Home Blog Page 8672

మనిషి పోలికలతో వున్న చేప

 

చైనాలో కనిపించిన ఓ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

చైనాలోని మియో గ్రామానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి నీటి ప్రవాహంలో ఈ చేప దర్శనమిచ్చినట్లు ఆంగ్ల ప్రతికలు పేర్కొన్నాయి. నీళ్లలో చేప వస్తున్న వీడియోను తీసిన మహిళ వెంటనే చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ వీబోలో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌ అయింది. నీటిలో ఈదుకొంటూ వస్తున్న చేప ముందు భాగం మనిషిని పోలినట్లు కళ్లు, ముక్కు, నోరు కనిపించాయి. ఈ చేపను చూసిన నెటిజన్‌లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇది నిజంగా భయానకం’, ‘ఈ చేపను తినడానికి ఎవరికైనా ధైర్యముందా’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. ఆ చేపను మీరూ చూసేయండి.

మ్యాజిక్ ఫిగర్ కోసం శివసేన జిమ్మిక్కులు!

 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర్ 10) బీజేపీ ప్రకటించడంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు

 

ఇప్పటికే ఎన్సీపీ శరద్ పవర్ ని కలిసి లైన్ క్లియర్ చేసుకున్న శివసేన, మరోవైపు ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ సమావేశమవనున్నట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఆయన నివాసానికి వెళ్లి కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా,డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ వ్యక్తి ఉంటారని మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ సోమవారం(నవంబర్-11,2019)ఉదయం తన పదవికి రాజీనామా చేశారు.

 

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ-శివసేన,ఎన్సీపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50:50ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోడంతో శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఎంఎంటీఎస్ ట్రైన్ ఆక్సిడెంట్ సీసీటీవీ వీడియో

నిన్న కాచిగూడ లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఆక్సిడెంట్ ఎలా జరిగిందో సీసీటీవీ లో రికార్డు అయింది ఆ వీడియో…

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్!

 

ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.

 

ఆధార్‌ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్‌ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.

 

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్ ఇవే..

  • పుట్టిన తేదీ, లింగం విషయంలో తప్పులుంటే: కేవలం ఒక్కసారే మార్చుకోవాలి. మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
  • పేరులో తప్పులుంటే: ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
  • ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.

వెంకటేష్ ‘నారప్ప’ ఫస్ట్ లుక్..!

 

వెంకిమామ మూవీ తర్వాత వెంకటేష్ తమిళ హిట్ మూవీ ‘అసురన్‌’ రీమేక్ లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుంది. కాగా ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి యస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయోధ్యలో రామ మందిరం ప్లాన్!

 

అయోధ్యలో “రామజన్మ భూమి-బాబ్రి మసీదు” ల శతబ్దాల చరిత్రలో దశాబ్దాల కేసులో అంతమ తీర్పు వెలువడిన తర్వాత రామ మందిర నిర్మాణం తెర పైకి వచ్చింది.

 

అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లోనే ఒక ప్లాన్ రూపొందించారు. అదే ప్లాన్ ప్రకారం ఇప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. చంద్రకాంత్ సోంపుర కుటుంబానికి దేశంలోని ఎన్నో ఆలయాలను డిజైన్ చేసిన ఘనత ఉంది. గుజరాత్‌లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం కూడా రూపకల్పన చేసింది ఆయన తాతగారే.

అయోధ్యలో రామ మందిరం ప్లాన్ ఇలా ఉంటుంది.

 

“రామమందిరం పొడవు 270 అడుగులు. వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి. దానికి ఒక వైపున కథా కుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శించవచ్చు. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్. భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. నాలుగు వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దగా, చిన్నగా కట్టినా, మందిరం ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.” అని చంద్రకాంత్ వివరించారు.

 

జగన్ విమర్శలకు జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది.

 

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్బంగా విజయవాడలో జాతీయ విద్య, మైనార్టీ దినో్త్సవం సభలో జగన్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని ప్రశ్నించారు. అయితే, జగన్ వ్యాఖ్యలకు జనసేన సోషల్ మీడియా టీం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్ ?’ అని జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని జనసేన అధికారిక ఖాతాలో రీ ట్వీట్ చేశారు.

 

అలాగే “దిగజారి పోతోన్న భాషాభిమానం” అంటూ సాక్షి పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ను పోస్ట్ చేస్తూ మరో ఘాటు విమర్శ చేసింది జనసేన.

 

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని జగన్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. మెల్లమెల్లగా పదో తరగతి వరకు పెంచాలని భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేస్తున్నారంటూ అన్ని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే, ఈ వ్యాఖ్యలకు స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కలెక్షన్స్: టాప్ 10 టాలీవుడ్ మూవీస్

 

తెలుగు చిత్రాలకు కట్టలతో ముంచెత్తిన సినిమాలు ఇప్పటి తరానికి చెందటం విశేషం. ఎన్నడూ ఊహించని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు దిమ్మ తిరిగేలా చేశాయి. యాభై కోట్లతో కాదు ఏకంగా వందల కొట్లలో కలెక్షన్స్ సాదించి సౌత్ ఇండియా ఇండస్ట్రీకే కాదు , బాలీవుడ్ ని కూడా బెంబెలేత్తింస్తున్నాయి ఈ సినిమాలు. సంక్రాంతి కి రిలీజ్ అయినా మహేష్ సరిలేరు నీకెవ్వరు – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా అత్యధిక లాభాలని అందించిన టాప్ 10 టాలీవుడ్ మూవీస్ పై ఒక లుక్కేస్తే.. (షేర్స్)

 

  • బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ – రాజమౌళి…
  • బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) – : డైరెక్టర్ – రాజమౌళి…
  • సైరా నరసింహా రెడ్డి – 134కోట్లు – డైరెక్టర్ – సురేందర్ రెడ్డి…
  • అల వైకుంఠపురములో – 130కోట్లు(+) నాటౌట్ – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • సరిలేరు నీకెవ్వరు – 124కోట్లు (+)నాటౌట్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి…
  • రంగస్థలం – 119కోట్లు – డైరెక్టర్ సుకుమార్…
  • ఖైదీ నెంబర్ 150 – 102కోట్లు – డైరక్టర్ వివి.వినాయక్…
  • మహర్షి – 101కోట్లు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి…
  • భరత్ అనే నేను – 94కోట్లు : డైరెక్టర్ – కొరటాల శివ…
  • అరవింద సమేత – 88కోట్లు – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • శ్రీమంతుడు – 84కోట్లు – డైరెక్టర్ కొరటాల శివ…

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల విడుదలైన తానాజీ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఆ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిషర్లు వచ్చే వరకు ఇండియా అనే కాన్సెప్ట్ లేదని అన్నాడు. బ్రిటిషర్లు రాకముందు ఇండియా అనే భావన ప్రజల్లో లేదని సైఫ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.

 

సైఫ్ అలీ ఖాన్ అసలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని.. బ్రిటిష్ వారు రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అంతకు 150 ఏళ్ళ కిందటే వాస్కోడిగామా కొలంబస్ లాంటివారు మన దేశాన్ని ఇండియా అని పిలిచారని నెటిజన్లు రిప్లై ఇచ్చారు.

భూరికార్డుల సంస్కరణలే విజయారెడ్డి హత్యకు కారణమా?

 

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ సిబ్బందితో పనిపడుతుంది. కుల – ఆదాయ – స్థానికత ధ్రువపత్రాల గురించో, భూమి సమస్యల గురించో, పట్టాదారు పాసు పుస్తకం గురించో, మరేదైనా అవసరంతోనో రెవెన్యూ కార్యాలయం గుమ్మం తొక్కని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాబట్టే ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

 

ఇటీవల తెలంగాణలో భూరికార్డుల సంస్కరణ చేపట్టారు. కొత్త పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిలో చాలా తప్పులు జరిగాయి. రికార్డుల సరవణ బాగా చేశారని ఒక దశలో రెవెన్యూ సిబ్బందిని మెచ్చుకుని, ఒక నెల జీతం బోనస్ ఇచ్చిన సీఎం కేసీఆర్, తర్వాత వారిని తప్పుబట్టారు. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ రచ్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూశాఖను ప్రక్షాళించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

 

రెవెన్యూ వ్యవస్థ బాగా లేదనీ, రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి సరికొత్త చట్టం తెస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం చెప్పారు. అంతేకాదు పలు వేదికల మీద రెవెన్యూ సిబ్బందిపై ఘాటు విమర్శలు చేశారు. ఒక వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరి పేరిట రాసేయగలడని చెప్పారు.
ఈ నేపధ్యంలోనే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలనీ, సంస్కరణలు తేవాలనీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి.

 

సంస్కరణలు అవసరమా, కాదా?

రెవెన్యూ శాఖలో ఎలాంటి సంస్కరణలు కావాలనే విషయంలో అభిప్రాయ బేధాలున్నాయిగానీ, సంస్కరణలు అవసరమనేది అన్ని వర్గాలూ ఒప్పుకొనే మాట.

 

రెవెన్యూ ఉద్యోగులు అన్ని రకాల చట్టాలు, జీవోలను తెలుసుకుంటూ పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వీరికి పని ఎక్కువ, పలుకుబడి ఎక్కువ. వీరిపై ఆరోపణలు కూడా ఎక్కువే. చాలా సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అందుబాటులోఉండరు. కనుక చట్టవ్యతిరేక మార్గాల్లో పనిచేయించుకునేవారు, చేసేవారూ పెరిగిపోయారు. రెవిన్యూ అధికారులను ఎవరు ఏమీ అనరు ఎందుకంటే భూమి రికార్డులు వాళ్ల చేతుల్లో ఉంటాయి కాబట్టి.

 

ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ వల్ల అటు సిబ్బందీ, ఇటు పౌరులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పనిమీద తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాలంటే, తహశీల్దార్ తోపాటు ఆర్ఐ, వీఆర్వోలు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా తహశీల్దార్లు కలెక్టరేట్లో సమావేశాలనీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల సమావేశాలనీ, శిక్షణ కార్యక్రమాలనీ, మంత్రుల పర్యటనలనీ.. ఇలా రకరకాల పనుల్లో ఉంటారు. దీంతో ఈ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని వెళ్లి వారి చేత పనిచేయించుకోవడం పెద్ద తలనొప్పి.

 

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి?

విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్. ఇతనిది రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని గౌరెల్లి గ్రామం. తన తండ్రి కృష్ణ. వారి అన్నదమ్ముల పొత్తులో 30 కుటుంబాలకు కలిపి సుమారు 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివాదంలో ఉంది. పాస్ బుక్ పొందటం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళాడు. ఆ విషయం లోనే విజయారెడ్డితో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు.(నిజా నిజాలను పోలీసులు విచారిస్తున్నారు).

 

ఏది ఏమైనా చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి ఇలాంటి చర్య జరగటం బాధాకరం.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్

 

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘మై లవ్’ అంటూ సాగే ఈ పాటను శ్రీకృష్ణ, రమ్య బెహెర పాడారు. ఇక గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు.

 

మహిళల భద్రత కోసం.. ప్రత్యేక వాట్సప్ నెంబర్..

 

హైద్రాబాద్ లో దిశ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం వాట్సప్ నెంబర్ 94416 69988ను ఆవిష్కరించారు. మహిళలు ఈ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదులు పంపితే…పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని షీ టీం ఐజీ స్వాతి లక్రా తెలిపారు.

హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఐపీఎస్‌ అధికారిణి సుమతి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పి.శ్రావణ్‌కుమార్‌, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ నాగమణిలతో కలిసి ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరు- 94416 69988ను స్వాతిలక్రా ఆవిష్కరించారు. ఈ నంబరుకు కేవలం వాట్సాప్‌ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోల వివరాలే పంపాలని సూచించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తలపట్టుకుంటున్న జగన్ అనుచరులు

 

శాసనమండలి రద్దు నిర్ణయం జగన్ కి ముందు ముందు గుదిబండ లాగా తయారవబోతుందనిపిస్తుంది. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మండలినే రద్దు చేయటం తన మెడకే చుట్టుకుంటుందా అనిపిస్తుంది. దీనివలన తను సాధించేదేమీ లేకపోవటంతో తన పర్సనాలిటీ పై తన క్యాడరుకే సందేహం ఏర్పడే అవకాశముంది. 2007 లో వైస్సార్ శాసన మండలిని పునరుద్దరించినప్పుడు ముందే మాట్లాడుకొని చక చకా చక్రం తిప్పి పని చక్కపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు జగన్ అలా మోడీతో ముందే మాట్లాడుకొని చేసినట్లుగా అనిపించటం లేదు. ఒకవేళ మోడీ ఈ అసెంబ్లీ తీర్మానాన్ని చుట్టపెట్టి పక్కన పడిస్తే అందరిలో నగుబాటు కాక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసన మండలి రద్దు తీర్మానం పార్లమెంటు ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలిని పునరుద్ధరించమని రాజస్థాన్, అస్సాం అసెంబ్లీలు చేసిన తీర్మానాలు ఆమోదానికి నోచుకోలేదు. 2018 లో కొత్తగా మండలిని ఏర్పాటుచేయమని ఒడిశా చేసిన తీర్మానం అక్కడే వుంది. 2013 లోనే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ శాసన మండలి ఏర్పాటు, రద్దు విషయంలో ఓ జాతీయ విధానం కావాలని నివేదిక సమర్పించింది. ఎప్పుడు బడితే అప్పుడు, కొత్త ప్రభుత్వాలు మండలిని రద్దు చేయకుండా ఈ విధానం కావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో మోడీ తక్షణం నిర్ణయం తీసుకుంటాడనుకోవటం లేదు. అసలు మోడీకి దీనిపై ఎటువంటి అభిప్రాయం వుందో తెలియదు. తన స్వంత రాష్ట్రం గుజరాత్ లో అసలు ఎగువ సభ లేదు. తన హయం లో అందుకోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.

ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఒక్కసారి ఆలోచిద్దాం. మండలి ఇప్పట్లో రద్దు కాదు. ఒకవేళ నిజంగా మోడీ సానుకూలంగా వున్నా అది జరగటానికి కనీసం సమయం పడుతుంది. ఎందుకంటే అది మోడీ ప్రాధాన్యతా అంశాల్లో ఉండదు కాబట్టి. ఈ లోపల మండలి తీర్మానం తిరిగి అసెంబ్లీ కి వస్తుంది. మూడు నెలల లోపల బిల్లు తిరిగి పంపించాల్సివుంది. ఆ తర్వాత అసెంబ్లీ మరలా మండలికి పంపించినా తిరిగి నెలలోపల వాపసు వచ్చేస్తుంది. అంటే నాలుగు నెలల తర్వాత జగన్ అనుకున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. అంటే మండలి రద్దు తీర్మానం కంటే ముందే రాజధాని సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని నెలలకు మూడింట ఒకవంతు మంది రిటైరవుతారు. జగన్ కి మండలి లో మెజారిటీ వస్తుంది. అప్పుడు మండలి రద్దయితే జగన్ అనుచరులే గొడవపెడతారు. చూస్తూ చూస్తూ కొరివితో తలా గోక్కున్నట్లయిందని జగన్ పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఎటూ ఇప్పుడు రద్దుకానిదానికి ఆవేశంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు. పిల్లచేష్టలులాగా ఉన్నాయని ఆయన అనుచరులే గగ్గోలు పెడుతున్నారు. దీన్నిబట్టి జగన్ ఆలోచనాపరుడా ఆవేశపరుడా అనే చర్చ జనంలో నడుస్తుంది. ఇటువంటివి రెండు మూడు జరిగితే జగన్ పరువు గంగలో కలిసి పోతుంది. తస్మాత్ జాగ్రత్త.

By తేజ

మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇరకాటంలో బీజేపీ

 

వైసిపి ప్రభుత్వం అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్టం ఉపసంహరణ పరిణామాలతో బిజెపి పరిస్థితి తీవ్ర ఇరకాటంలో పడుతున్నది. అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న జగన్‌ నిర్ణయంతో కేపిటల్‌కు భూములిచ్చిన రైతుల్లో ఆందోళనలు చెలరేగాయి.

వారి ఆవేదనను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని ఎత్తువేసి పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీని బిజెపి దగ్గర చేసుకుంది. అప్పటి వరకు రాజధాని వికేంద్రీకరణపై ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాల కింద విడిపోయిన ఆ పార్టీ నేతలు తలోమాట మాట్లాడారు.

పవన్‌ కళ్యాణ్‌, బిజెపి నాయకుల సంయుక్త సమావేశం, దానిలో అమరావతిని కొనసాగించాలన్న తీర్మానం ఆమోదించాక బిజెపి పరిస్థితి అడకత్తెరలో పావుచెక్క మాదిరిగా మారింది. శాసనసభలో రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ చట్టం రద్దు బిల్లులు పాసయ్యాయి. అక్కడ బిజెపి ప్రాతినిధ్యం లేకపోవడంతో వైఖరి చెప్పాల్సిన అవసరం రాలేదు.

శాసన మండలిలో టిడిపికి మెజార్టీ ఉండటం, ఛైర్మన్‌ తన విచక్షణాధికారాన్ని ప్రయోగించిన దరిమిలా ప్రభుత్వ బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయి. కౌన్సిల్‌లో బిజెపికి ముగ్గురు సభ్యులు ఉండగా (ఒకరు టిడిపి నుంచి బిజెపిలోకి వచ్చారు) ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి మాధవ్‌ వికేంద్రీకరణను స్వాగతిస్తూనే అన్నీ ఒకేచోట పెట్టాలని విన్యాసాలు చేశారు. మరో సభ్యుడు సోము వీర్రాజు సైతం ఇదే పంధా అనుసరించారు.

అమరావతి కొనసాగాలని బిజెపి తీర్మానించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెపుతుండగా మాధవ్‌, సోము వీర్రాజు అందుకు భిన్నంగా మాట్లాడారన్న వాదనలు చెలరేగుతున్నాయి.

మండలి రద్దుకు విషయంలో సహితం కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే సుమారు 10 రాష్ట్రాల నుండి మండలిలను ఏర్పర్చాలనే తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. జగన్ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొంటే వాటిని సహితం తెరపైకి తేక తప్పదు. అందుకనే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లే అవకాశం కనబడటం లేదు.

విశాఖకు ఎగ్జిక్యటివ్‌ కేపిటల్‌ రాకకు మోకాలొడ్డిందన్న అసహనాలను ఉత్తరాంధ్రలో, మరికొన్ని ప్రాంతాల్లో ఎదుర్కోవాలని ఆ పార్టీ నేతలు మధన పడుతున్నారు. జనసేనతో కుదుర్చుకున్న పొత్తు అమరావతిలో ఏ మేరకు రాజకీయ లబ్ధి పొందగలమని ప్రశ్న ఆ పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. రాజధాని విషయంలో మోకాలడ్డితే చంద్రబాబు హీరో అవుతాడు గాని తాము కాదు గదా అనే సంశయం ఆ పార్టీ వర్గాలను వెన్నంటుతున్నది.

హైకోర్టును కర్నూలులో, అమరావతి, విశాఖల్లో హైకోర్టు బెంచ్‌లు పెట్టాలని వైసిపి సర్కారు శాసనసభలో తీర్మానం చేసింది. హైకోర్టు వ్యవహారం పూర్తిగా న్యాయస్థానాలు, కేంద్రం పరిధిలోనివి. కాబట్టి తమ కోర్టులోకొచ్చిన హైకోర్టు అంశాన్ని ఉపయోగించుకోవాలని బిజెపి తొలుత భావించింది.

రాయలసీమ డిక్లరేషన్‌లో అందరికంటే తామే హైకోర్టును కర్నూలులో పెట్టమన్నాం కనుక వెంటనే ఆ పని చేస్తే వైసిపికి రాజకీయ మైలేజి వస్తుంది మినహా తమకేమాత్రం ఉపయోగపడదని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.

అయితే హైకోర్టు లో 70 శాతం కేసులు కోస్తా ప్రాంతానివే అని, మిగిలిన 30 శాతం మాత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవని తెలుస్తున్నది. అటువంటి పరిస్థితులలో హై కోర్ట్ తరలింపుకు సుప్రీం కోర్ట్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేస్తుందో ప్రశ్నార్ధకరమే. ఇక్కడ హైకోర్టు మార్పుకు, హైకోర్ట్ బెంచ్ లకు ఆమోదం తెలిపితే పలు రాష్ట్రాల నుండి అటువంటి సమస్యలు ఎదురు కావచ్చని బిజెపి అధిష్టానం వెనుకడుగు వేసే అవకాశం లేకపోలేదు.

By నరేంద్ర చలసాని

పవన్ కళ్యాణ్, ఆ రెండు మతాలకు వ్యతిరేకమా..?

 

మతాలకు భిన్నంగా, కులాలకు అతీతంగా, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ.. అన్ని సంప్రదాయాలను గౌరవిస్తూ.. అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు చూపించాలని, ఎన్నో ఆశలతో, ఆశయాలతో, సరికొత్త విధి విధానాలతో బలమైన సంకల్పంతో మర్చి 14, 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “జనసేన” అనే పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే.. అనేక ఆటుపోట్లను ఎదురుకొని ఇప్పటి వరకు పార్టీని నడిపించారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని ఒక మతానికి దగ్గర చేసినట్లుగా తెలుస్తుంది. ఒక మతానికి ఆ పార్టీని ఆపాదించడం అనేది రాత్రికి రాత్రే జరిగిన తంతు కాదు. ఒక్కసారి గతంలోకి వెళ్తే.. పూర్తి వివరాలు బయటకు వస్తాయి.

2019 నవంబర్ లో హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ జనసేన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ విషయంపై ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారమే రేగింది. అనేకమంది క్రైస్తవులు, పవన్ తీరును ఖండించారు. అదే సమయంలో పార్టీ స్థాపనకు సహకరించిన వారు, పవన్ తో చాలా సన్నిహితంగా ఉన్న ( ఆలివర్ రాయ్, రాజురవితేజ్ వంటి) కొంతమంది జనసేన అభ్యర్థులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఈ సంఘటనలతో “జనసేన పార్టీ, క్రైస్తవులకు విరుద్ధం” అనే ముద్రవేశారు.

అలాగే ఈ మధ్య కాలంలో జనసేన విడుదల చేసే కొన్ని అధికారిక పోస్టులకు “జై జగన్మాత” అనడం కూడా జరుగుతుంది. దీనికి తోడు బీజేపీతో పొత్తుపెట్టుకోవడం కూడా జరిగింది. ఈ పోత్తు వల్ల దేశంలో ఎక్కువ శాతం వ్యతిరేకించే.. సిఏఏ, ఎన్ఆర్సి వంటి బిల్లులకు మద్దతు ప్రకటించడం, ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది. తత్ఫలితంగా.. “జనసేన పార్టీ, ముస్లిములకు వ్యతిరేకం” అనే ముద్రవేశారు.

పైన తెలిపిన కారణాల వల్ల, క్రైస్తవుల, ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పవన్ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. అటు క్రైస్తవులకు, ఇటు ముస్లింలకు జనసేన విరుద్ధమో.. కాదో అనేది అప్రస్తుతం. కానీ, ఆ పార్టీ హిందూ సిద్ధాంత పార్టీ అనే ముద్రను వేసుకోవాల్సి వచ్చింది.

మన సంస్కృతిని మారుద్దామా?

 

ఇటీవలే తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. ఫలితాలు మొత్తం అధికార పార్టీ తెరాస కే దక్కాయి. అయితే ప్రజానీకానికి ఈ ఫలితాలు ఆశ్చర్యమేమీ కలిగించలేదు. ఎందుకంటే ఫలితాలు తెరాస కే అనుకూలంగా వుంటాయని ముందుగానే మానసికంగా ఫిక్స్ అయిపోయారు. అలారాకపోతేనే ఆశ్చర్యపోయేవాళ్లు. ఇందులో రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, తెలంగాణాలో తెరాస కి తిరుగులేదనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు పైకి ఒప్పుకోకపోయినా లోపల ఎక్కడో వాళ్ళ గుండెచప్పుడు టక్ టక్ మని అదే చెబుతుంది. రెండోది, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు ప్రధానపాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అది ఇప్పుడు తెరాస కే వుందని కూడా అందరికీ తెలుసు. స్థానికంగా డబ్బులు కూడబెట్టిన వాళ్ళందరూ ఏదోవిధంగా అధికారపార్టీకి దగ్గరవ్వటానికే ప్రయతిస్తారు. ముఖ్యంగా కెసిఆర్ రాజకీయ చాణక్యం తెలిసిన వాళ్ళెవరూ ఆయనతో గొడవపెట్టుకోవటానికి సాహసించరు. అంతమాత్రాన కేవలం డబ్బుతోనే గెలిచారనుకుంటే పొరపాటు. సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ కు తిరుగులేని నాయకుడనే భావం, రాజకీయ చాతుర్యం తో పాటు డబ్బులు కూడా పనిచేస్తాయి. అంతేగాని ఏ ఒక్క అంశం తోనో ఇటువంటి తీర్పు వచ్చిందనుకుంటే పొరపాటు.

ఈవారం మనం అన్ని విషయాలూ మాట్లాడుకోవటం కుదరదు కాబట్టి ఒకే అంశానికి పరిమితమవుదాము. అదేమిటంటే మన దేశ సంస్కృతి ని గురించి. సంస్కృతి అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. వేదాలు, రామాయణ, మహాభారతాల దగ్గర్నుంచి బుద్ధుడి వరకు వీలుంటే ఆ తర్వాత చరిత్ర గురించి కూడా జ్ఞాపకాలు సుడులు తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుకునేది అప్పటి సంస్కృతి గురించి కాదండి ఇటీవల స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన సంస్కృతి గురించి. ఎందుకంటే ప్రతిదేశానికి నడిచే సమాజంలో కొన్ని ప్రత్యేక సంస్కృతులు ఉంటాయి. వాటిని మనం అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూ ఉంటాం. ఉదాహరణకు జపాన్ లో కోపమొచ్చి నిరసన తెలపాలంటే ఎప్పటికన్నా ఎక్కువ గంటలు పనిచేస్తారని అప్పట్లో చదువుకున్నాం. అదెంతవరకు నిజమో తెలియదుగాని ప్రతిదేశపు సమాజాలు కొన్ని ప్రత్యేక సంస్కృతులు కలిగివుంటాయి. ఇప్పుడు మనం వున్న పరిమిత సమయంలో మన సమాజ సంస్కృతి గురించి మాట్లాడుకుందాం.

మనన్ని గురించిమనం తక్కువ చేసిమాట్లాడుకోకూడదుకానీ అప్పుడప్పుడూ ఇటువంటి ముచ్చట్లోనయినా నిజాలు మాట్లాడుకోక పొతే ఎట్లా? మనవాళ్ళు ప్రయాణించే అంతర్జాతీయ విమానాల్లో టాయిలెట్లు శుభ్రంగా ఉండవని ఆనోటా , ఈనోటా వింటుంటాము. దానిమీద ప్రముఖ ఆంగ్ల దిన పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చేవి. అది విన్నాడో ఏమోగానీ మోడీ తను అధికారంలోకి రాగానే ఢిల్లీ ఎర్రకోట నుంచి టాయిలెట్ల గురించి మాట్లాడి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఆరోజునుంచి అదో ప్రాధాన్య కార్యక్రమంగా ముందుకొచ్చింది. కొన్ని లక్షల టాయిలెట్లు ఐదేళ్లలో కట్టటం జరిగింది. ఇంతకీ చెప్పొచ్చేది కట్టటాన్ని గురించి కాదు. అవి ఎంతవరకు వాడుకలోకి వచ్చాయనేదే. దానికి సంబంధించిన లాజిస్టిక్ సమస్యలను గురించికాదు మాట్లాడేది. ప్రజల అలవాట్లగురించి. ఇంట్లో టాయిలెట్ వున్నా ఊళ్ళల్లో బయటకే వెళ్ళేవాళ్ళు వున్నారు. అది సౌకర్యానికి సంబందించినది కాదు, అలవాటుకి సంబందించిన మానసిక సమస్య. అవునా కాదా? దీన్ని మార్చటానికే స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద చేసిన ప్రచారం మంచి సత్ఫలితాలిచ్చింది. టీవీల్లో అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం, వాటిపై ఏకంగా సినిమాలే రావటం లాంటి అనేక కార్యక్రమాలు, ప్రముఖుల మద్దత్తు తో ఇన్నాళ్లు దేశం లో నడుస్తున్న ‘సంస్కృతి’ ని చాలా వరకు మార్చేసింది. చివరకు అత్తగారింట్లో టాయిలెట్ లేకపోతే పెళ్లి కాన్సిల్ అయిన సంఘటనలు కూడా పత్రికల్లో చదివాము. ఇది నా దృష్టిలో విప్లవాత్మకం. అంటే ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఉంటే మన ‘సంస్కృతి ‘ నే మార్చొచ్చని రుజువయ్యింది.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అటువంటి ‘సంస్కృతి ‘ ఇంకోటి కూడా స్వాతంత్రానంతరం సమాజంలో వేళ్లూనుకుంది. అది రాను రాను పెరిగిపోయిన ఎన్నికల్లో ధనప్రభావం. ఈ ‘సంస్కృతి ‘ ని మనం మార్చలేమా? మనిషి తల్చుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. మొదట్లో ఈ ‘సంస్కృతి ‘ తక్కువగానే ఉండేది. కానీ రాను రాను ఎలా అయిపోయిందంటే డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవటం అసంభవం అనేటంతగా. అయితే దానివల్లనే గెలుస్తున్నాడా అంటే కాకపోవచ్చు. కానీ అది గెలవాలంటే వుండే కనీస అర్హతల్లో ఒకటిగా మారిపోయింది. ఇది ఎక్కడిదాకా వెళ్లిపోయిందంటే పెళ్లిళ్లలో వచ్చినవాళ్ళకి భోజనాలు పెట్టటం ఎంత సంప్రదాయమో అంతగా అయిపోయింది. ఓటరు పోటీ చేసే ప్రతి అభ్యర్థి డబ్బులు పంచుతాడని ఆశించటం , దానికి తగ్గట్టుగానే అభ్యర్థులు రెడీ అయిపోవటం సర్వసాధారణమయిపోయింది. చట్టాలు , ఎన్నికల నిబంధనలు కాగితాలకే పరిమితం. ఇందులో ఒక పార్టీ అని లేదు అన్నీ ఆ తానులో ముక్కలే. కాకపోతే తరతమ భేదాలు. అయితే అన్ని రాష్ట్రాలకు ఈ జాఢ్యం పూర్తిగా పాకలేదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ లు ఇందులో ముందువరసలో వున్నాయి.

మరి ఏంచేద్దాం. ఈ జబ్బు కి చికిత్స లేదా? ఎవరికి వాళ్ళం గొణుక్కోవటం, నలుగురం ఒకచోటకూర్చున్నప్పుడు మాట్లాడుకోవటం తప్పిస్తే ఇంకేమీ చేయలేమా? స్వచ్ఛ భారత్ ప్రభుత్వమే చేపట్టింది కాబట్టి ఆపని సులువయ్యింది. కానీ ఎన్నికల్లో ధనప్రభావాన్ని తగ్గించటానికి రాజకీయపార్టీలు ముందుకొచ్చే అవకాశాలు లేవు. ముఖ్యంగా ప్రభుత్వం లోవున్నవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఆపని చేయరు. చేస్తే ఎన్నికల బాండ్ల లాగే ఉంటుంది. ఇది స్వచ్చంద సంస్థలే చేపట్టాలి. ఇటీవల డాక్టర్ జయప్రకాష్ నారాయణ చొరవతో రెండురోజుల వర్కుషాప్ జరిగింది. ఇది ద్విముఖు వ్యూహంతో ముందుకెళ్లాలి. ఒకటి చట్టాల్లో తీసుకురావాల్సిన సంస్థాగత మార్పులు ; రెండోది ప్రజల్ని స్వచ్ఛభారత్ లాగా చైతన్య పర్చటం. మనం రెండోదాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రజలు ఇది అవసరం అని గుర్తించటమే మనం చేయాల్సిన పని. ఒకసారి దీని అవసరాన్ని గురిస్తే తర్వాత ఎవరి అవసరం ఉండదు. దానికి కావాల్సిన ఉదాహరణలు చరిత్రలో ఎన్నో వున్నాయి. దీంట్లో ముఖ్యంగా యువత పాల్గొనగలగాలి. అప్పుడే ఇది విజయవంతమవుతుంది. ఇది రాజకీయ పార్టీలతో సాధ్యం కాదు. అందుకనే ఇది స్వచ్ఛభారత్ అంత తేలిక కాదు. అలాగని కష్టమూ కాదు. ఒకసారి అన్న హజారే వెనక ఉప్పెనలాగా నిలిచారు. మరలా అటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుంది. దీనికి కావాల్సిందల్లా స్ఫూర్తినిచ్చే నాయకత్వం, వాళ్ళ నిజాయితీ మీద యువతకి గురి కుదరటం. ఈ రెండూ జరిగే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. మరి అలవాటుగా మారిన మన ‘ సంస్కృతి ‘ ని మారుద్దామా?

By Ram