ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరుకుంటే..పాక్ కు షాక్ తప్పదు.. ఎందుకంటే?

సుదీర్ఘకాలం తర్వాత ఐసీసీ మెగా టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆనందానికి అవధులు లేవు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన దేశంలోని క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేస్తోంది. ప్రపంచ దేశాలకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 3:21 pm

ICC Champions Trophy 2025

Follow us on

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ని ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక రకాల ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఐసిసి టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. దానిని విజయవంతంగా చేపట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక రకాల వ్యూహాలను రచిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడుతుందా? లేదా? అనేది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది.. ఇప్పటికే భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత పది సంవత్సరాలుగా భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఐసీసీ టోర్నీ, ఆసియా కప్ ల సమయంలోనే టీమ్ ఇండియా – పాకిస్తాన్ తలబడుతున్నాయి. ఆసియా కప్ -23 కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఆ టోర్నీలో ఆడేందుకు భారత్ పాకిస్తాన్ వెళ్ళలేదు. ఫలితంగా హైబ్రిడ్ మోడల్ విధానంలో నిర్వహించారు. భారత్ మ్యాచ్ లు మొత్తం శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడ్ విధానంలో జరపాలని బీసీసీ ఎక్కువ పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాకిస్తాన్ వెళ్ళదని.. ఐసీసీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియజేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత్ తమ దేశానికి రావాలని మొండి పట్టుదల కొనసాగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల వేదికగా.. తమ దేశానికి భారత్ రావాలని.. వారికి మెరుగైన ఆతిథ్యం ఇస్తామని ప్రకటించారు. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ లో పర్యటించడం దాదాపు అసాధ్యం.

పాకిస్తాన్ కు కష్టమే..

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించింది. షెడ్యూల్ ను ఐసీసీకి అందించింది. అయితే ఫైనల్ మ్యాచ్ ను లాహోర్లోని గడాఫీ మైదానాన్ని వేదికగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకవేళ భారత్ ఫైనల్ వెళ్తే.. ఫైనల్ వేదిక దుబాయ్ మైదానానికి మారే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ప్రఖ్యాత టెలిగ్రాఫ్ పత్రిక తన నివేదికలో వెల్లడించింది. టెలిగ్రాఫ్ పత్రికలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ దేశంలో భారత్ ఆడకూడదని నిర్ణయించుకుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మొత్తం యూఏఈ వేదికగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఐసీసీ నూతన చైర్మన్ గా జై షా ఎన్నికైన నేపథ్యంలో.. భారత్ డిమాండ్లకు ఐసీసీ తలవంచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.