Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders: కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ అద్భుతంగా ఆడింది.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్ కతా కు ఈడెన్ గార్డెన్స్ లో చుక్కలు చూపించింది. ఫలితంగా తొలి మ్యాచ్ ఓటమి నుంచి త్వరగానే కోలుకొని.. అభిమానులలో భరోసా నింపింది.
ఈ మ్యాచ్ ప్రారంభంలో దూకుడుగా ఆడిన హైదరాబాద్ బ్యాటర్లు.. ఆ తర్వాత తడబడ్డారు. చివర్లో తేరుకున్నారు. ఒక రకంగా సముద్రపు అల మాదిరిగా ముందుకు వెనక్కి అన్నట్టుగా హైదరాబాద్ ప్లేయర్లు ఆట తీరు ప్రదర్శించారు. అయితే కోల్ కతా జట్టుపై సాధించిన విజయం.. హైదరాబాద్ జట్టులో ఆనందాన్ని నింపితే.. గంటల వ్యవధిలోనే ఐపిఎల్ నిర్వహణ కమిటీ తీసుకున్న నిర్ణయం ఒక రకమైన ఇబ్బందిని కలిగించింది. దీంతో హైదరాబాద్ అభిమానులు కలవర పడుతున్నారు.
కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు కాబట్టి హైదరాబాద్ అంతలా స్కోరు చేయగలిగింది. అయితే అతడికి జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తూ ఐపీఎల్ నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. అభిషేక్ శర్మ ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు నిర్వహణ కమిటీ పేర్కొంది. కేవలం జరిమానా మాత్రమే కాకుండా.. అభిషేక్ ఖాతాలో ఒక డి మెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసింది.. దీని వెనక కారణం ఏమై ఉంటుందనే విషయాన్ని ఐపీఎల్ నిర్వహణ కమిటీ బయట పెట్టలేదు. కాకపోతే తన క్యాచ్ విషయంలో అభిషేక్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఐపిఎల్ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన తప్పిదాన్ని నిర్వహణ కమిటీ ముందు అభిషేక్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 48 పరుగులు చేశాడు. సన్రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొమ్మిదో ఓవర్ ను ముజరబాని వేశాడు. అప్పటికే అభిషేక్ 48 పరుగులు చేసి.. అర్థ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. ముజర బాని వేసిన స్లో బంతిని గట్టిగా కొట్టడానికి అభిషేక్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని వరుణ్ చక్రవర్తి డీప్ స్క్వేర్ లెగ్ వద్ద పట్టుకున్నాడు. ఆ క్యాచ్ మీద అనుమానం రావడంతో ఫీల్డ్ అంపైర్.. వెంటనే థర్డ్ అంపైర్ కు నివేదించాడు. అనేక పర్యాయాలు పరిశీలించిన తర్వాత ఆ క్యాచ్ సరైనదని భావించి థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో అభిషేక్ తీవ్రమైన అసహనానికి గురై.. ఏవేవో మాట్లాడుకుంటూ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. నీతో మ్యాచ్ అతడికి జరిమానా విధించినట్టు తెలుస్తోంది. థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చినప్పటికీ బంతి నేలను తాకినట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిషేక్ శర్మ అవుట్ గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు.
