Janasena Kaulu Rythu Bharosa Yatra: ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించిన జనాసేనాని ప్రజా సమస్యలపై తన గళాన్ని గట్టిగానే విన్పిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో సమస్య ఎక్కడుంటే అక్కడ పవన్ కల్యాణ్ ప్రత్యక్షమవుతున్నారు. అమరావతి ఉద్యమం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణకు వ్యతిరేకంగా పోరాటం, గ్రామాల్లో రోడ్ల సమస్యపై గళం విప్పడంలో జనసేనాని అందరి కంటే ముందున్నారు.
మరోవైపు జగన్ సర్కార్ రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ముఖ్యంగా కౌలు రైతు సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి గాలికొదిలేశారు. దీంతో అప్పుల ఊబిలో కురుకపోయిన అనేకమంది కౌలు రైతులు ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈనేపథ్యంలోనే కౌలు రైతుల పక్షాన పోరాడేందుకు జనసేనాని సిద్ధమయ్యారు.
నేడు అనంతరపురం జిల్లాలో కౌలు భరోసా యాత్రను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పలువురు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. నేరుగా వారి కుటుంబాలతో మాట్లాడి వారి ఆర్థిక స్థితులను పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
కౌలు భరోసా యాత్రలో భాగంగా ఉదయం 9గంటలకు పవన్ కల్యాణ్ పుట్టపర్తి విమానశ్రాయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయనున్నారు. అక్కడి నుంచి 11:20గంటలకు ధర్మవరం రూరల్ లోని గోట్లూరు గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మరో కుటుంబానికి పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించనున్నారు.
అనంతరం అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ యువ రైతు కుటుంబాన్ని జనసేనాని పరామర్శించనున్నారు. ఈ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. అక్కడి నుంచి మన్నీల గ్రామానికి చేరుకోనున్నారు. ఈ గ్రామంలో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా ఆయా కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం చేయనున్నారు.
ఆ తర్వాత ఇదే గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న పలువురు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే కౌలు రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులను సైతం పార్టీ వర్గాలు తెలుసుకొని తగిన విధంగా వారిని ఆదుకునే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పవన్ కల్యాణ్ కౌలు రైతులకు అండగా నిలువడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.