Jagan Vs Sharmila: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా? ముఖం చాటేస్తారా? వెళ్లేందుకు ఇష్టపడడం లేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఫిబ్రవరి 18న రాజస్థాన్ లో వివాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జగన్ హాజరవుతారా? లేదా? అన్నదే చర్చ నడుస్తోంది.
వివాహ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను షర్మిల స్వయంగా అందరికీ అందించారు. ముందుగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ప్రార్ధనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి సోదరుడు జగన్ కు అందజేశారు. అటు తరువాత చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. సీఎం జగన్, భారతి దంపతులతో పాటు పవన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నిశ్చితార్థ వేడుకల్లో జరిగిన ఘటనలతో జగన్ వివాహానికి హాజరవుతారా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.
నిశ్చితార్థ వేడుకల సమయంలో సీఎం జగన్, భారతీ రెడ్డి దంపతులు హాజరయ్యారు. జగన్ తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే జగన్ కంటే భార్య భారతి ఉల్లాసంగా గడిపారు. కానీ షర్మిల అనుకున్న స్థాయిలో అన్న పట్ల ఆత్మీయత చూపలేదు. ఆ విషయంలో బ్రదర్ అనిల్ కుమార్ ఇంకా చొరవ చూపారు. కుటుంబమంతా ఫోటోలు తీసుకున్న క్రమంలో షర్మిల ఉల్లాసంగా కనిపించలేదు. విజయమ్మ కోరిక మేరకు ఆయిష్టతగా ఫోటోకు ఫోజులిచ్చారు.దీంతో జగన్ లో ఒక రకమైన అసహనం కలిగినట్లు ప్రచారం జరిగింది. అందుకే ఆయన వివాహానికి హాజరు అయ్యే అవకాశం తక్కువ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు షర్మిల నిశ్చితార్థ వేడుకలు జరిగిన తర్వాతే పీసీసీ పగ్గాలు అందుకున్నారు. వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి సైతం అదే స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్క ఆరోపణ చేస్తుంటే.. షర్మిల అంతకుమించి కామెంట్స్ చేస్తున్నారు. తన అన్న తనకు అన్యాయం చేశాడని.. కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చాడని.. తన తల్లి విజయమ్మ సాక్ష్యం అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. దీంతో కుటుంబ వ్యవహారం కాస్త రచ్చగా మారింది. ఇటువంటి తరుణంలో షర్మిల కుమారుడి వివాహానికి హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివాహ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. షర్మిల విపక్ష నేతలు డైరెక్షన్ లో పని చేస్తున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో షర్మిల కుమారుడు వివాహానికి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.