Daivalaguda Raj Kumar: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్.. వ్యవహార శైలి పై రకరకాల చర్చలు సాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున తన భార్య.. ఇద్దరు పిల్లలను చంపిన రాజ్ కుమార్.. తనమీద ఫోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లిని, నానమ్మను చంపేశాడు. మొత్తంగా ఆరు హత్యలు చేశాడు..
స్థానికులు చెబుతున్నట్టు రాజ్ కుమార్ కేవలం ఆరు హత్యలు మాత్రమే చేయలేదు.. అతడు ఏకంగా ఏడుగురిని చంపేశాడు. సరిగ్గా 2025 మార్చి 4న తొలి హత్యతో ఈ మరణ పరంపరకు శ్రీకారం చుట్టాడు. గత ఏడాది మార్చి 4న ఆ బాలిక తండ్రి మల్లేష్ ను రాజ్ కుమార్ చంపేశాడు. మల్లేష్ కు మద్యం తాగే అలవాటుంది. రాజకుమార్ కు, మల్లేష్ కు స్నేహం ఉండేది. దానితోనే అతడు తరచు మల్లేష్ ఇంటికి వచ్చేవాడు. అప్పుడే మల్లేష్ కుమార్తె మీద కన్ను వేశాడు. ఆ బాలికను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఇంట్లోకి వచ్చి వక్రంగా మాట్లాడేవాడు. అతడి ఆగడాలు భరించలేక.. ఆ బాలిక తల్లి అనేకసార్లు అతనితో కూడా పెట్టుకుంది. ఇంటికి రావద్దని హెచ్చరించింది.
వాస్తవానికి మల్లేష్ గత ఏడాది చనిపోయినప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే అతడికి మద్యం తాగే అలవాటు ఉంది. అతడు చనిపోయినప్పుడు కూడా మద్యం తాగి ఉండడంతో అందువల్లే చనిపోయాడని భావించారు. కానీ మల్లేష్ మరణం వెనుక రాజ్ కుమార్ కుట్ర ఉందని ఆ బాలిక కుటుంబ సభ్యులు తెలుసుకోలేకపోయారు. ఇటీవల ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్నప్పుడు.. రాజకుమార్ ఆమెను అడ్డగించాడు. పరీక్షలు రాయకూడదని హెచ్చరించాడు. చేయి పట్టుకుని లాగాడు. ఆ సమయంలో ఆ బాలిక తల్లి అతడితో గొడవపడింది. ఇదే క్రమంలో మీ ఇంటి పెద్దను చంపేశాను.. మిమ్మల్ని కూడా చంపేసి.. ఆ బాలికను ఎత్తుకెళ్లిపోతాను అంటూ హెచ్చరించాడు. అతని మాటలతో అప్పుడు వాళ్లకు తమ ఇంటి పెద్దను చంపింది రాజకుమార్ అని అర్థమైంది. ఆ తర్వాత వారు ఇదే విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సక్రమంగా ఈ కేసును పట్టించుకోని ఉంటే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉండడంతో ఇంతటి ఘోరం జరిగింది..
బాలిక కుటుంబం మీద ఆగ్రహం పెంచుకున్న రాజ్ కుమార్.. వారి కుటుంబంలో ముగ్గురిని చంపేశాడు. వారిని చంపడానికంటే ముందు.. తన కుటుంబంలో ఉన్న భార్య.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. వాస్తవానికి తన భార్యను.. ఇద్దరు కుమారులను ఎందుకు చంపాడో తెలియడం లేదు. ఆరు హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అతడిని తమకు అప్పగించాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
