Gambhir Vs Kohli: నిజానికి వారిద్దరు అద్భుతమైన ప్లేయర్లు. 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించినప్పుడు వారిద్దరు జట్టులో ప్లేయర్లు. అప్పుడు మాత్రమే కాదు అనేక సందర్భాలలో వారిద్దరు స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించారు. అయితే ఐపీఎల్ లో జరిగిన ఒక చిన్న గొడవ వారిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఇద్దరినీ శత్రువులను చేసింది. దీంతో ఒకరినీడ మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల ఆ వివాదం తగ్గిపోయింది.. వారిద్దరి మధ్య స్నేహం కుదిరిందని వార్తలు వచ్చినప్పటికీ.. అది నిజం కాదని తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నాడు. వన్ డే ఫార్మాట్లో మాత్రమే విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్ నుంచి కూడా దూరం జరిగాడు. దీనికి ప్రధాన కారణం గౌతం గంభీర్ అని తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత.. తనకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని విరాట్ కోరాడట. దానికి గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదు.. దీంతో విరాట్ ఆ ఫార్మాట్ నుంచి శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు.
వాస్తవానికి అంతకు ముందు నుంచే గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీకి మధ్య గొడవ ఉంది. ఐపీఎల్ లో ఇది జరిగింది. ఆ తర్వాత అది క్రమేపి పూడ్చలేని అగాధం లాగా మారిపోయింది. అయితే 2024 ఐపిఎల్ లో వీరిద్దరి మధ్య వివాదం సమసి పోయింది. వీరిద్దరూ కలిసిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
గౌతమ్ .. విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా వీరిద్దరూ సరిగా మాట్లాడుకోవడం లేదని.. మైదానంలో ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఇదే విషయం మీద జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గిల్.. రోహిత్ శర్మతో సక్రమంగా మాట్లాడుతున్న గౌతమ్ గంభీర్.. కోహ్లీ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోచ్ సీతాన్షు తోనే మాట్లాడుతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇంకా కొన్ని సాగుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
