Virat Kohli : ‘‘టీమిండియాలో కెప్టెన్సీ చేతులు మారుతోంది.. రోహిత్ పగ్గాలు చేపడుతున్నాడట’’ అంటూ గడిచిన వారం రోజులుగా తీవ్రచర్చ నడిచింది. అయితే.. అలాంటిది ఏమీ లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో ఈ చర్చ సద్దుమణిగింది. కానీ.. ఉన్నట్టుండి కోహ్లీ టీ20 కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు మాత్రమే తానే సారధిగా ఉంటాడు. ఈ మెగా టోర్నీ తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతాడు. అయితే.. కోహ్లీ వైదొలగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అది కూడా టీ20కి మాత్రమే ఎందుకు పరిమితం చేశాడు? వరల్డ్ కప్ వంటి భారీ టోర్నీ ముందే ఎందుకు ప్రకటించాడు? అనే చర్చ సాగుతోంది. దానికి సమాధానం చూద్దాం.
ప్రస్తుత క్రికెట్లో ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు కోహ్లీ. అతను టెస్టులు, వన్డేలు కలిపి ఏకంగా 70 సెంచరీలు బాదేశాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన కోహ్లీ.. మొదట్నుంచీ తనదైన దూకుడుతో ఆడుతూ అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పటి వరకు 96 టెస్టులు ఆడిన కోహ్లీ.. 51 సగటుతో 7765 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలున్నాయి. 254 వన్డేలు ఆడిన విరాట్.. 43 సెంచరీలతో సత్తా చాటాడు. మొత్తంగా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు చేశాడు. 55.28 సగటుతో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు సాధించాడు.
అయితే.. గడిచిన కొంత కాలంగా పేలవ ఫామ్ ను ప్రదర్శిస్తూ ఇబ్బంది పడుతున్నాడు కోహ్లీ. రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2019 నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో చివరిసారిగా సెంచరీ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మూడంకెల స్కోరు చేయలేదు. మొన్నటి ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ రాణించలేకపోయాడు.
విరాట్ కోహ్లీ విఫలమవ్వడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ భారమవుతోందని చాలా మంది అంటున్నారు. నాయకత్వ బాధ్యతల కారణంగానే.. కోహ్లీ మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని అభిప్రాయ పడుతున్నారు. వన్డే, టీ20ల్లో కోహ్లీ తీసుకునే నిర్ణయాలు కూడా పలుమార్లు వివాదాస్పదం అవుతున్నాయి. అంతేకాకుండా.. అతను ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయాడు. చివరకు ఐపీఎల్ ట్రోఫీకూడా అందుకోలేదు. దీనికితోడు రెండేళ్లుగా బ్యాటింగ్ లో రాణించలేకపోతుండడంతో.. కెప్టెన్సీ మార్చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. టెస్టు పగ్గాలు కోహ్లీకి ఉంచేసి.. వన్డే, టీ20 పగ్గాలు రోహిత్ కు ఇవ్వాలనే వారి సంఖ్య గట్టిగానే ఉంది. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ట్రోఫీ గెలవడాన్ని కూడా ఇందుకు కారణంగా చూపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి టీ20 కెప్టెన్సీ వదులుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. దీనికి కారణమేంటన్నది ఆరాతీసినప్పుడు.. పరిమిత ఓవర్ల కెప్టెన్ గా కోహ్లీని తప్పించాలనే డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే టీ20 జట్టును అతడు నడిపించాల్సి ఉంది. ఆ టోర్నీలో గనక టీమిండియా విఫలమైతే.. కోహ్లీపై విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. దీంతో.. అనివార్యంగా తప్పుకోవాల్సి వస్తుంది. అది ఒకరకంగా అవమానకరంగా భావించాల్సి ఉంటుంది. అందుకే.. కోహ్లీ ఇప్పుడు ఈ నిర్ణయం ప్రకటించాడని అంటున్నారు.
ఎలాగో వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ గా వైదొలుగుతానని ప్రకటించాడు కాబట్టి.. స్వేచ్ఛగా ఈ టోర్నీని కొనసాగించొచ్చు. ఒకవేళ ట్రోఫీ గెలిస్తే.. గౌరవంగా పగ్గాలు వదిలేయవచ్చు. ఓడినా.. ముందే చెప్పేశాడు కాబట్టి.. పెద్దగా ప్రభావం ఉండదు. ఈ కారణాలు ఆలోచించే కోహ్లీ ఇప్పుడే ఈ నిర్ణయం ప్రకటించాడని అంటున్నారు. మరి, ఎవరికి అప్పగిస్తారనే చర్చ కూడా గట్టిగానే ఉంది. రోహిత్ కే అప్పగిస్తారని అనుకున్నప్పుడే అంత ఈజీగా ఏమీలేదు. ఎందుకంటే.. రోహిత్ వయసు 34. మరో మూడ్నాలుగేళ్లలో రిటైర్ అయ్యే స్టేజ్. కాబట్టి.. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అప్పగించినా ఆశ్చర్యం లేదు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.