IND Vs BAN: దులీప్ ట్రోఫీ జరుగుతుండగానే.. ఆ ముగ్గురికి ఉద్వాసన.. బంగ్లా టెస్ట్ కు జట్టు ఎంపికలో పూర్తిగా గంభీర్ మార్క్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం సాధించాలని.. ఈసారి ఎలాగైనా టెస్ట్ గద ను దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ జట్టు వరకు ఆడే ప్రతి టెస్ట్ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్లలో నైపుణ్యం పెంచేందుకు దులీప్ ట్రోఫీని సరికొత్తగా నిర్వహిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 9:54 am

IND Vs BAN(1)

Follow us on

IND Vs BAN: దులీప్ ట్రోఫీ జరుగుతుండగానే సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ టెస్ట్ జట్టును ఎంపిక చేసింది.. అయితే ఈసారి ఎంపికలో సాంప్రదాయ విధానానికి బీసీసీఐ చెక్ పెట్టింది. మొహమాటం లేకుండా ముగ్గురు ఆటగాళ్లపై వేటు వేసింది. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కు అవకాశం కల్పించింది. రిషబ్ పంత్ ఇటీవలి ఐపిఎల్ లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. 14 మ్యాచ్లలో 446 రన్స్ చేశాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ అయ్యాడు. సుదీర్ఘ విరమణ తర్వాత అతడు టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా – బీ జట్టుకు ఆడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టులలో టి20 తరహా బ్యాటింగ్ చేసి, అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

స్థానం కోల్పోయారు

పంత్ రీ ఎంట్రీ తో తెలుగు యువకుడు కేఎస్ భరత్ జట్టులో స్థానం కోల్పోయాడు. పంత్ మాత్రమే కాకుండా ధ్రువ్ జురెల్ సెలెక్ట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కు అవకాశం లభించినప్పటికీ.. అతడు కేవలం బ్యాటర్ కేటగిరి లోనే స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఇక ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో ఓవర్ నైట్ స్టార్ అయిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకున్నాడు.. ఇతడితోపాటు దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. బంగ్లా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వారికి అవకాశం లభించలేదు.. ఇక బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశదీప్, యశ్ దయాళ్ కు జట్టులో అవకాశం లభించింది. వీరిలో బుమ్రా, సిరాజ్ మినహా మిగతా వారంతా దులీప్ ట్రోఫీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ కు చోటు దక్కింది.

గౌతమ్ గంభీర్ మార్క్

బంగ్లా దేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టు ఎంపికలో పూర్తిగా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ” అతడు ముక్కుసూటిగా ఉంటాడు.. ఇటీవల శ్రీలంక పర్యటనలో మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ గౌతమ్ గంభీర్ వెనకడుగు వేసే రకం కాదు. అందువల్లే ఆడే వాళ్లకు మాత్రమే అవకాశం కల్పించాడు. ఆడని ఆటగాళ్ల విషయంలో మొహమటానికి తావు ఇవ్వకుండా దూరం పెట్టాడు. అందువల్లే జట్టు కూర్పులో వైవిధ్యం కనిపిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఎంపికైన ఆటగాళ్లు వీరే

రోహిత్ శర్మ(కెప్టెన్), యసస్వి జైస్వాల్, గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాళ్, బుమ్రా.