Chandrababu And Pawan Kalyan: ఏపీలో ( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తోంది. జూన్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే కూటమి పాలనాపరంగా బాగానే ఉన్నా.. రాజకీయంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతల వైఖరి కూటమికి చెడ్డపేరు తీసుకొస్తోంది. ముఖ్యంగా నేతల వ్యక్తిగత వ్యవహార శైలి కూటమిపై ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్ననే వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. ప్రధానంగా ప్రభుత్వ పరంగా పనితీరు బాగానే ఉన్నా.. నేతల వైఖరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని వారు అభిప్రాయ పడినట్లు సమాచారం. అందుకే ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకనుంచి నేతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలపరంగా కలిసికట్టుగా వెళ్తూనే… ఎవరికివారుగా పార్టీల క్రమశిక్షణకు బీజం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం, తాజాగా టీటీడీ అధ్యక్షుడు వ్యవహారం దృష్ట్యా ఇకనుంచి నేతల ప్రవర్తన పై ఒక కన్నేసి ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* ప్రభుత్వంపై సంతృప్తి..
ప్రభుత్వ పెద్దలుగా చంద్రబాబు( CM Chandrababu), పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి ఉన్నట్లు సర్వేల్లో తేలినట్లు సమాచారం. అయితే కిందిస్థాయి నేతల వైఖరితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండడం.. దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింతగా హైలెట్ చేస్తుండడంతో.. ప్రభుత్వంపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అందుకే ఇకపై నేతల తప్పిదాల విషయంలో వెనువెంటనే చర్యలకు ఉపక్రమించేందుకు ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వ పనితీరును చూస్తారే తప్ప.. కిందిస్థాయి నేతల తప్పిదాలను పరిగణలోకి తీసుకోరు. కానీ నేతలు క్రమశిక్షణ కట్టు దాటితే అంతిమంగా అది ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ నుంచి కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేయాలని ఆ ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
* తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా..
2024 ఎన్నికల్లో చాలా రకాల అంశాలు పనిచేశాయి. 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లడం వంటివి చూసి.. గెలుపు కోసం చంద్రబాబు, పవన్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వారు వివిధ రంగాల్లో ఉన్న వారి సహకారం తీసుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో వారు కాస్త పట్టు బిగించాల్సి వచ్చింది. ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని తప్పిదాలు జరుగుతుండగా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోంది. అందుకే ఇక్కడ నుంచి అటువంటి తప్పిదాలు జరగకుండా ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇద్దరు నేతలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* క్రమశిక్షణ కమిటీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా.. కూటమి ప్రజాప్రతినిధుల తప్పిదాలను హైలెట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వారికి చిక్కకుండా ఉండేందుకు ఒక క్రమశిక్షణ కమిటీని నియమించేందుకు నిర్ణయించారు. ఈ కమిటీ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.. ఆపై ఎక్కడైనా తప్పిదాలు కనిపిస్తే వెనువెంటనే సరి చేసే అవకాశం ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను చూపి బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనిని ఎంతవరకు అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.