Polala Amavasya : పొలాల అమావాస్య’రోజు పూజ ఎవరికి చేయాలి? ఎలా చేయాలి?

శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఈ నెలలోనే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు. వీటితో పాటు పొలాల అమావాస్య రోజు వ్రతం పాటించాలని కొందరు పండితులు చెబుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : August 30, 2024 10:48 am

Polala Amavasya 2024

Follow us on

Polala Amavasya :  తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతీ మాసం అమావాస్యతో ముగిసి కొత్త నెల ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం తరువాత వచ్చిన శ్రావణం పొలాల అమావాస్యతో ముగుస్తుంది. శ్రావణమాసంలో వచ్చే పొలాల అమావాస్యకు ప్రత్యేకత ఉంది. జీవితంలో ఇప్పటి వరకు కష్టాలు ఎదుర్కొంటూ, దు:ఖంతో ఉన్న వారు ఈ అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల అవి తొలగిపోతాయని కొందరి నమ్మకం. అందుకే పొలాల అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య రోజున పనులు ప్రారంభిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉపవాసం ఉంటూ దైవ చింతనలో ఉంటారు. అయితే పొలాల అమావాస్య రోజు చేసే పూలు ఎలా ఉంటాయంటే?

శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఈ నెలలోనే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు. వీటితో పాటు పొలాల అమావాస్య రోజు వ్రతం పాటించాలని కొందరు పండితులు చెబుతున్నారు. 2024 ఏడాదిలో పొలాల అమావాస్య సెప్టెంబర్ 2న జరుపుకోనున్నారు. ఈ అమావాస్యను పొలాంబర వ్రతం అని కూడా పిలుస్తారు. ఈరోజున నిష్టతో అమ్మవారిని కొలుస్తూ కొన్ని పూజలు చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి.. ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. అయితే ఈ పండుగను ఎలా జరుపుకోవాలంటే?

పొలాల అమావాస్యకు ముందురోజే ఒక కంద మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. దీనిని పూజ గతిలో పరిశుబ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఆ తరువాత పొలాల అమావాస్య రోజు ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసిన తరువాత పూజకు సిద్ధం కావాలి. ముందుగా తెచ్చుకున్న కంద మొక్కల లేదా పిలకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపుతో వినాయకుడిని, గౌరి దేవిని తయారు చేసుకొని తమలాపాకుపై పెట్టాలి. ఆ తరువాత నైవేద్యంగా వడపప్పు, పానకం, చలిమిడి, కొబ్బరి కాయలు, పండ్లు పక్కన ఉంచుకోవాలి. మొగ పిల్లలు ఉన్నవారు బూరెలు చేసుకోవడం మంచిది. రెండు పసుపు కొమ్ములను దారంతో కట్టి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఆచమనం చేసుకొని, సంకల్పం చెప్పుకొని గణపతి పూజతో ప్రారంభించాలి. ఆ తరువాత అమ్మవారికి షోడశోపచారం పూజ చేసి వ్రత కథను చదవాలి. అయితే వ్రతకథ చదువుతున్న సమయంలో చేతిలో అక్షింతలు ఉంచుకోవాలి. కొన్ని అమ్మవారి మీద వేస్తుండాలి. కథ పూర్తయిన తరువాత కుటుంబ సభ్యులపై అక్షింతలుచల్లాలి. ఇది పూర్తయిన తరువాత అమ్మవారికి దీప, దూపం చేసి నైవేద్యాలను సమర్పించాలి. ముందుగా దారాలకు కట్టిన పసుపుకొమ్ముల్లో ఒకటి అమ్మవారికి కట్టి మరొకటి మహిళలు తమ మెడలో కట్టుకోవాలి. చివరగా తీర్థ ప్రసాదాలతో పూజను ముగించాలి.

అయితే ఈ పూజ సాధ్యం కాని వారు మరో విధంగా చేయొచ్చు. తులసి మొక్కను గంగాజలంతో శుభ్రం చేయాలి. ఆ తరువాత తులసి మొక్క ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. పుష్యాలు, చందనంతో కలిసి తులసిని అలంకరించుకోవాలి. ఆ తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్మరించుకోవాలి. అయితే ఈ పూజ చేసే సమయంలో ఎలాంటి కల్మషం కలిగి ఉండకూడదు. మనసును ప్రశాంతంగా చేసుకున్న తరువాతే పూజా విధానం మొదలుపెట్టాలి.