IPL 2026 : ఐపీఎల్ అంటే కేవలం లైవ్ మ్యాచ్ మాత్రమే కాదు.. తెర వెనుక చాలా జరిగిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అయితే ఈసారి ఐపీఎల్ కు చాలా ప్రత్యేకత ఉంది. మరో 11 రోజుల్లో ఐపీఎల్ మొదలు కాబోతోంది. ఐపీఎల్ మొదలుకాకముందే ఈసారి చాలా సంచలనాలు జరిగిపోయాయి.
టి20 వరల్డ్ కప్ నాలుగు వారాల పాటు సాగింది. ఈ నాలుగు వారాలు కూడా క్రికెట్ అభిమానులు సరికొత్త క్రీడా ఆనందాన్ని ఆస్వాదించారు. అది పూర్తిగా గానే ఇప్పుడు ఐపీఎల్ మొదలు కాబోతోంది. మరో పదకొండు రోజుల్లో ఈ ధనాధన్ క్రికెట్ టోర్నీ షురూ కాబోతోంది.
20 మ్యాచ్లకు మాత్రమే
ఈసారి ఐపిఎల్ లో మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు ముందుగానే ట్విస్ట్ ఇచ్చేశారు. కేవలం 20 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారు. 28న ఐపీఎల్ లీగ్ మొదలవుతుంది. సొంత మైదానంపై డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు.. హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ వాంఖడే మైదానంలో పోటీ పడతాయి.. ఈ 20 మ్యాచ్ల తర్వాత.. అంతర్జాతీయ పరిస్థితులను తీసుకొని మిగతా షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేదీలను ప్రకటించింది. దీంతో ఐపీఎల్ నిర్వహణ కమిటీ పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
వాయిదా పడుతుందా
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. నిర్వహణ కమిటీ ఈ వార్తలను కొట్టి పారేసింది.. అయితే గల్ఫ్ యుద్ధం వల్ల వివిధ దేశాల నుంచి ప్లేయర్లను ఇండియాకు రప్పించడం ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టి20 వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ ప్లేయర్లు వారి సొంత దేశాలకు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా దుబాయ్ విమానాశ్రయంలో రకరకాల ఆంక్షలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్లేషకులు అంటున్నారు.
తలా పరిస్థితి ఏంటి?
టీం ఇండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని.. ఇప్పటికే జాతీయ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 44 సంవత్సరాలు.. అతడికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు ధోని దాటవేస్తూ వచ్చాడు. ప్రస్తుతం చెన్నై జట్టులోకి సంజు శాంసన్ వచ్చాడు. తన మీద ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడానికి ధోని కి ఇదే అవకాశం. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ధోని పసుపు రంగు జెర్సీ వేసుకోవడం ఇదే చివరి అని తెలుస్తోంది. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్.. రాబిన్ ఊతప్ప.. ధోని రిటర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువకులు హవా కొనసాగిస్తారా
ఇక ఈ ఏడాది ఐపిఎల్ లో కొంతమంది యంగ్ ప్లేయర్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. మెగా వేలంలో హైయెస్ట్ ధర పలికిన ప్రశాంత్ వీర్ (14.2 కోట్లు, సీఎస్కే), కార్తీక్ శర్మ (14.2 కోట్లు, సీఎస్కే), మంగేష్ యాదవ్ (బౌలర్, 5.20 కోట్లు, బెంగళూరు), తేజస్వి దహియ (మూడు కోట్లు, కోల్ కతా), వంటి ప్లేయర్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వేలంలో ఈ ప్లేయర్లు భారీగా ధరను సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఐపీఎల్ లో ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త నాయకుడు వచ్చేసాడు
చెన్నై జట్టుకు సంజు శాంసన్ వెళ్లిపోయిన నేపథ్యంలో.. రాజస్థాన్ జట్టుకు సారధిగా రియాన్ పరాగ్ వ్యవహరించబోతున్నాడు. ఇతడి వయసు 24 సంవత్సరాలు. అయితే రాజస్థాన్ జట్టుకు ఇతడు కేవలం తాత్కాలిక సారధి మాత్రమే. గత ఏడాది పరాగ్ ఎనిమిది మ్యాచ్లలో రాజస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. అందులో రాజస్థాన్ జట్టు రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. చెన్నై జట్టు నుంచి రాజస్థాన్లోకి రవీంద్ర జడేజా వెళ్లిపోయాడు. మొదట్లో రవీంద్రకు జట్టు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరికి మేనేజ్మెంట్ పరాగ్ వైపు దృష్టి సారించింది. ఐపీఎల్ లో రియాన్ పరాగ్ 2019లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఏకంగా 7 సీజన్లు ఆడేశాడు. ఇతను మాత్రమే కాకుండా చెన్నై జట్టుకు సంజు.. కోల్ కతా కు మరో ఆటగాడు.. సారధి అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ చెన్నై జట్టుకు గైక్వాడ్, కోల్ కతా కు రహనే నాయకులుగా వ్యవహరించబోతున్నారు.