CM Vijay Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పరిపాలన మీద దృష్టి పెట్టారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యం షాపులలో గుర్తింపు కార్డు చూపిస్తేనే అమ్మాలని షరతు విధించారు. 18 కాదని.. 21 సంవత్సరాల వయసు ఉంటేనే మద్యం విక్రయించాలని సూచనలు చేశారు.. బడి, గుడి, మసీదు, చర్చి పక్కన వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదని.. అక్కడ ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను పెంచారు. ఇంకా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడులో విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన ఓఏస్డిగా విజయ్ ఒక జ్యోతిష్యుడిని నియమించుకున్నారు. అతడి నియామకం పట్ల అనేక పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఓ ఎస్ డి నియామకాన్ని రద్దు చేశారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేయడం.. బల నిరూపణలో సత్తా చూపించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విజయ్ గురించి చర్చ మొదలైంది.
విజయ్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో.. అతని గురించి బిబిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. తమిళనాడులో ఎన్నికలకు ముందు కరూర్ ప్రాంతంలో విజయ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తీవ్రంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలామంది చనిపోయారు. ఆ సమయంలో విజయ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మహాబలిపురంలో విజయ్ పరామర్శించారు. వారికి ఆర్థికంగా సహాయం అందించారు. ఈ నేపథ్యంలో కరూర్ ప్రాంతంలో జరిగిన దారుణంలో ఓ మహిళ తన కూతురుని కోల్పోయింది. ఆమె ఏడుస్తుంటే విజయ్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో ఆ బాలిక తల్లి కాళ్లు పట్టుకున్నారు. “ఈ ఘటన జరిగిన తర్వాత విజయ్ మాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని అన్నారు. ఆ మాటలను నిలుపుకున్నారు. మార్పు కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాష్ట్రాన్ని మార్చేస్తామని మాకు మాట ఇచ్చారు. ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. అందువల్లే ఆయనకు మేము ఓటు వేశాం. ఆయన చెప్పిన మార్పు గనుక మా కళ్ళ ముందు కనిపిస్తే కచ్చితంగా మేము సంతోషిస్తామని” ఆ బాలిక తల్లి పేర్కొంది.
సెప్టెంబర్లో కరూర్ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 41 మంది ఊపిరి ఆడక చనిపోయారు. వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు.. వారికోసం విజయ్ మహాబలిపురంలో సమావేశం నిర్వహించారు. వారందరిని పరామర్శించారు. పార్టీ తరపున ఆర్థిక సహాయం కూడా అందించారు.
