TPCC Chief: అతనే టీపీసీసీ చీఫ్‌.. ఆ నలుగురికి మంత్రి పదవులు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది. ఇట టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పదవీ కాలం గత జూన్‌తోనే ముగిసింది. ఆయన సీఎంగా ఎంపిక కావడంతో నూతన పీసీసీ చీఫ్‌ ఎంపిక అనివార్యమైంది.

Written By: Raj Shekar, Updated On : August 24, 2024 12:25 pm

TPCC Chief

Follow us on

TPCC Chief: తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. కాంగ్రెస్‌ పార్టీకి పదేళ్లు అధికారం దక్కలేదు. ఎట్టకేలకు 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీకి అధికారం దక్కింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు ఆ పార్టీని గద్దె దించి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. డిసెంబర్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా రేవంత్, 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. క్యాబినెట్‌లో ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్‌ పదవి ముగిసి కూడా దాదాపు మూడు నెలలు దాటింది. ఈ నేపథ్యంలో టీపీసీసీకి కొత్త సారధిని ఎంపిక చేయడంతోపాటు మిగిలిన మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్నదానిపై కాంగ్రెస్‌ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. చివరకు ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. కొత్త పీసీసీ సారధి పతవిని బీసీలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఇక ఆరు మంత్రి పదవుల్లో నాలుగు పదవులకు ఎమ్మెల్యేలను ఎంపిక చేసినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో మధ్యాహ్నం చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ముఖ్యులతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక అధికారిక ప్రకటన మాత్రేమ మిగిలి ఉంది.

పదవి కోసం వీరు పోటీ..
టీపీసీసీ రేసులో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ ఉన్నారు. వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొన్నది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో అధిష్ఠానంతోపాటు రాష్ట్ర మెజార్టీ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం నలుగురికి అవకాశం ఇవ్వాలి నిర్ణయించారు. పి.సుదర్శన్‌రెడ్డి, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే ముందు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చిన హామీల పైన నేతల మధ్య చర్చ జరిగింది. అయితే రెండు పదవులు ఖాళీగా ఉంచి..నాలుగు పదవులు భర్తీ చేయాలని తాజా చర్చల్లో నిర్ణయించారు. విస్తరణలో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, బీసీవర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఓబీసీట్లో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజ్‌వర్గం నుంచి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. బీసీల నుంచి యాదవవర్గానికి, ఎస్టీల్లో లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరో నేతకు ఛాన్స్‌ దక్కనుంది. ఈ నెలాఖరులోగానే మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.