KCR: ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌.. యశోద ఆస్పత్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా?

నిపుణులైన వైద్యులు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకున్న ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు.

Written By: Raj Shekar, Updated On : December 15, 2023 11:48 am

KCR

Follow us on

KCR: మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యశోద ఆస్పత్రి శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. నిపుణులైన వైద్యులు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకున్న ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు.

బంజారాహిల్స్‌ ఇంటికి..
యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందిన కేసీఆర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు.
అయితే.. కేసీఆర్‌కు ఏకాస్త సమయం దొరికినా ఎర్రవెల్లిలోని తన ఫోమ్‌ హౌస్‌లో గడపడం కేసీఆర్‌కు ఇష్టం. అయితే అదే ఫోమ్‌ హౌస్‌లో జారిపడటంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్‌ నివాసానికి తీసుకెళ్లారు.

ఈనెల 8న జారిపడ్డ కేసీఆర్‌..
ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్‌ను వాకర్‌ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులంతా కేసీఆర్‌ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతోపాటు చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు.

ఎవరూ రావొద్దని వినతి..
పెద్దసంఖ్యలో జనం రావడంతో ఆసుపత్రిలోని ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో కేసీఆర్‌ త్వరలో తానే ప్రజల్లోకి వస్తానని వీడియో సందేశం ఇచ్చారు. ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కోరారు. తాను కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పత్రికలు పుస్తకాలు చదువుతూ..
కేసీఆర్‌ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికే పరిమితం కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని కల్పిస్తూనే ఉన్నారు. సాధారణంగా.. కేసీఆర్‌ కు చదవడం అంటే మక్కువ కాబట్టి.. ఇప్పుడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తీసుకొచ్చి చదివేవారు.