Akash Chopra: ఐపీఎల్ వేలంలో అతడిని గనుక కొనుగోలు చేస్తే.. బెంగళూరు నిండా మునిగినట్టే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కు సంబంధించి ఇంకా వేలం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించిన చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఏ జట్టు ఎలాంటి ఆటగాడిని తీసుకోవాలి? ఎవరిని కొనుగోలు చేయాలి? ఎవరిని వదులుకోవాలి? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 9:31 pm

Akash Chopra

Follow us on

Akash Chopra: ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు జట్టుకు సంబంధించి అతడు కామెంట్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కెప్టెన్ డూప్లెసిస్ ను బెంగళూరు జట్టు రిటైన్ చేసుకోదని అన్నాడు. మాక్స్ వెల్ కు కూడా ఉద్వాసన పలుకుతుందని జోస్యం చెప్పాడు. అతడిని తీసుకుంటే బెంగళూరు జట్టు నిండా మునిగిపోతుందని పేర్కొన్నాడు. రజత్ పాటిదార్, గ్రీన్, విరాట్ కోహ్లీ, సిరాజ్ వంటి వారిని రిటైన్డ్ చేసుకునే అవకాశాలుంటాయని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. డూప్లేసిస్ 40వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. అతడిని తొలగించుకోవడానికి బెంగళూరు యాజమాన్యం మొగ్గు చూపుతుందని ఆకాశ చోప్రా పేర్కొన్నాడు. ” మూడేళ్ల పాటు జట్టులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మెగా వేలంలో ఆటగాళ్లను యాజమాన్యాలు సొంతం చేసుకొంటాయి. కానీ డూ ప్లేసిస్ విషయంలో అది సాధ్యం కాదు. దానికి అతని వయసు సహకరించదు.. సిరాజ్ భారత బౌలర్ కావడంతో అతడికి రిటైన్ చేసుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని” ఆకాష్ చోప్రా వివరించాడు. మాక్స్ వెల్ కంటే ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను తీసుకోవడం ఉత్తమమని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.

ఆటగాళ్ల రిటైన్డ్ కు సంబంధించిన నిబంధనలు బీసీసీఐ వెల్లడించిన తర్వాతే ఒక స్పష్టత వస్తుందని ఆకాష్ చోప్రా అన్నాడు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రతిసారి బెంగళూరు ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. కానీ అది సాధ్యం కావడం లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ మెరుగైన ఫలితం రావడం లేదు. ఈ నేపథ్యంలో మెగా వేలాని కంటే ముందు జట్టును మరింత పటిష్టం చేయాలని.. అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన నాయకత్వంలో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. దీంతో పురుషుల జట్టు కూడా కప్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరిగింది. ప్లే ఆఫ్ దాకా బెంగళూరు రెట్టించిన ఉత్సాహంతో ఆడినప్పటికీ .. తదుపరి పోటీలలో తేలిపోయింది. ఫలితంగా ఈసారి కూడా టైటిల్ అనేది అందని ద్రాక్ష అయింది. మరి ఈసారికైనా గట్టి జట్టును నియమించుకొని.. టైటిల్ గెలవాలని బెంగళూరు యాజమాన్యాన్ని అభిమానులు కోరుతున్నారు. అవసరమైతే కొంతమంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకొని.. మిగతా వారందరికీ ఉద్వాసన పలకాలని సూచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని.. బెంగళూరు జట్టు సామర్థ్యాన్ని నిరూపించాలని విన్నవిస్తున్నారు. భారంగా మారిన ఆటగాళ్లను కచ్చితంగా వదులుకోవాలని చెబుతున్నారు.