KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్టీరింగ్ పట్టారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌస్లో గురువారం(జూన్ 27న) ఓమ్నీ వ్యన్ నడిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 8న ఆయన ఫామ్హౌస్లో బాత్రూంకు వెళ్లి జారిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తుంటి ఎముక విరిగింది. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో వైద్యులు ఆపరేశ్ చేశారు. అప్పటి దాదాపు రెండు నెలల తర్వాత కేసీఆర్ కోలుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు చేతి కర్రసాయంతో నడుస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన కర్రసాయంతోనే సభలకు హాజరయ్యారు.
వైద్యుల సూచనతో…
ఆపరేషన్ పూర్తయి ఆరు నెలలు అయింది. ఈ నేపథ్యంలో వైద్యులు మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచించారు. ఈమేరకు తన ఫామ్హౌస్లో ఉన్న పాత ఓమ్నీ వ్యాన్ను కేసీఆర్ నడిపారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇక చేతికర్ర లేకుండానే కేసీఆర్ నడవగలుగుతారని పేర్కొంటున్నారు.
ఫామ్హౌస్ నుంచే కార్యకలాపాలు..
ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలన్నీ తన ఫామ్హౌస్ నుంచే కొనసాగిస్తున్నారు. బంజారాహిల్స్లో తెలంగాణ భవన్ ఉన్నప్పటికీ ఆయన అక్కడకు రావడంలేదు. ఓటమి తర్వాత తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు కూడా చేయించారు. అయినా కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడం లేదు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులను తన ఫామ్హౌస్కే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరారు. దీంతో అలర్ట్ అయిన కేసీఆర్ పార్టీలో కొనసాగుతున్న వారితో రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు. ఆరు నెలల కాలంలో పరిస్థితులు మార్పు వస్తాయని చెప్పారు. తిరిగి పూర్వ వైభవం వస్తుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు.