దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ వైరస్ పై పరిశోధనలు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే మరో కొత్త వార్త తెర పైకి వచ్చింది. ఇప్పటి వరకు కోవిద్19 వ్యాధిని గుర్తించడానికి 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ సరిపోయేది. కానీ తాజాగా కొన్ని కేసులను అధ్యాయనం చేయగా ఈ 14 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ సరిపోవడం లేదు. కొందరిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు 14 నుంచి 28 రోజుల మధ్య బయటపడుతున్నాయి. దీనివల్ల కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్ కు చెందిన డాక్టర్ నవీన్ వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య హఠాత్తుగా పెరగడానికి ఇదే ముఖ్య కారణం అని డాక్టర్ నవీన్ తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రెండుసార్లు మాత్రమే పరీక్షలు చేసి కరోనా ఉందొ లేదో నిర్దారిస్తున్నారని అనుమానితులకు నెలలో మూడుసార్లు పరీక్షలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని వివిధ రాష్ట్రాలకు తెలియజేశామని.. దీంతో కొన్ని రాష్ట్రాలు ఐసోలేషన్ కాలాన్ని 14 నుంచి 28కి పెంచాయని డాక్టర్ నవీన్ వివరించారు.
ఐసీఎంఆర్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. దాదాపు 250 పట్టణాల్లో ఓ అధ్యయనం చేసి, వైరస్ సోకినవారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని తేల్చింది. కొందరు పేషెంట్లలో 17 22 31 35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతున్నాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది.
ఈ విషయంలో కేరళ ముందు చూపు!
దేశంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదయ్యింది కేరళలోనే, మొదట్నుంచే కేరళ ఈ క్వారంటైన్ పీరియడ్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టిందనే చెప్పవొచ్చు. జనవరి చివరి వారం నుంచే ఆ రాష్ట్రంలో క్వారంటైన్ పీరియడ్ 28గా ఉండటం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఆ రాష్ట్రంలో చాలామందికి కరోనా లక్షణాలు 20 తరువాతనే బయటపడుతున్నాయి. కేరళలోని కన్నూర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నుంచి మనదేశానికి మార్చి 17న వచ్చాడు. 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నాడు. కానీ.. 26 రోజుల తర్వాత అతడికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అలాగే.. మార్చి 15న యూఏఈ నుంచి వచ్చిన 11 ఏళ్ల బాలుడికి.. ఏప్రిల్ 8న అంటే అక్కణ్నుంచి వచ్చిన 24వ రోజున పాజిటివ్ వచ్చింది. కేరళలో ఏకంగా 22 మందికి వైరస్ సోకిన 20 రోజుల తర్వాతే లక్షణాలు బయటపడ్డాయి.