YS Jagan Mavigan Proposal Controversy: ఏదైనా పరిస్థితిని చూసి వ్యవహారం చక్క పెట్టాలి. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోతే మౌనాన్ని ఆశ్రయించాలి. దానికంటే ఉత్తమం కూడా ఉండదు. అటువంటిది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతికూల పరిస్థితుల్లో సైతం చేస్తున్న వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేస్తున్నాయి. మాట తప్పను మడమ తిప్పను అనే నినాదం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు ఒక మాట చెబితే.. ఆ మాటకు నిర్దిష్టమైన విలువ ఉండాలి. వృధా మాటలు ఆడకూడదు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండానే ఏపీ రాజధానికి సంబంధించిన ప్లాన్ బి ప్రతిపాదన అట్టర్ ప్లాఫ్ గా మారింది. మావిగన్ అనే పేరుతో సరికొత్త రాజధాని ప్రతిపాదన ద్వారా జగన్మోహన్ రెడ్డి కి భారీ డ్యామేజ్ జరిగింది.
* అవినీతి పైనే పోరాడి ఉంటే..
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందరి అభిప్రాయాన్ని తీసుకుని అమరావతి రాజధానిగా ఎంపిక చేశారు. అప్పట్లో ఓకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అటు తరువాత అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేశారు. అందులో సహేతుకమైన కారణాలు కూడా చూపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ మాట్లాడారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని.. అక్కడ శాసన రాజధానిని కొనసాగిస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆయన భావించిన మూడు రాజధానులను నిర్మించలేకపోయారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. వాటిని అడ్డుకోలేరు కూడా.. ఇటువంటి సమయంలో ఆ నిర్మాణాల్లో లోపాలు, అవినీతిని ప్రస్తావిస్తే వర్కౌట్ అయ్యేది.
* భారీ డ్యామేజ్..
జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి అంటూ మావిగన్ పేరుతో చేసిన కామెంట్స్ ఆయనను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి భారీ డ్యామేజ్ చేసింది. ఇప్పటికీ అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారని అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టు బ్రేక్ వేసింది. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన తీసుకుని వచ్చి ఉంటే ప్రజల ఆమోదం కచ్చితంగా లభించేది. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి బయట పెట్టడం మాత్రం.. రాజధానిపై విషం చిమ్ముతున్నట్టే.. ఇప్పటికే ఒక దశ పనులు పూర్తి చేసేందుకు చాలా వేగంగా పనులు సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రత్యామ్నాయం సూచించడం ఏమిటి అనేది సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడని విషయం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకి అనే ముద్రను సొంతం చేసుకున్నారు. ఆ ముద్ర చెరపడం సాధ్యం కావడం లేదు. ఇటువంటి సమయంలోనే ప్లాన్ బి అంటూ ప్రత్యామ్నాయం చూపడం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
