Women’s T20 World Cup 2024 Final : లాథమ్ ను కాదు.. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ ను అనుసరించిన న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఐసీసీ చెప్పిన నిజం ఏంటంటే..

ఎట్టకేలకు పొట్టి ప్రపంచ కప్ ను న్యూజిలాండ్ దక్కించుకుంది. దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించి.. విజేతగా ఆవిర్భవించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 12:08 pm

Women's T20 World Cup 2024 Final

Follow us on

Women’s T20 World Cup 2024 Final : దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటింది. స్లో డెలివరీలు వేస్తూ దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించింది. టోర్నీ మొత్తం అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా.. ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయింది. వికెట్ కోల్పోకుండా 51 రన్స్ చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత క్రమంగా వికెట్లను నష్టపోయింది. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కేవలం 35 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ దక్షిణాఫ్రికా జట్టు విజయ సమీకరణం 36 బంతుల్లో 73 పరుగుల వద్ద ఉన్నప్పటికీ.. ఆ జట్టు ప్లేయర్లు సత్తా చాటలేకపోయారు. దూకుడుగా ఆడలేకపోయారు. ఇదే సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు అత్యంత తెలివిగా స్లో డెలివరీలు వేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుస బంతుల్లో వికెట్లను పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టను కోలుకోకుండా చేశారు. తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టి విజేతగా ఆవిర్భవించారు.

రోహిత్ శర్మను అనుకరించారు

న్యూజిలాండ్ ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఐసిసి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పురుషుల జట్టుపై భారత పురుషుల జట్టు విజయం సాధించింది. వాస్తవానికి దక్షిణాఫ్రికా జట్టు ఆ మ్యాచ్ లో గెలిచే లాగా కనిపించింది . కానీ చివరికి ఒత్తిడి తట్టుకోలేక విజయాన్ని సాధించలేకపోయింది. కీలక దశలో వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. వాటి నుంచి తేరుకోలేక చేతులెత్తేసింది. దీంతో టి20 వరల్డ్ కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికా పై గెలిచిన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంపై అలా పడుకుండిపోయాడు. సుదీర్ఘమైన కలను సాధించిన నేపథ్యంలో అలా తన్మయత్వంలో ఉండిపోయాడు. ఇక దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా అలాగే మైదానంపై పడుకుని ఉండిపోయారు. తొలిసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో.. ఆ తన్మ యత్వంలో తేలిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఐసీసీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఈ ఫోటోను పోస్ట్ చేసింది. నాడు రోహిత్ శర్మ.. నేడు న్యూజిలాండ్ క్రికెటర్లు అంటూ క్యాప్షన్ జత చేసింది. ” లాథమ్ ను అనుసరించలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అనుసరించారు. అది టీమిండియా కెప్టెన్ గొప్పతనం అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.