Shikhar Dhawan: టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం.. షాక్ లో అభిమానులు..

టీం ఇండియాలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ స్థాయిలో డాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే విడాకులు తీసుకొని వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న శిఖర్ ధావన్.. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం తీసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 24, 2024 9:56 am

Shikhar Dhawan

Follow us on

Shikhar Dhawan: టీమిండియాలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ స్థాయిలో ఆడే ఓపెనర్ గా పేరు తెచ్చుకున్నాడు శిఖర్ ధావన్. మైదానంలో దూకుడైన వ్యక్తిత్వంతో రఫ్ గా కనిపించేవాడు శిఖర్ ధావన్.. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. బౌండరీలు, సిక్సర్లు అత్యంత సులభంగా కొట్టేవాడు. టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతడు.. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసాడు. శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్ లు, 68 టీ -20 లు ఆడాడు. వన్డేలలో 6,793 రన్స్ చేశాడు. టెస్టులలో 2,315 పరుగులు చేశాడు. టి20 లలో 1,759 పరుగులు సాధించాడు. వన్డేలలో ఏకంగా 17 సెంచరీలు చేశాడు. టెస్టులలో ఏడు శతకాలు బాదాడు. దూకుడు అయిన బ్యాటింగ్ తో టీమిండియా గబ్బర్ గా పేరు తెచ్చుకున్నాడు. విలక్షణమైన వ్యక్తిత్వంతో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2018 ఆసియా కప్ లో హైయెస్ట్ రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం దక్కించుకున్నాడు.

టీమిండియాలోకి 2010లో శిఖర్ ధావన్ ఎంట్రీ ఇచ్చాడు. 2013 మార్చి 14న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 7న ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తన చివరి టెస్ట్ ఆడాడు. 2010 అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 డిసెంబర్ 10న బంగ్లాదేశ్ జట్టుతో శిఖర్ ధావన్ తన చివరి వన్డే ఆడాడు. 2011 జూన్ 4న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టి20 జట్టులోకి ప్రవేశించాడు. ఇక శ్రీలంక జట్టుతో 2021 జూలై 29న చివరి t20 మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్ కెరియర్ విషయానికొస్తే.. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు శిఖర్ ధావన్. 2009 -2010 వరకు ముంబై ఇండియన్స్, 2011-12 దక్కన్ చార్జర్స్, 2013-2018 సన్ రైజర్స్ హైదరాబాద్, 2019-2021 ఢిల్లీ క్యాపిటల్స్, 2022 నుంచి పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

ఆస్ట్రేలియా చెందిన ఆయేషాముఖర్జీ ని శిఖర్ ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె శిఖర్ ధావన్ కంటే 12 సంవత్సరాలు పెద్దది. గతంలోనే ఆమెకు పెళ్లయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు. 2014లో శిఖర్ ధావన్ ద్వారా ఆమె జోరావార్ అనే కుమారుడికి జన్మనిచ్చింది.. 2019లో వారు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రస్తుతం శిఖర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. 2023 అక్టోబర్ 5న ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్, అయేషా కు విడాకులు మంజూరు చేసింది. అయితే వైవాహిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల వల్లే శిఖర్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడని నెట్టింట చర్చ జరుగుతోంది.