Sanath Jayasuriya: శ్రీలంక చిమ్మ చీకట్లో ఉండిపోతే.. “సూరీడి”లా ఉదయించి వెలుగులు నింపాడు.. ఇప్పుడు ఏకంగా భారీ ప్రమోషన్ పొందాడు!

టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు లీగ్ దశలోనే తన కథను ముగించింది. చిన్న జట్ల చేతిలో ఓడిపోయి పరువు తీసుకుంది. ఇక మాజీ ఛాంపియన్ పని అయిపోయిందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. దీంతో ఆ జట్టులో సమూల మార్పులు అవసరమని మేనేజ్మెంట్ భావించింది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 8, 2024 10:40 am

Sanath Jayasuriya

Follow us on

Sanath Jayasuriya: శ్రీలంక జట్టు లోకి తాత్కాలిక కోచ్ గా మాజీ ఆటగాడు జయసూర్య ఎంట్రీ ఇచ్చాడు. కేవలం రెండు నెలల్లో జట్టు ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. ఫలితంగా శ్రీలంక జట్టు స్వదేశంలో టీమిండియా పై వన్డే సిరీస్ 2-0, ఇంగ్లాండ్ జట్టుపై ఓవల్ వైదానంలో అద్భుతమైన విజయాలను దక్కించుకుంది. ఇవి మర్చిపోకముందే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుపై రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది.. ఫలితంగా శ్రీలంక జట్టుపై అందరి అంచనాలు మారిపోయాయి. అభిప్రాయాలు వేరయ్యాయి. దీంతో శ్రీలంకతో జాగ్రత్త అనే లాగా ఆ జట్టు పూర్తిగా మారింది. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. జట్టు ఆట తీరు మారిన నేపథ్యంలో శ్రీలంక మేనేజ్మెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. జట్టును అద్భుత విజయాలతో ముందుండి నడిపిస్తున్న జయసూర్యను పూర్తికాలపు కోచ్ గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు జయ సూర్య తాత్కాలిక కోచ్ గా పనిచేశాడు. ఇకపై పూర్తిస్థాయిలో కోచ్ గా జట్టుకు సేవలు అందిస్తాడు. జయ సూర్య 2026 వరకు ఆ పదవిలో కొనసాగుతాడని శ్రీలంక బోర్డు ప్రకటించింది.

జయ సూర్య సలహాలతో..

జయ సూర్య సలహాలతో శ్రీలంక జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. నిస్సాంక లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి.. జట్టు కూర్పును సరికొత్తగా రూపొందించాడు జయ సూర్య. ఇంకా కొంతమంది బౌలర్లకు అవకాశాలు ఇచ్చి జట్టుకు తిరుగులేని బలాన్ని అందించాడు. అందువల్లే శ్రీలంక ఇటీవల వరుస విజయాలను సాధిస్తుంది. జయ సూర్య సలహాలతో త్వరలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో విజేతగా నిలిచేందుకు శ్రీలంక జట్టు అడుగులు వేస్తోంది. ఇక ఇటీవల వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది.. జట్టు దారుణమైన ఓటములను చవి చూడటంతో శ్రీలంక జట్టు కోచింగ్ సిల్వర్ హుడ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ జట్టుకు కోచ్ గా ఉండలేనని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో జట్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జయ సూర్య వైపు శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ మొగ్గు చూపించింది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, మరుసటి ఏడాది టి20 వరల్డ్ కప్ వంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో జయ సూర్యను తాత్కాలిక కోచ్ గా నియమించింది. జట్టు కోచ్ గా తాను కూడా సిద్ధమే అంటూ జయ సూర్య సంకేతాలు ఇచ్చాడు. మేనేజ్మెంట్కు ఇచ్చిన మాట ప్రకారం శ్రీలంక జట్టును మార్చి చూపించాడు. దీంతో అతడి సేవలను దీర్ఘకాలం ఉపయోగించుకునేందుకు శ్రీలంక జట్టు పూర్తిస్థాయి కోచ్ గా నియమించింది. గతంలో శ్రీలంక జట్టుకు జయసూర్య నేషనల్ సెలెక్టర్ గా పని చేశాడు. ప్రస్తుతం కన్సల్టెంట్ గా సేవలు అందిస్తున్నాడు. జై సూర్య ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆటగాడిగా పేరుపొందాడు. 2007లో టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు వన్డేలకు వీడ్కోలు పలికాడు.