Sunil Gavaskar IPL controversy: టీవీలో ఒక సీరియల్ మొదలైతే.. దాని ముగింపునకు చాలా సమయం పడుతుంది. ప్రతిరోజు సాగదీత కార్యక్రమం నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. మహిళలు అధికంగా చూస్తారు కాబట్టి.. పైగా అందులో లాజిక్ లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి.. సీరియల్స్ సంవత్సరాలకు సంవత్సరాలు.. ఎపిసోడ్లకు ఎపిసోడ్లు సాగిపోతూనే ఉంటాయి..
ఇప్పుడు టీవీ సీరియల్స్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే.. ఐపీఎల్ మ్యాచ్ లు సాగుతున్న తీరు కూడా అలానే ఉంది. చాలామంది దీన్ని నోటీస్ చేయలేదు గాని.. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2026 లో మ్యాచ్ లు సాగుతున్న తీరు అత్యంత దారుణంగా ఉందని.. ఇటువంటి సాగదీత కార్యక్రమం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీసీసీఐ పెద్దలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
వాటర్ బాటిళ్ళు ఎందుకు తెస్తున్నారు
మైదానంలో ప్రతి చిన్న విషయానికి రిజర్వ్ ప్లేయర్లు వస్తున్నారు. అకస్మాత్తుగా వారు మైదానంలోకి ప్రవేశిస్తున్నారు. చేతుల్లో వాటర్ బాటిల్స్ పట్టుకుని వస్తున్నారు. వీళ్ల వల్ల మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాలలో మ్యాచ్ నిలిపివేస్తున్నారు కూడా. వాస్తవానికి మైదానంలో 11 మంది ప్లేయర్లు కనిపించాలి. రిజర్వ్ ప్లేయర్ల వల్ల ఒక్కోసారి మైదానం చిన్నపాటి సంతలాగా అనిపిస్తోంది.
కొత్త బ్యాటర్ రావడానికి అంత సమయమా
వికెట్ పడిన తర్వాత.. మైదానంలోకి కొత్త బ్యాటర్ రావడానికి దాదాపు రెండు నిమిషాల వరకు సమయం పడుతుంది. వాస్తవానికి ఒక నిమిషంలోనే బ్యాటర్ రావాల్సి ఉంటుంది. అంత సమయం తీసుకోవడం పట్ల గవాస్కర్ తీవ్రంగా మండిపడుతున్నారు. జట్ల ఆటగాళ్ల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ విధానానికి చెక్ పడాలంటే పెనాల్టీ పరుగులు విధించాలని గవాస్కర్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు కదా
మ్యాచ్ నిర్వహణ సమయం రోజు రోజుకు పెరుగుతోంది. దీనివల్ల ప్రేక్షకులు అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు మైదానంలోకి వచ్చే ప్రేక్షకుల పరిస్థితి మరిత దారుణంగా ఉంది. పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా మారుతుంది. ఇది ఐపీఎల్ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని గవాస్కర్ చెబుతున్నారు..