Shravana Masam 2024: శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు? సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా?

ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయి. దీంతో వాతావరణం చల్లగా ఉంటుంది. శ్రావణమాసంలో దాదాపు తేమగా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : August 7, 2024 8:18 am

Shravana Masam 2024

Follow us on

Shravana Masam 2024: ప్రతీ ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి. కానీ కొన్ని పండుగలు, విశేషాల గురించి చెప్పుకునేటప్పుడు హిందూ క్యాలెండర్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణ మాసం. ఆషాఢ మాసం శూన్యమాసం అయితే శ్రావణ మాసం మొత్తం పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక మాసంగా కొనసాగుతుంది. ఇదే నెలతో పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. నాగుల పంచమి నుంచి రాఖీ పౌర్ణమి పండుగలతో పాటు ప్రతీ రోజూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఉపవాసాలు, నిష్టలతో గడపాలని అంటారు. కొందరు ఈనెల మొత్తం మాంసం ముట్టకుండా ఉంటారు. వీలైతే ప్రతీరోజూ ఉపవాసం ఉంటూ దీక్షలు చేపడుతారు. మహిళలు మంగళ గౌరీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం నోము కుంటారు. ప్రతీ సోమ నుంచి శనివారం వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో మునుగుతారు. ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం ఉంటుందని చెబుతారు. అయితే శ్రావణ మాసంలో మాంసం ముట్టకుండా ఉండడానికి ఆధ్యాత్మిక కారణమే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు. పూర్వ కాలంలో ఈ సమయంలో మాంసం తినకుండా ఇలా ఉపవాసాలతో ఉంటే ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. వారు చెప్పినది పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. అసలు శ్రావణ మాసంలో మాంసం ఎందుకు ముట్టుకూడదు? మాంసం తినకపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయి. దీంతో వాతావరణం చల్లగా ఉంటుంది. శ్రావణమాసంలో దాదాపు తేమగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో ఎటువంటి మాంసం కృతులు తీసుకున్నా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మంసాహార తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల శ్రావణ మాసంలో మాంసం ముట్టకూడదని అంటారు.

ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీంతో వాతావరణం కలుషితమై కోళ్లు, గొర్రెలు వ్యాధుల బారిన పడుతాయి. ఇలా వ్యాధుల బారిన పడిన వాటి మాంసం తినడం వల్ల మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో వాతావరణ కాలుస్యంతో సీజనల్ వ్యాధులు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో వ్యాధులు సోకిన కోళ్లు, గొర్లు తినడం వల్ల మనుషులు జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో శ్రావణ మాసంలో మాంసానికి దూరంగా ఉండాలని చెబుతారు.

ఆయుర్వేద ప్రకారం శ్రావణ మాసంలో మనుషులకు రోగనిరోధక శక్తి పడిపోతుంది. ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో మద్యం లాంటివి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో వైద్యులు సైతం శ్రావణ మాసంలో మాంసం ఆహారానికి దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు.

కొందరు ఏడాది మొత్తం మాంసాహారం తినే వాళ్లు ఈ ఒక్క నెల మొత్తం దూరంగా ఉంటారు. తాము ఏదైనా కోర్కెలు కోరుకొని దైవానుగ్రహం కోసం పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో వారు ఆరోగ్యంగా ఉండడంతో పాటు దైవ చింతనలో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అదీగా వాతావరణం చల్లగా ఉండడంతో శరీరం కొత్త అనుభూతి చెందుతుంది. అందువల్ల వీలైతే శ్రావణ మాసంలో మద్యం, మాంసానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.