KCR: గత నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోయింది. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, తర్వాత దేశానికి ప్రధాన మంత్రి కావాలన్న కేసీఆర్ కలలు కల్లలయ్యాయి. ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఓటమి నుంచి గులాబీ బాస్ ఇంకా తేరుకోవడం లేదు. అధికారం లేకుండా ఉండలేను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని మాట్లాడుతున్నారు. ఈసారి మరింత దిగజారి కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ మాటలు చూసి కేసీఆర్కు అధికార దాహం ఎంత ఉందో అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అహంకార పూరిత మాటలే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. అయినా మళ్లీ అదే ధోరణి అవలంబిస్తున్నారు.
ఎందుకంత ఆశ..
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఐదేళ్లు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ నేతలు అలా కాకుండా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం, కూల్చడం గురించే మాట్లాడుతున్నారు. బొటాబొటి మెజారిటీ ఉన్న రేవంత్ సర్కార్ను బీజేపీ బతకనివ్వదు అని అంటున్నారు. తర్వాత తమకే అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారు.
క్యాడర్లో ధైర్యం నింపేందుకే..
అధికారంలో ఉన్నప్పుడు పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే కేసీఆర్ ఇప్పుడు పార్టీ క్యాడర్ కకావికలం అవుతుండడంతో అదినేత కేసీఆర్ కూడా తన స్థాయిని దిగజార్జుకుంటున్నారు. ఒకవైపు నేతల వలసలు, మరోవైపు ఆత్మస్థైర్యం కోల్పోతున్న క్యాడర్ను కాపాడుకునేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నుంచి వలసలను నిరోధించేందకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు.
లోక్సభ ఎన్నికల తర్వాత..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతోనే పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ క్యాడర్ను కాపాడుకునేందుకు, నేతల వలసలు అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.