CSK Vs Punjab: ఐపీఎల్ లో చెన్నై జట్టుకు అద్భుతమైన చరిత్ర ఉంది. ఐదు సార్లు ఛాంపియన్ గా గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అన్నట్టుగా ఆ జట్టు పరిస్థితి మారిపోయింది. కనీసం సొంత మైదానంలో కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది.. గత ఏడాది దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ఆ జట్టు.. ఈ సంవత్సరం కూడా అదే స్థాయి ఆట తీరుతో అభిమానులను నిరాశ పరుస్తోంది.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన చెన్నై.. సొంత మైదానంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. చెన్నై జట్టు ఇంతటి దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తుందని కలలో కూడా ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. 200కు మించి పరుగుల స్కోర్ చేసినప్పటికీ కాపాడుకో లేదంటే.. ఆ జట్టు బౌలర్లు ఏ స్థాయిలో బౌలింగ్ వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాటర్ల పరంగా కూడా ఆ జట్టు అంత గొప్పగా లేదు. సంజు ఆకట్టుకోలేదు. గైక్వాడ్ స్ట్రైక్ రొటేట్ కు మాత్రమే పరిమితమవుతున్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్లో పంజాబ్ జట్టుపై ఆయుష్ చెలరేగి ఆడటంతో చెన్నై ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అతని కూడా సరిగ్గా ఆడ లేకపోతే చెన్నై జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
చెన్నై జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో బౌలింగ్ వేసాడు. మాట్ హెన్రీ, కాంబోజ్ వంటి వారు వికెట్లు తీసినప్పటికీ.. ధారాళంగా పరుగులు ఇవ్వడంతో చెన్నై జట్టు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. చెన్నై జట్టు బౌలర్ల బౌలింగ్ లోపాన్ని పంజాబ్ జట్టు బ్యాటరు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రియాంష్ ఆర్య 11 బంతుల్లో 39 పరుగులు చేసి.. విధ్వంసం సృష్టించాడు.. సిమ్రాన్ 43, కూపర్ 36, అయ్యర్ 50 పరుగులు చేయడంతో.. 210 రన్స్ టార్గెట్ ను పంజాబ్ కేవలం 18.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.
చెన్నై జట్టు బౌలింగ్ ఈ స్థాయిలో ఉండడం.. తొలి మ్యాచ్ లో బ్యాటర్లు తేలిపోవడం.. వంటి పరిణామాలు ఆ జట్టు అభిమానులను తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇలానే కొనసాగితే ధోని కాదు కదా.. అటువంటి వారు వంద మంది వచ్చినా చెన్నై జట్టు బాగుపడదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
