KTR : మహిళలపై నోరు జారి బుక్కైన కేటీఆర్.. కాంగ్రెస్ ఓ రేంజ్ లో వాడేసుకుందిగా!

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆధిపత్యం కోసం ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ తగ్గడం లేదు.

Written By: Raj Shekar, Updated On : August 16, 2024 5:32 pm

ktr-vs-revanth-reddy

Follow us on

KTR : తెలంగాణలో ఎన్నికలు ముగిసినా.. రాజకీయ వేడి తగ్గడం లేదు. జోరు వానాకాలంలోనూ హీటెక్కించే మాటలతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయి. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్‌ విపక్ష బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడుతోంది. ఇదే అదనుగా బీఆర్‌ఎస్‌ నాయకులు అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఏ పని చేసినా విమర్శలతో దండయాత్ర చేస్తున్నారు. అధికార పార్టీని ఉక్కిరిబక్కిరి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాంగ్రెస్‌కు అడ్డంగా బుక్కయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. అవకాశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కేటీఆర్‌ వ్యాఖ్యలపై మరింత రచ్చ చేస్తూ కేటీఆర్‌ను డ్యామేజ్‌ చేసే పనిలో పడింది. కేటీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్‌ డాన్సులు, రికార్డింగ్‌ డాన్స్‌లు చేయండి అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలను అవమానించేలా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్‌ వైఖరిని నిరసిస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మలు కాంగ్రెస్‌ మహిళా విభాగం ఆధ్వర్యం దహనం చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దుర్వినియోగం జరుగుతోందంటూ ట్రోల్స్‌ జరుగుతున్నాయి. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు ఒలుచుకుంటే తప్పేంటని, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్‌.. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేక్‌ డ్యాన్సులు చేసుకున్న తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. మహిళకో బస్సు పెట్టండి అంటూ వెటకారం చేశారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపాటి దుమారం రేపాయి. మహిళా వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార కాంగ్రెస్‌ నేతలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను అవమానించారంటూ మండిపడ్డారు.

మహిళా కమిషన్‌ నోటీసులు..?
కేటీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు తెలుపుతుండగా, తాజాగా తెలంగాణ మహిళా కమిషన్‌ కూడా కేటీఆర్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు కేటీఆర్‌కు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24న హాజరు కావాలని పేర్కొందని సమాచారం.

కేటీఆర్‌ ట్వీట్‌..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ట్వీట్‌ చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్‌ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు’ అని తాను అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యదాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని పేర్కొన్నారు.