HomeతెలంగాణCM Revanth Reddy: పదేళ్లు నేనే సీఎం.. రేవంత్ మాటల వెనుక ఆంతర్యం అదేనా?

CM Revanth Reddy: పదేళ్లు నేనే సీఎం.. రేవంత్ మాటల వెనుక ఆంతర్యం అదేనా?

CM Revanth Reddy: ‘పదేళ్లు రాష్ట్రానికి నేనే సీఎంగా ఉంటా.. తర్వాత మరో పదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుంది. కేసీఆర్‌ ఇప్పుడే కూలుస్త అంటున్నడు.. రా.. చూసుకుందాం’ అని టీవల సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటు కాంగ్రెస్‌ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఏధైర్యంతో ఈ మాట అని ఉంటారని కొందరు విశ్లేషిస్తుండగా, ఇలా చెప్పడం ద్వారా ప్రతిపక్షానికి ఎంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది.

పెరుగుతున్న గ్రాఫ్‌..
వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి తెలంగాణలో రేవంత్‌ గ్రాఫ్‌ పెరుగుతోంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్, హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్లు విభేదించినా తర్వాత అధిష్టానం జోక్యంతో సర్దుకుపోయారు. దీంతో క్రమంగా రేవంత్‌ పార్టీపై పట్టు సాధించారు. తర్వాత సమష్టిగా ఎన్నికలకు వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చారు. దీంతో రేవంత్‌ గ్రాఫ్‌ మరింత పెరిగింది.

సీఎం కావడానికి అదే కారణం..
రేవంత్‌ సీఎం కావడానికి కూడా ఆయనకు పెరిగిన ఇమేజే కారణం. భట్టి విక్రమార్క పోటీ పడినా అధిష్టానం రేవంత్‌వైపే మొగ్గు చూపింది. పార్టీని ఐక్యంగా నడపడంతోపాటు అధికారంలోకి తీసుకురావడంతో రేవంత్‌ పాత్రను గుర్తించి కాంగ్రెస్‌ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. భట్టిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించి అసంతృప్తి లేకుండా చేసింది.

సమష్టిగా పాలన..
ఇక రేవంత్‌ సర్కార్‌ గతంలో కాంగ్రెస్‌లా కాకుండా ఐక్యంగా, సమష్టిగా పాలన సాగిస్తోంది. ఏది చేసినా మంత్రివర్గ సహచరులతో చర్చించే సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా నిర్ణయం అనకుండా మా ప్రభుత్వం, మా నిర్ణయం అని రేవంత్‌ పదేపదే చెబుతున్నారు. దీంతో రేవంత్‌ను వ్యతిరేకించే వారు లేకుండా పోయారు. ఇప్పుడు ఇదే పదేళ్లు తానే సీఎం అనే ధైర్యం ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీఎం పదవి ఆశించేవారు..
పార్టీలో సీఎం పదవి ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే రేవంత్‌ ఎక్కడా వారికి అవకాశం ఇవ్వడం లేదు. కలిసి పనిచేస్తూ.. కలుపుకుపోతున్నారు. దీంతో అసమ్మతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నారు. సీఎం పదవిపై ఆశ ఉన్నవారు కూడా దానిని వదులుకుంటున్నారు. అందుకే రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో ఎవరూ నొచ్చుకోకుండా.. పదేళ్తు నేనే సీఎంగా ఉంటానని గట్టిగా చెప్పగలిగారని అంచనా వేస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని వెల్లడించడంతోపాటు ప్రభుత్వం పటిష్టంగా ఉందని సంకేతాలు కూడా ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version