Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు పురపాలక ఎన్నికలను అత్యంత సవాల్ గా తీసుకున్నారు. అందువల్లే వారు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.
తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు బండి సంజయ్. ఈయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు బండి సంజయ్. 2024 ఎన్నికల్లో కూడా బండి సంజయ్ కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంటు స్థానంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ కార్పొరేషన్ పై కమలం జెండాను ఎగరవేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందువల్లే విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచార క్రతువులో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు. బిజెపి కూడా ముస్లింలను వ్యతిరేకించదు. కేవలం మేము ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకం. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ముస్లింలు కూడా లబ్ధి పొందుతున్నారు. పార్టీలో ముస్లింలకు కూడా కీలకమైన పదవులు ఉన్నాయి. త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటివి ముస్లింల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ చేశారని” బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయి. కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు ను తమ వైపు మళ్లించుకోవడానికి బండి సంజయ్ ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
