Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు రోజులు బాగోలేనట్టున్నాయి. ఏ ముహూర్తాన గుజరాత్ జట్టు నుంచి ముంబైకి వచ్చాడో తెలియదు గాని.. వరస షాకులు తగులుతున్నాయి.. ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు.. చివరికి హార్దిక్ పాండ్యా నాయకత్వంలోనూ లీగ్ దశ దాటలేకపోయింది. అత్యంత దారుణమైన ఆటతీరుతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. చివరికి ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ పరాజయం చవిచూసింది. అత్యంత అవమానకరంగా టోర్నీ నుంచి ఎగ్జిట్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఓటమి ఇలా ఉందనుకుంటే.. హార్దిక్ పాండ్యా కు పిడుగు లాంటి వార్తను బీసీసీఐ చెప్పింది. ఇంతకీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటంటే..
ముంబై జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను వాంఖడే వేదికగా లక్నో జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ 75, కేఎల్ రాహుల్ 55 పరుగులు చేసి అదరగొట్టారు. తుషారా, పీయూష్ చావ్లా తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు 196 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ 68, నమన్ ధీర్ 62* పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రవి బిష్ణోయ్, నవీన్ తలా రెండు వికెట్లు తీశారు.
ఈ ఓటమి తో ముంబై జట్టు తల పట్టుకుంటే.. అంతకు మించిన పిడుగు లాంటి వార్తను ఆ జట్టు కెప్టెన్ కు బీసీసీఐ చెప్పింది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై వచ్చే సీజన్లో ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అంతేకాదు 30 లక్షల పాటు అపరాధ రుసుం కూడా విధించారు. హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై ఆటగాళ్లకు కూడా ఫైన్ విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ కు కూడా అపరాధ రుసుం విధించారు. రోహిత్ శర్మ 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50% ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా చెల్లించాలి.
హార్దిక్ పాండ్యా జరిమానాకు గురికావడం ఇది మూడవసారి. ఈ సీజన్లో అతడు రెండుసార్లు అపరాధ రుసుము చెల్లించాడు. అయితే నిబంధనల ప్రకారం మూడవసారి స్లో ఓవర్ రేట్ కొనసాగిస్తే.. దానికి కెప్టెన్ కారణంగా భావించి బీసీసీఐ లీగ్ దశలో ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తుంది. ఇక ప్రస్తుతం ముంబై జట్టు లీగ్ మ్యాచ్లు మొత్తం ముగిశాయి. దీంతో వచ్చే సీజన్లో ప్రారంభ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉండదు. అంటే ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ను హార్దిక్ పాండ్యా లేకుండానే ముంబై ఆడుతుంది. హార్దిక్ పాండ్యా మాత్రమే కాదు ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కూడా నిషేధం ఎదుర్కొన్నాడు.