Arshdeep Singh Controversy: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆటలోనే కాదు.. ఆ ఆట ఆడే క్రికెటర్లు కూడా జెంటిల్మెన్ ల మాదిరిగా వ్యవహరించాలి. అలా కాకుండా లేకి వ్యవహార శైలి సాగిస్తే పరువు పోతుంది. అలా లేకిగా వ్యవహరించిన చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ మొత్తాన్ని కోల్పోయారు. చివరికి అంతర్జాతీయంగా పరువు తీసుకొని.. అనామకంగా మిగిలిపోయారు.
అప్పట్లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్ వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియా ఆటగాడు అండ్రు సైమండ్స్ టీమిండి ఆటగాడు హర్భజన్ సింగ్ ను ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఇది మంకీ గేట్ వివాదంగా నిలిచిపోయింది. ఈ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్ పరువు మొత్తం తీసింది. అంతేకాదు, సైమండ్స్ కూడా తన స్థాయి కోల్పోయాడు. చివరికి కెరియర్ గొప్పగా ఉండగానే.. క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.
మంకీ గేట్ వివాదాన్ని చాలామంది క్రికెటర్లు ఒక గుణపాఠం లాగా తీసుకుంటారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు హుందాగా వ్యవహరించాలని బలంగా అనుకుంటారు. అయితే టీమ్ ఇండియా క్రికెటర్ అర్ష్ దీప్ సింగ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తోటి టీం ఇండియా ఆటగాడు తిలక్ వర్మను ఉద్దేశించి లేకి మాటలు మాట్లాడాడు. ఓయ్ అందేరే అని పిలిచాడు. దీని అర్థం చీకటి.. పరోక్షంగా తిలక్ వర్మ చర్మం రంగును ఎగతాళి చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అర్ష్ దీప్ సింగ్ రేసిస్ట్ లాగా వ్యవహరించాడని.. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అతడిని బిసిసిఐ హెచ్చరించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు మండిపడుతున్నారు.
అర్ష్ దీప్ సింగ్ ఇప్పుడు మాత్రమే కాదు.. ఐపీఎల్ ప్రారంభంలో కూడా వివాదానికి కారణమయ్యాడు. తన స్నేహితురాలిని తీసుకొని హోటల్ గదిలోకి వెళ్ళాడు. అంతేకాదు పంజాబ్ జట్టు ప్రయాణించే బస్సులో తన స్నేహితురాలి పక్కన కూర్చోబెట్టుకొని.. కబుర్లు చెప్పాడు. ఇతడి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని.. బిసిసిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆటగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను హోటల్ గదుల్లోకి తీసుకెళ్లకూడదని సూచనలు చేసింది. అయినప్పటికీ అర్ష్ దీప్ సింగ్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా చర్మం రంగును ప్రత్యేకంగా ప్రస్తావించడం అతడి లేకితనానికి నిదర్శనం.
