India vs Bangladesh : వరుణుడు వదిలేలా లేడు.. ఒకవేళ బంగ్లాతో రెండో టెస్ట్ డ్రా అయితే WTC లో భారత్ పరిస్థితి ఏంటి?

భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా రెండవ టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముందడుగు పడకుండా వర్షం చెప్పులో రాయిలాగా బ్రేకులు వేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 10:11 pm

India vs Bangladesh

Follow us on

శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు 35 ఓవర్ల పాటే సాగింది. రెండవ రోజు జోరుగా వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అయితే మ్యాచ్ జరిగేది అనుమానమేనని.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బంగ్లా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు డ్రా అయితే.. భారత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్లడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇప్పటివరకు భారత్ డబ్ల్యుటీసీలో భాగంగా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది..71.67 pct తో తొలి స్థానాల్లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే మిగిలిన 8 మ్యాచ్ లలో మూడింట్లో గెలిస్తే భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ లోకి వెళ్తుంది. ఒకవేళ ఈ టెస్ట్ కనుక డ్రా అయితే భారత్ మిగిలిన 8 మ్యాచ్లలో.. ఐదు కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది.

సవాళ్లు ముందున్నాయి

బంగ్లాదేశ్ జట్టుతో సిరీస్ మిగిసిన తర్వాత భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. ఒకవేళ భారత జట్టు సులువుగా డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్లాలంటే అక్టోబర్లో న్యూజిలాండ్ జట్టుతో జరిగే మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్లీప్ చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే ఐదు టెస్టుల సిరీస్ లో కనీసం రెండు విజయాలు సాధించినా చాలు భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకుంటుంది . స్వదేశంలో జరిగిన గత 12 సిరీస్ లలో భారత్ ఓడిపోలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే మూడు టెస్టుల సిరీస్ లో భారత్ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. పైగా ఉపఖండం పిచ్ లపై న్యూజిలాండ్ ఆటగాళ్లు అంతగా ఆడలేరు .ప్రస్తుతం శ్రీలంక జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు తేలిపోతున్నారు. భారత్ లోని మైదానాలు కూడా దాదాపు శ్రీలంక లాగానే ఉంటాయి. అలాంటప్పుడు మూడు టెస్టుల సిరీస్ భారత జట్టుకు నల్లేరు మీద నడక లాంటిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఈసారి మరింత హోరా హోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు భారత చేతిలో కంగారులు ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అలాంటప్పుడు కచ్చితంగా వారు సర్వశక్తులు వడ్డుతారని తెలుస్తోంది. ఇదే క్రమంలో టీమిండియా తర్వాతి మ్యాచ్ లను సులువుగా తీసుకోకుండా.. గట్టిగా పోరాడి.. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆడాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.