెళ్లంట.. రేవంత్ రెడ్డిని ‘సినిమాల’తో కొట్టిన కేటీఆర్..మామూలు ర్యాగింగ్ కాదిది.

KTR: అపరిచితుడు.. ఆహా నా పెళ్లంట.. రేవంత్ రెడ్డిని ‘సినిమాల’తో కొట్టిన కేటీఆర్..మామూలు ర్యాగింగ్ కాదిది.

KTR: తెలంగాణ లో రాజకీయాలు అంతకంతకు హీట్ ఎక్కుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్నాయి. విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోవడంలో నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా చాలు రెచ్చిపోతున్నారు. స్థాయిని మరిచి.. భేదాన్ని మరిచి తిట్టుకుంటున్నారు. అసలు తిట్టుకోవడాన్నే పనిగా పెట్టుకుంటున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు. ఎన్నికల ముగిసిన తర్వాత గెలిచిన పార్టీ అధికారాన్ని.. ఓడిపోయిన పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని స్వీకరిస్తుంది. ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తుంది . కానీ తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలకు ముందునాటి వాతావరణమే కొనసాగుతోంది. ఆరు గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. ఒక గ్యారెంటీ కూడా అమలుకు నోచుకోలేదని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని.. ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే.. రేషన్ కార్డులు ఇచ్చి కూడా ప్రచారం చేసుకోవాలా అని భారత రాష్ట్ర సమితి దెప్పి పొడుస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఘన కార్యాలు చేశారో తెలుసా.. ఫోన్ ట్యాపింగులు చేశారు.. అడ్డగోలు పనులు చేశారు.. ఇదిగో మీ చిట్టా అంటూ.. కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతుంటే.. అందులో ఏం తప్పు చేశామో నిరూపించండి అంటూ గులాబీ పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది.

రైతు భరోసా విషయంలో..

ఇక కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి కొత్త ఆరోపణ చేయడం మొదలుపెట్టింది. జనవరి 26న రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని ముందుగా ప్రభుత్వం చెప్పింది. అయితే ఆరోజు సెలవు దినం కావడంతో.. జనవరి 27 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారని.. మార్చి వరకు రైతు భరోసా డబ్బులు జమవుతాయని చెబుతున్నారని.. ఇంతకీ అది ఏ ఏడాది మార్చి నెలో చెప్పలేదని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రైతు భరోసా నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని.. ఏడాది పాటు రైతులకు రైతు భరోసా వేయకుండా నిండా ముంచిందని మండిపడ్డారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని అపరిచితుడు సినిమాలోని రాము, రెమో పాత్రలతో పోల్చారు. రాము పాత్రలో ఒక మాట మాట్లాడితే.. రెమోగా మారిపోయిన తర్వాత మరో తీరుగా వ్యవహరిస్తారని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి రైతు భరోసా అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావుకు చికెన్ తో భోజనం పెట్టినట్టు ఉందని.. కోడిని వేలాడదీసి.. దానినే చికెన్ గా ఊహించుకొని తినాలనే సన్నివేశం మాదిరిగానే రైతు భరోసా ఉందని కేటీఆర్ విమర్శించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. దీనిని గులాబీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులు తెగ ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కేటీఆర్ రోజుకో తీరుగా విమర్శలు చేస్తున్నారు. చిట్టి నాయుడని.. గుంపు మేస్త్రి అని.. రవంత రెడ్డి అని.. కొత్త కొత్త పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ట్విట్టర్ టిల్లు అని కేటీఆర్ ను గేలి చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular