Homeఆధ్యాత్మికంVastu Shastra Eating Direction: ఈ దిశలో కూర్చొని భోజనం చేస్తే.. మీరు ధనవంతులే..

Vastu Shastra Eating Direction: ఈ దిశలో కూర్చొని భోజనం చేస్తే.. మీరు ధనవంతులే..

Vastu Shastra Eating Direction: భారతీయ సంస్కృతిలో భోజనానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావించిన మన పూర్వీకులు భోజనాన్ని కేవలం ఆకలి తీర్చుకునే ప్రక్రియగా కాకుండా ఒక పవిత్ర యజ్ఞంగా పరిగణించారు. అందుకే భోజనం చేసే ముందు శరీర శుభ్రత, మనసు ప్రశాంతత, కూర్చునే విధానం, చూసే దిశ వంటి అంశాలపై ప్రత్యేకమైన నియమాలు ఏర్పరిచారు. ఇవి కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని భావిస్తారు. ఇలాంటి సమయంలో భోజనం చేసేటప్పుడు కొన్ని సరైన దిశలో కూర్చోవాలని అంటుంటారు. అసలు ఏ దిశలో కూర్చొని భోజనం చేయడం మంచిది?

వాస్తు శాస్త్రం, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని, ఆ శక్తి మన శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుందని పూర్వీకులు నమ్మేవారు. అందుకే ఇంటి నిర్మాణంలోనూ, భోజన పద్ధతులలోనూ దిశలకు ప్రాముఖ్యత ఇచ్చారు. భోజనం చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టుకుని కూర్చోవడం శుభప్రదంగా చెబుతారు.

తూర్పు దిశను అత్యంత శుభదాయకంగా భావిస్తారు. సూర్యుడు ఉదయించే దిశ కావడంతో ఇది శక్తి, ఆరోగ్యం, ఆయుష్షుకు సంకేతంగా చెప్పబడింది. తూర్పు వైపు చూస్తూ భోజనం చేస్తే శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుందని, మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతారు. జీర్ణక్రియ కూడా సక్రమంగా జరిగి శరీరానికి అవసరమైన శక్తి అందుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు తూర్పు దిశగా కూర్చొని భోజనం చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు.

ఉత్తర దిశను ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దిశను కుభేరుడి దిశగా పేర్కొంటారు. ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ధనసమృద్ధి కలుగుతుందని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈ దిశలో భోజనం చేస్తే మానసిక ఉత్సాహం పెరిగి నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందని కొందరు నమ్ముతారు.

దక్షిణ దిశను యమధర్మరాజుతో అనుసంధానిస్తారు. అందుకే ఈ దిశ వైపు చూసి భోజనం చేయడం మంచిది కాదని పెద్దలు హెచ్చరిస్తారు. ఈ దిశలో భోజనం చేస్తే అలసట, మానసిక భారము పెరుగుతుందని అంటారు. అలాగే పడమర దిశ వైపు కూర్చొని భోజనం చేస్తే పెద్దగా మంచి లేదా చెడు ఫలితాలు ఉండవని, సాధారణ ప్రభావమే ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసే సమయంలో ప్రశాంత వాతావరణం కూడా చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక శాస్త్రాలు సూచిస్తున్నాయి. కోపం, ఆందోళన, తొందరపాటు వంటి భావాలతో భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదని చెబుతారు. అందుకే భోజనం సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా, టీవీ లేదా మొబైల్ చూడకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని తినాలని సూచిస్తారు. ఇలా చేస్తే శరీరం ఆహారంలోని పోషకాలను సమర్థంగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పూర్వకాలంలో నేలపై కూర్చొని భోజనం చేసే పద్ధతికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. నేలపై పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటుంది. ఈ విధంగా కూర్చోవడం వల్ల శరీరంలోని నాడులు సమతుల్యంగా పనిచేసి మనసు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు.

భోజనం ముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఇది కేవలం పరిశుభ్రతకే కాకుండా మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుందని అంటారు. అలాగే భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎక్కువగా తాగకూడదని, కొద్దిసేపటి తర్వాత మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version