T20 World Cup 2026 final India vs New Zealand: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్, టీమిండియా తలపడుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో అతడు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు.
అభిషేక్ శర్మ విఫలమవుతున్న నేపథ్యంలో అతడిని పక్కన పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ” అభిషేక్ అవసరమా?” అనే చర్చ విపరీతంగా నడుస్తోంది. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా అభిషేక్ శర్మను పక్కనపెట్టాలని చెబుతున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మని పక్కన పెడితే.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అభిషేక్ శర్మకు ఫైనల్ మ్యాచ్లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే న్యూజిలాండ్ మీద అభిషేక్ శర్మ కు భారీ రికార్డులు లేవు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో అభిషేక్ శర్మ అంతగా ఆకట్టుకోలేదు. అప్పటినుంచి అతడి విఫల ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా టి20 వరల్డ్ కప్ లో కూడా అతడు జింబాబ్వే మీద మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగతా అన్ని మ్యాచ్లలో విఫలమయ్యాడు. కీలకమైన సూపర్ 8, సెమి ఫైనల్లో లో దారుణమైన ప్రదర్శన చేశాడు. ఔట్ కావడం, తనలో తానే తిట్టుకోవడం.. పెవిలియన్ వెళ్ళిపోవడంతో అభిషేక్ శర్మ మీద ఎవరికీ సానుకూల దృక్పథం లేకుండా పోయింది.
అతడు వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్లో రింకు సింగ్ లేదా వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఫైనల్ మ్యాచ్లో కూడా అతనికి ఒక అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు విఫలమైతే.. వచ్చే సిరీస్ లలో అతనికి అవకాశాలు ఇచ్చేది అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిషేక్ దూకుడుగా ఆడుతాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టిస్తాడు.
జట్టులో ఒకవేళ మార్పులు చేస్తే కాంబినేషన్ ఇబ్బందికి గురవుతుంది కాబట్టి.. ఫైనల్ మ్యాచ్లో మార్పులు ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కనుక అభిషేక్ శర్మ టచ్లోకి వస్తే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. 2024 t20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ కూడా ఇదే విధంగా విఫలమయ్యాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ మధ్యలోనే అవుట్ కావడంతో.. విరాట్ కోహ్లీ చివరి వరకు ఉండి ఆడాడు. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతడు చూపించిన తెగువ వల్ల టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల అనంతరం t20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.