IPL 2024: షమీ లేకపోయినా.. ఆ స్థాయి బౌలర్ గుజరాత్ జట్టుకు దొరికాడు

షమీకి బదులుగా మరో పేసుగుర్రం సందీప్ వారియర్ ను గుజరాత్ జట్టు తీసుకుంది. ఇతడి ప్రాథమిక ధర 50 లక్షలు గా గుజరాత్ నిర్ణయించింది. 32 సంవత్సరాల సందీప్.. ఇప్పటివరకు ఐపీఎల్ లో 5 మ్యాచ్ లు ఆడాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 22, 2024 9:20 am

IPL 2024

Follow us on

IPL 2024.. మరికొద్ది గంటల్లో 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య చేపాక్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. లీగ్ సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పలు జట్లు కీలక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాయి. కొంతమంది ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో.. వారి స్థానంలో మరొకరిని భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా గాయం కారణంగా మహమ్మద్ షమీ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు షమీ స్థానానికి రీప్లేస్మెంట్ ప్రకటించింది.

షమీకి బదులుగా మరో పేసుగుర్రం సందీప్ వారియర్ ను గుజరాత్ జట్టు తీసుకుంది. ఇతడి ప్రాథమిక ధర 50 లక్షలు గా గుజరాత్ నిర్ణయించింది. 32 సంవత్సరాల సందీప్.. ఇప్పటివరకు ఐపీఎల్ లో 5 మ్యాచ్ లు ఆడాడు. రెండు వికెట్లు తీసుకున్నాడు. 2019 నుంచి 2021 వరకు సందీప్ కోల్ కతా జట్టుకు ఆడాడు. గత సీజన్లో ముంబై జట్టులో ఉన్నాడు. అయితే అతడికి ఆడే అవకాశం లభించలేదు. ఇక మహమ్మద్ షమీ ఇటీవల శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేదు. మైదానంలోకి దిగి బౌలింగ్ వేసేంత సామర్థ్యం అతనికి లేదు. దీంతో అతని స్థానంలో గుజరాత్ జట్టు సందీప్ ను తీసుకుంది. జట్టులోకి పిలుపు రాగానే సందీప్ మైదానంలో వాలిపోయాడు. నెట్స్ లో తీవ్రంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. తాను మెరుపులు మెరిపించేందుకు సిద్ధమని ప్రత్యర్థి జట్లకు సంకేతాలు పంపిస్తున్నాడు.

ఇక ముంబై జట్టు కూడా కీలకమైన మార్పు చేసింది. గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమైన శ్రీలంక బౌలర్ మధుశంక స్థానంలో.. యువ బౌలర్.. సౌత్ ఆఫ్రికా కు చెందిన బచెందిన క్వెనా మాఫాకా ను జట్టులోకి తీసుకుంది. అండర్ 19 ప్రపంచ కప్ లో మఫాకా అదిరిపోయే రేంజ్ లో ఆడాడు. ఆరు మ్యాచుల్లో 21 వికెట్లు తీసి సత్తా చాటాడు. మరి ఈ కొత్త బౌలర్లు అటు గుజరాత్ , ఇటు ముంబై జట్లను ఏ విధంగా ఆదుకుంటారో..
ఎలాంటి ప్రదర్శన చూపిస్తారో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.