Shreyas Iyer : గౌతమ్ గంభీర్ శిష్యుడు.. ఇంత దారుణంగా ఆడుతున్నాడేంటి? ఇలా అయితే జట్టులో స్థానం దక్కేదెలా?

ఎంతలో ఎంత మార్పు.. సరిగ్గా మూడు నెలల క్రితం జరిగిన ఐపీఎల్ టోర్నీ ఫైనల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలపడం ద్వారా అతని పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అదే స్థాయిలో విమర్శలు మూటగట్టు కోవాల్సి వస్తోంది. ఈ ఆటగాడు ఇలానే ఆడితే మాత్రం టీమిండియాలో చోటు సంపాదించుకోవడం కష్టమే.

Written By: Anabothula Bhaskar, Updated On : September 1, 2024 8:00 am

Shreyash Iyer

Follow us on

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ లో కోల్ కతా జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అద్భుతమైన కెప్టెన్ గా అవతరించాడు. కోల్ కతా జట్టును దాదాపు పది సంవత్సరాల తర్వాత విజేతగా నిలిపాడు. ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు ట్రోఫీ అందించడంతో శ్రేయస్ అయ్యర్ ఎక్కడికో వెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడు. గంభీర్ శిష్యుడిగా టీమ్ ఇండియాలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాల్సిన వాడు… చోటు దక్కించుకోవడం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.

ఇదేం ఆట తీరు

ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీ జరుగుతోంది.. ఈ దేశ వాళి టోర్నీలో తమిళనాడు జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో తమిళనాడు 286 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ముంబై జట్టు తర్పణ స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫ రాజ్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ ఆటగాళ్లు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే పరిస్థితిని పునరావృతం చేశారు. సూర్య కుమార్ యాదవ్ కు గాయం కావడంతో అతడు అసలు బ్యాటింగ్ లోకి దిగలేదు. తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 379 రన్స్ చేసింది. 82 పరుగులు చేసిన భూపతి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజిత్ రామ్ 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. హిమాన్ష్ సింగ్ ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఆ తర్వాత ముంబై మొదటి ఇన్నింగ్స్ లో 156 రన్స్ మాత్రమే చేసింది. దివ్యాన్ష్ 70 పరుగులు చేశాడు. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రేయస్ అయ్యర్ 2, సూర్య 30, సర్ఫరాజ్ ఆరు పరుగులు మాత్రమే చేశారు. సాయి కిషోర్ 5 వికెట్లు పడగొట్టాడు.

బలహీనతను నిరూపించుకుంటున్నాడు

తమిళనాడు 286 రన్స్ చేసింది. లోకేశ్వర్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తను 5 వికెట్లు సాధించాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ముంబై 223 రన్స్ కు కుప్ప కూలింది. శ్రేయస్ అయ్యర్ 22 పరుగులు చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ సర్ఫరాజ్ సున్నా పరుగులకే చాప చుట్టాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లోనూ శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతికి అవుట్ అయ్యాడు. అలాంటి బంతులు వస్తే శ్రేయస్ మరో మాటకు తావు లేకుండా వికెట్ పోగొట్టుకుంటాడనే ఆరోపణలు గతంలో ఉండేవి. అయితే వాటిని అయ్యర్ మరోసారి బుచ్చిబాబు టోర్నీ ద్వారా నిరూపించాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది భారత్ ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది. చివరి మూడు టెస్టుల్లో ఆడే అవకాశం శ్రేయస్ అయ్యర్ కు లభించలేదు. దానికి కారణం అతడు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోవడమే. అతడు తన బలహీనతను అధిగమించలేక పోతే టీమిండియాలో చోటు సంపాదించుకోవడం కష్టమే అని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.