India Vs New Zealand 1st Test: జోరు మీదున్న టీమ్ ఇండియాను.. వరుస ఓటముల కివీస్ నిలువరించగలదా?: నేటి నుంచి బెంగళూరులో తొలి టెస్ట్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది టెస్ట్ సిరీస్ లను సొంత గడ్డపై ఓటమి లేకుండా టీమిండియా తన ఖాతాలో వేసుకుంది.. మరోవైపు సొంత దేశంలో ఆస్ట్రేలియాపై.. ఇటీవల శ్రీలంకపై సున్నా చుట్టి వచ్చింది న్యూజిలాండ్ జట్టు.. ఈ రెండు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్న స్వామి మైదానంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 16, 2024 9:02 am

India Vs New Zealand 1st Test

Follow us on

India Vs New Zealand 1st Test: అన్ని విభాగాలలో రోహిత్ సేన దూకుడు మీద ఉంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు భారత్ ను ఎంత మేరకు అడ్డుకుంటుందనేది చూడాల్సి ఉంది.. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆ జట్టు తన స్థాయికి మించి ప్రదర్శన చేస్తే నే మరో వైట్ వాష్ ప్రమాదం నుంచి గట్టెక్కుతుంది. లేకపోతే అంతే సంగతులు. అయితే న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారతదేశంలో టెస్ట్ సిరీస్ ను గెలవ లేకపోవడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్ జట్టును భారత్ 2-0 తేడాతో ఓడించింది. అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని.. అత్యంత బలంగా కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ జట్టును ఓడించాలని భావిస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే.. ఈ సిరీస్ ను వైట్ వాష్ చేయడం అత్యంత కీలకం.

కివీస్ జట్టుకు కష్టాలు

బెంగళూరులో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ తను టెస్ట్ కు దూరమయ్యాడు. పేస్ బౌలర్ బెన్ సియర్స్ గాయం బారిన పడి సీరియస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో అనామక ఆటగాడు జాకబ్ డఫి జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం కూడా దారుణంగా ఉంది. ఇటీవల లంక పర్యటనలో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయలేకపోయారు. ఇక భారత్లో అద్భుతమైన పేసర్లు, క్వాలిటీ స్పిన్నర్లను ఎదుర్కోవడం న్యూజిలాండ్ బ్యాటర్లకు అంత సులభం కాదు. కొత్త కెప్టెన్ టామ్ లేథమ్, కాన్వే, మిచెల్ ఫామ్ లో లేరు. బౌలింగ్లో కొత్త పేస్ బౌలర్ విల్ ఓరూర్కే పైనే న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధారపడి ఉంది. స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు భావిస్తున్నది. సీనియర్ ఆటగాళ్లు సౌథి, శాంటర్న్ లంక పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో భారత ను నిలువరించాలంటే న్యూజిలాండ్ తీవ్రంగా కష్టపడాల్సిందే.

వాన ముప్పు

బెంగళూరు నగరంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తొలి టెస్ట్ కు అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అక్కడ వర్షం కురవడంతో రెండు జట్లు కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాయి. బుధవారం బెంగళూరు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం మాత్రమే కాదు వచ్చే నాలుగు రోజులు కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.. అయితే చిన్నస్వామి మైదానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది.

మైదానం ఎలా ఉందంటే..

బెంగళూరు మైదానం బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకు స్వర్గధామం లాగా ఉంటుంది. వాతావరణం లో మార్పుల నేపథ్యంలో కొద్దిరోజులుగా పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. 2022 లో ఈ మైదానంపై జరిగిన చివరి టెస్టులో శ్రీలంక – భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరి లోకి దిగాయి.

జట్ల అంచనా ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్/ సర్ఫ రాజ్, జైస్వాల్, విరాట్, పంత్, రాహుల్, జడేజా, ఆకాష్ దీప్/ కులదీప్, బుమ్రా, సిరాజ్, అశ్విన్.

న్యూజిలాండ్

కాన్వే, లేథమ్( కెప్టెన్), యంగ్, రచిన్, బ్లండెల్, ఫిలిప్స్, బ్రెస్ వెల్/ శాంటర్న్, సౌథి, ఓరూర్కీ, ఎజాజ్.