HomeతెలంగాణKCR Political Test : కొడుకు.. కూతురు...పార్టీ.. కేసీఆర్‌కు విషమ పరీక్ష..!?

KCR Political Test : కొడుకు.. కూతురు…పార్టీ.. కేసీఆర్‌కు విషమ పరీక్ష..!?

KCR Political Test : తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఒకే తాటిపై నడిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) ఇప్పుడు క్లిష్టమైన రాజకీయ సవాళ్ల మధ్య చిక్కుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ నుంచి ఎమ్మెల్యేల బయటకు వెళ్లడం, కుటుంబ సభ్యుల రాజకీయ వివాదాలు, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి.. ఇవన్నీ కేసీఆర్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. ముఖ్యంగా, కుమార్తె కల్వకుంట్ల కవిత లేఖ, ఆమె వ్యాఖ్యలు, కుమారుడు కేటీ రామారావు (కేటీఆర్‌) రాజకీయ భవిష్యత్తు సంబంధించిన చర్చలు కేసీఆర్‌కు రాజకీయంగా, వ్యక్తిగతంగా గట్టి పరీక్షగా మారాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కూతురు కవిత రాసిన లేఖ ఆ పార్టీలో ముసలం, కుటుంబంలో చిచ్చు రాజేసింది. బీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభాన్ని బహిర్గతం చేసింది. ఈ లేఖలో ఆమె కేసీఆర్‌ నాయకత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీతో సంబంధాలపై అస్పష్టత, కార్యకర్తలతో కేసీఆర్‌ దూరం, వక్ఫ్‌ యాక్ట్‌ వంటి విషయాలపై నిశ్శబ్దం వంటి అంశాలను ప్రస్తావించారు. కవిత అమెరికాలో ఉన్న సమయంలో ఈ లేఖ లీక్‌ కావడం, ఆమె ‘‘కేసీఆర్‌ తప్ప ఎవరూ నన్ను నడపలేరు’’ అనే వ్యాఖ్యలు పార్టీలో కేటీఆర్‌ నాయకత్వానికి సంబంధించిన చర్చను తెరపైకి తెచ్చాయి. ఈ లేఖ కేవలం కుటుంబ సమస్య కాదు, పార్టీలో నాయకత్వ సంక్షోభాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also read : మహిళలకు బంపర్ న్యూస్.. కొత్త పథకం.. ఒక్కొక్కరికి ఫ్రీగా రూ.15 వేలు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం..

లేఖ వెనుక ఉద్దేశం
కవిత లేఖ వెనుక రెండు ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. మొదటిది కేటీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందనే సూచనల నేపథ్యంలో, కవిత తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఇక రెండోది బీజేపీతో సంబంధాలపై అస్పష్టతను లేవనెత్తడం ద్వారా, కవిత పార్టీ కార్యకర్తల మధ్య తన స్థానాన్ని బలపరచాలని చూస్తున్నారని ఒక అభిప్రాయం.

సెంటిమెంట్‌తో కూడిన సమస్య..
ప్రస్తుత సంక్షిష్ట పరిస్థితిలో కేసీఆర్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు కుటుంబ సభ్యుల రాజకీయ ఆకాంక్షలు. కవిత, కేటీఆర్, హరీశ్‌రావు.. ఈ ముగ్గురూ పార్టీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కానీ, వీరి మధ్య నాయకత్వ పోటీ, పార్టీ భవిష్యత్తుపై విభిన్న దృక్పథాలు కేసీఆర్‌ను ఇరుకున పెడుతున్నాయి. కవిత లేఖలో కేటీఆర్‌ను ‘‘అనర్హుడు’’ అని పరోక్షంగా సూచించడం, పార్టీ సీనియర్‌ నాయకులను సమావేశాల్లో ప్రసంగించనివ్వకపోవడంపై విమర్శలు చేయడం కుటుంబంలోని రాజకీయ ఒత్తిడిని స్పష్టం చేస్తోంది.

సెంటిమెంట్‌ బలం
కవిత ‘‘కేసీఆర్‌ తప్ప ఎవరూ నన్ను నడపలేరు’’ అనే వ్యాఖ్య కేసీఆర్‌పై భావోద్వేగ ఒత్తిడిని చూపిస్తుంది. కన్నబిడ్డపై కఠిన చర్యలు తీసుకోవడం కేసీఆర్‌కు సాధ్యం కాకపోవచ్చు. ఒకవైపు కుమార్తె సెంటిమెంట్, మరోవైపు పార్టీ ఐక్యత.. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారింది.

పార్టీలో అంతర్గత సంక్షోభం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీని బలహీనపరిచాయి. ఈ ఓటముల నేపథ్యంలో, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ. ఈ పరిస్థితిలో కవిత లేఖ, ఆమె వ్యాఖ్యలు పార్టీలో అసంతప్తిని మరింత పెంచాయి. కేసీఆర్‌ బహిరంగంగా కనిపించకపోవడం, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం కూడా పార్టీ కార్యకర్తల్లో నిరాశను కలిగించాయి.

కేసీఆర్‌ మౌన వ్యూహం..
2024 ఏప్రిల్‌–మేలో బస్సు యాత్ర తర్వాత కేసీఆర్‌ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన నిశ్శబ్దం పార్టీ కార్యకర్తల్లో అనిశ్చితిని సృష్టించింది. కొందరు దీనిని వ్యూహాత్మకంగా చూస్తున్నప్పటికీ, మరికొందరు ఇది పార్టీ బలహీనతకు సంకేతమని భావిస్తున్నారు.

రాజకీయ కక్షసాధింపు?
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై విచారణ కమిషన్‌ నోటీసులు కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు జారీ చేయడం మరో సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విచారణను రాజకీయ కక్షసాధింపుగా ఉపయోగిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈ విచారణ కేసీఆర్‌ రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సాధించిన విజయాలను ఈ వివాదం మసకబార్చవచ్చు.

బీజేపీతో సంబంధాలపై అనిశ్చితి
బీఆర్‌ఎస్‌ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందనే ఆరోపణలు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. కానీ, కేసీఆర్‌ బీజేపీ, ఐ.ఎన్‌.డి.ఐ.ఏ రెండింటికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అయితే, కవిత లేఖలో బీజేపీపై బలంగా విమర్శించాలని సూచించడం, బీఆర్‌ఎస్‌ వైఖరిపై స్పష్టత లేకపోవడం పార్టీ రాజకీయ స్థితిని మరింత గందరగోళంగా చేస్తోంది.

భవిష్యత్తు వ్యూహం..
కేసీఆర్‌ ఇప్పుడు రెండు మార్గాల మధ్య ఉన్నారు.. మొదట కవిత, కేటీఆర్‌ మధ్య నాయకత్వ చర్చను సమర్థవంతంగా నిర్వహించాలి. కవితపై కఠిన చర్యలు తీసుకోవడం లేదా ఆమెకు ప్రముఖ పాత్ర ఇవ్వడం. ఈ రెండూ పార్టీలో విభజనకు దారితీయవచ్చు. రెండోది 2023, 2024 ఎన్నికల ఓటముల తర్వాత బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడానికి కేసీఆర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయిలో కార్యకర్తలను సమీకరించాలి. 2025లో పార్టీ రజతోత్సవ కార్యక్రమాలను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని ఆయన ప్రకటించారు.

సాధ్యమైన పరిణామాలు
కేటీఆర్‌ నాయకత్వం: కేటీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తే, కవిత అసంతృప్తి పార్టీలో మరిన్ని సమస్యలను సృష్టించవచ్చు.

కవిత పాత్ర: కవితకు ప్రముఖ స్థానం ఇస్తే, సీనియర్‌ నాయకుల అసంతృప్తి, పార్టీ ఐక్యతపై ప్రభావం పడవచ్చు.

కేసీఆర్‌ తిరిగి రాజకీయ కేంద్రంలోకి: కేసీఆర్‌ తన గత రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తి, పార్టీని బలోపేతం చేయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version