Riyan Parag attitude: గొప్ప ఇన్నింగ్స్ ఆడింది లేదు. గొప్ప ప్రణాళిక రూపొందించింది లేదు. వీరోచితంగా ప్లేయర్లలో స్ఫూర్తి నింపింది కూడా లేదు. ఏదో ఇలా వస్తుంటాడు.. అలా వెళ్తుంటాడు. వచ్చేటప్పుడు మాత్రం ఒక రకమైన ఆటిట్యూడ్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. దాంతో అతని మీద అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలను అతడు నిజం చేసుకోలేడు. చివరికి విఫలమై తలవంచుకొని వస్తాడు.
సాధారణంగా ఒక జట్టు సారథి ముందుండి నడవాలి. ఒకవేళ అతడు బౌలర్ అయితే బంతితో.. ఒకవేళ బ్యాటర్ అయితే బ్యాట్ తో సత్తా చూపించాలి. ఐపీఎల్ లాంటి టోర్నీ జరుగుతున్నప్పుడు కెప్టెన్ లు అన్ని విభాగాలలో జట్టును నడిపించాలి. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి. అందువల్లే అన్ని జట్లు కెప్టెన్ల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతుంటాయి. జట్టుకు సారథిగా నియమించే ఆటగాడిని అన్ని విషయాలలో లోతుగా పరిశీలిస్తూ ఉంటాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో మాత్రం కెప్టెన్ అదృష్టం వల్ల బతికిపోతున్నాడు. కేవలం తోటి ప్లేయర్ల ఆటతీరుతో నెట్టుకొస్తున్నాడు. ఇంతవరకు ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. కనీసం 30 పరుగులు కూడా చేయలేదు. ఇలా వస్తున్నాడు.. అలా వెళ్ళిపోతున్నాడు. అలాగని మైదానంలో అతడు చేసే ఓవరాక్షన్ మామూలుగా లేదు. అతడే రియాన్ పరాగ్. రాజస్థాన్ జట్టు సారథిగా కొనసాగుతున్న అతడు.. ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్ లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో గొప్పగా ఆడిన అతడు.. ఇప్పుడు మాత్రం చెత్త ఆటతో విమర్శలు మూట కట్టుకుంటున్నాడు.
చెన్నై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు చేశాడు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగులు చేశాడు.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగులు చేశాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే రాజస్థాన్ జట్టులో జైస్వాల్, వైభవ్, జురెల్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోస్తున్నారు. బౌలింగ్లో ఆర్చర్ అదరగొడుతున్నాడు. అందువల్లే రాజస్థాన్ జట్టు విజయాలు సాధిస్తోంది. ఇప్పటికైనా రియాన్ పరాగ్ తన ఆట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలానే గనక అతడు ఆడితే మాత్రం రాజస్థాన్ జట్టు కొంప కొల్లేరు అవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.