Bhankra Masjid: సమర్ధుడైన వారికి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో పశ్చిమబెంగాల్లో కనిపిస్తోంది. అక్కడ మార్పు అనేది ఇంతకాలం ఎందుకు మరుగున పడిపోయింది.. ఇప్పుడు ఎందుకు వేగంగా మొదలైంది.. ప్రజలకు అభివృద్ధి నుంచి మొదలు పెడితే సంక్షేమ పథకాల వరకు ఎందుకు సక్రమంగా అందుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ ఎందుకు అంత సమర్థవంతంగా పనిచేస్తుంది.. అక్రమార్కులు.. చొరబాటుదారులు ఎందుకు బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారు.. సరిహద్దుల్లో భారత భద్రతా దళం స్వేచ్ఛగా ఎలా పని చేయగలుగుతోంది.. చికెన్ నెక్ రహదారిపై భారత ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో పట్టు ఎలా సాధ్యమైంది.. వంటి వాటిని చేసి చూపిస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి సుబేందు అధికారి.
సుబేందు మమతా బెనర్జీ ప్రభుత్వంలో పని చేసినవాడు. కాకపోతే ఆమె నిర్ణయాలు సరిగా లేకపోవడంతో బయటకు వచ్చాడు. అతడికి బిజెపి అవకాశాలు ఇచ్చింది. సక్రమంగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అతడిని ముఖ్యమంత్రిని చేసింది. అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సుబేందు అధికారి సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.
ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని నిత్యం జాతీయ మీడియాలో నానుతూ ఉన్న సుబేందు అధికారి.. తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.. రాజధాని కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉన్న భాంక్ర మసీద్ (దీనిని గౌరీపూర్ మసీదు అని కూడా పిలుస్తారు) వద్ద నమాజ్ నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మసీదు విమానాశ్రయ రన్ వే కు చాలా దగ్గరగా ఉంది. మసీదులో లైట్లు.. నమాజ్ కోసం ఏర్పాటుచేసిన జలాశయం విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తాయని.. ఇది అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం భావించింది.. ఇక్కడ మసీదు ఉండడంతో అనధికారిక వ్యక్తులు ఆధార్ కార్డులు చూపించి విమానాశ్రయంలోకి ప్రవేశించి.. నమాజ్ చేసేవారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే విమానాశ్రయంలోకి అనధికారిక వ్యక్తులు రావడాన్ని బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అక్కడ నమాజ్ చేయడానికి ప్రభుత్వం నిషేధించింది.
మసీదును మరో సురక్షితమైన ప్రదేశానికి తరలించనుంది. అక్కడ మెరుగైన సౌకర్యాలతో పునర్నిర్మించనుంది. ఇదే కాకుండా విమానాశ్రయ రన్ వే సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచుతుంది. తూర్పు భారతదేశంలో ప్రధాన వ్యాపారమైన హబ్ గా ఉన్న కోల్కతా విమానాశ్రయ భద్రతను మెరుగుపరచడంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనధికారిక వ్యక్తులు ఇకపై ఈ విమానాశ్రయంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. మసీద్ తరలింపు ప్రత్యేక కూడా వేగంగా జరిగిపోతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ స్థలాన్ని అధికారులు చూశారని.. త్వరలోనే నిర్మాణ పనులు కూడా మొదలవుతాయని బెంగాల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
