Home Blog Page 8597

భారత్‌, చైనాలకు భారీగా ఆయిల్‌ బొనాంజా!

మందగమనంలో సాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ వైపు కరోనా భయాలు వెంటాడుతుండగా మొత్తం ప్రపంచం ఖంగారు పడుతుంటే, ఇదే సమయంలో చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్రరూపం దాల్చడంతో ఆయిల్ ధరలు బాగా తగ్గుముఖం పట్టి, వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకొంటూ ఉంటె భారత్, చైనా లకు మాత్రం భారీగా ఆయిల్ బోనాజా లభించినట్లు యింది.

వచ్చే నెల నుంచి 10 మిలియన్‌ బ్యారల్‌కు పైగా ముడిచమురును ఉత్పత్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది ఈ రెండు దేశాలకు ఎంతో ఉపయోగకరం కానున్నది. ఈ ధరల పోటీలో భారత్‌ సహా పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సోమవారం స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్ల సంపద హరించుకపోయింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి.

సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం దిశగా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతానికి పైగా చమురు ధరలు పడిపోయాయి. 1990లో గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఒకరోజులో ఆయిల్‌ ధరలు భారీగా పడిపోవడం ఇదే తొలిసారి.

తమ దేశంలో చమురు ఉత్పత్తి పెంచి.. తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించాలని రియాద్‌ తీవ్ర ధరల పోరుకు సిద్ధమవడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ ముడి చమురు అత్యల్పంగా 31.02డాలర్ల స్థాయికి పడిపోయింది. ఓపెక్‌ దేశాలకు నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిపై ఒక అవగాహనకు రాలేకపోయాయి.

దీంతో ఆగ్రహించిన సౌదీ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచి..మంచి డిస్కౌంట్లతో తక్కువ ధరకే ముడిచమురును విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిలో కోత విధించే ముందు చమురు డిమాండ్‌పై కరోనా వైరస్‌ పూర్తి ప్రభావాన్ని అంచనా వేయాలని తాము భావిస్తున్నట్లు రష్యా పేర్కొంది. చమురు ధర బ్యారల్‌కు 43 డాలర్ల కన్నా తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బుల్లితెరపై జగ్గుభాయ్..!

ప్రముఖ నటుడు, హీరో జగపతిరావు బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ నిర్వహించే ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్యహరించనున్నారు. ఈ గేమ్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోగా, విలన్ గా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన జగ్గుబాయ్ తాజాగా హోస్ట్ గా మారడం ఆసక్తికరంగా మారింది.

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగా సినిమా రంగానికి జగతిబాబు పరిచమయ్యాడు. దాదాపు వందకు పైగా సినిమాల్లో జగపతిబాబు నటించాడు. తొలి సినిమాలోనే డ్యూయల్ రోల్ చేసిన నటుడుగా జగపతిబాబు చరిత్ర సృష్టించారు. ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ తో నటించి మరో శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచిపేరు సంపాందించుకున్నాడు. తాజాగా బుల్లితెరపై హోస్ట్ గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

బుల్లితెరపై ఇప్పటికే కింగ్ నాగర్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించి సత్తా చాటారు. ఎన్టీఆర్, నానిలు, రోజాలు పలు కార్యక్రమాలకు హోస్ట్ చేశారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ లిస్టులోకి జ‌గ‌ప‌తిబాబు కూడా చేరతుండటం ఆసక్తిని రేపుతోంది.

పిండి కొద్దీ రొట్టె

సాధారణం గా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో సినిమాల‌కు గ‌డ్డు కాల‌మే అనాలి. ఈ రెండు నెలల్లో దేశ‌వ్యాప్తంగా సినిమాలకు వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి ఈ స‌మ‌యంలో పిల్ల‌లంతా ప‌రీక్ష‌ల హ‌డావుడిలో ఉంటారు. పెద్ద‌లు వాళ్ల‌ను విడిచి థియేట‌ర్ల‌కు రారు. పైగా ఈసారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో మ‌రింత‌గా ఆక్యుపెన్సీ త‌గ్గి పోయింది. దరిమిలా ప్రేక్షకులు థియేటర్ లకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దాంతో థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కు స‌రిప‌డా ఖ‌ర్చులు కూడా రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక తెలుగులో కొత్త సినిమాల ప‌రిస్థితి మరింత ద‌య‌నీయంగా మారింది. ద‌క్షిణాదిన ఇత‌ర భాషా చిత్రాల ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కానీ ఇలాంటి అన్ సీజ‌న్లో కూడా ఓ హిందీ సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ప్రముఖ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ కొడుకు టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ న‌డియాడ్‌వాలా నిర్మించిన చిత్రం బాఘీ – 3. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల్ని అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశించారో అవన్నీ సినిమాలో ఉండటం తో ప్రేక్షకులు బాఘీ 3 చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. క‌థ ఏమంత గొప్పగా లేక పోయినా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని యాక్ష‌న్ ఘ‌ట్టాలు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. ఇలాంటి యాక్ష‌న్ సినిమాలు చాలానే వ‌చ్చినా.. ఈ స్థాయి ఆక్షన్ మాత్రం ఇప్ప‌టిదాకా చూసి ఉండ‌క పోవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ చిత్రం వార్‌ను మించిన యాక్ష‌న్ ఈ చిత్రం లో ఉంది. పూర్తి అన్ సీజ‌న్లో రిలీజై కూడా తొలి రోజు ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా రూ.18 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ల‌లో కూడా సినిమా భారీగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది . శ‌ని, ఆదివారాల్లో కూడా ఈ సినిమాకు భారీగా వ‌సూళ్లు వచ్చాయి.మొత్తం మీద ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస‌ర్ల‌లో ఒక‌టిగా బాగి-3 చిత్రం నిలిచే అవ‌కాశ‌ముంది.
Where there is a will there is the way

కాలిపోనున్న కరోనాసురుడు

భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. బాధితులను వేరుగా ఉంచడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలుప్రాంతాలలోని ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా వున్నారు. అయితే ముంబైలో హోలిక దహన్ సందర్భంగా కరోనాసురుని దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.హోలిక దహన్ సందర్భంగా ఈ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.

కరోనాసురుని చేతిలో ఒక సూట్‌కేస్ ఏర్పాటు చేశారు. దానిపై ఆర్థిక మాంద్యం అని రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుండి వచ్చిన తాజా అధికారిక సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,241 కొత్తగా కరోనావైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 95,333 కు చేరుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు మొత్తం 43 కరోనా వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. అయితే ముగ్గురు పాజిటివ్ రోగులు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ,యుపి, కేరళ,జమ్మూ కాశ్మీర్ లలో కొత్త కేసులు నమోదయ్యాయి.

కొరటాల శివ శిష్యుడి దర్శకత్వంలో లావణ్యా..

ఆకర్షణీయమైన, మనోహరమైన రూపానికి అద్భుతమైన అభినయం తోడైతే లావణ్యా త్రిపాఠి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి ఆమె. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి మంచి మంచి పాత్రలు, చిత్రాల్లో నటిస్తున్నారు. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే నిశ్శబ్దంగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు చేస్తున్నారు. ఆమెకు స్క్రిప్ట్‌ నచ్చితే… ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. వంద శాతం బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారు. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా పడతారు. ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను ఆమె నో చెప్పిందంట.

తెలుగులో ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా అది.

తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్‌ రాయప్పన్‌ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తుంది. లావణ్యా త్రిపాఠి అయితేనే ఇలాంటి పాత్రకు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించి, ఆమెను తీసుకున్నట్లు సమాచారం. లావణ్యా త్రిపాఠి ప్రజెన్స్ సినిమాకు వేల్యూ యాడ్ చేస్తుందని దర్శకుడు భావిస్తున్నారు.

Lavanya Tripathi Latest Photos

నీటి కంటే చౌకగా ముడి చమురు…నమ్మగలరా?

ముడి చమురు ఇకపై నీటి కంటే చౌకగా లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అకస్మాత్తుగా 30 శాతానికి పడిపోయింది. దింతో ముడి చమురు భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బారెల్ కు 2,200 రూపాయలకు పడిపోయింది. 1991 గల్ఫ్ యుద్ధం తరువాత ముడి చమురు ధరలో ఇది అతిపెద్ద క్షీణత. ఇది ప్రధానంగా సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించడం వలన జరిగింది. ఒక బ్యారెల్‌లో 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఒక లీటరు ముడి చమురు ధర సుమారు 13-14 రూపాయలుగా వుంది. ఒక లీటరు నీటి బాటిల్ కోసం కనీసం రూ .20 చెల్లించాలనేది అందరికి తెలిసిందే. కాగా కరోనా వైరస్, ఎస్ బ్యాంక్ సంక్షోభం కారణంగా, భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.

సెన్సెక్స్ సుమారు 2357 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా 600 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే, ఎస్ బ్యాంక్ షేర్లు 34 శాతం పెరిగాయి. ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్లో ఇదే అతిపెద్ద క్షీణత. అంతకుముందు ఆగస్టు 24, 2015 న సెన్సెక్స్ 1,624 పాయింట్లకు దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సోమవారం 30 శాతానికి పైగా పడిపోయింది. ముడి చమురు ధరలు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బారెల్ కు 2,200 రూపాయలకు తగ్గాయి.

అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్‌లో ఐసిఇ 33.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి సెషన్‌తో పోలిస్తే 26.51 శాతం క్షీణించింది, ధర బ్యారెల్‌కు 31.27 డాలర్లకు పడిపోయింది. ఒపెక్, రష్యా చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరించకపోవడంతో సౌదీ అరేబియా ధరల యుద్ధంలోకి దిగిందనే వాదన వినిపిస్తోంది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ (ఎనర్జీ అండ్ కరెన్సీ రీసెర్చ్) డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా మాట్లాడుతూ ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.

టిడిపికి మాజీ మంత్రి దొక్కా షాక్!

స్థానిక సంస్థల ఎన్నికల ముందు టిడిపి కి భారీ షాక్‌ తగిలింది. టిడిపి కి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. టిడిపి అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మాణిక్యవరప్రసాద్‌ లేఖలో పేర్కొన్నారు.

రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టిడిపి నేతల చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు.

ఎన్నికల తర్వాత కూడా టిడిపి అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందని పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైసిపి కి మానసికంగా దగ్గరయ్యానని.. అయితే వైసిపి నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని మాణిక్యవరప్రసాద్‌ లేఖలో తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ ను కలసి ఆయన ఆ పార్టీలో చేరవచ్చని ప్రచారం జరుగుతున్నది.

2004, 2009లలో తాడికొండ నుండి శాసన సభకు ఎన్నికైన ఆయన వై ఎస్ రాజశేఖరరెడ్డి, కె రోశయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాలలో పనిచేశారు. 2004లో తాడికొండ నుండి ఓటమి చెందగానే అప్పడు అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీలో చేరి, ఒక కార్పోరేటిన్ చైర్మన్ పదవి పొందారు. ఆ తర్వాత శాసనమండలికి కూడా ఎన్నికై, ప్రభుత్వ విప్ గా వ్యవహరించారు.

2019 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటి నుండి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. రాజశేఖరెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం విముఖంగా ఉన్న సమయంలో `జగన్ లేని ప్రభుత్వాన్ని ఊహించలేక పోతున్నాను’ అంటూ ప్రకటన చేశారు.

కానీ ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి, మరో పార్టీ పెట్టుకున్నా డొక్కా మాత్రం మంత్రి పదవిలో కొనసాగుతూ ఉండడమే కాకుండా, జగన్ పై నిశితంగా విమర్శలు చేస్తూ వచ్చారు.

యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు హైకోర్టులో చివాట్లు!

ఉత్తరప్రదేశ్‌లో `పోలీస్ రాజ్’ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టులో చివాట్లు ఎదురయ్యాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా అధికారులు లక్నోలోని కూడళ్లలో  ఏర్పాటు చేయడంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది.

తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. అడ్వకేట్ శశాంక్ త్రిపాఠి వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై జస్టిస్ గోవింద్ మాతుర్, జస్టిస్ రమేష్ సిన్హాలతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ జరిపి తాజా ఆదేశాలిచ్చింది.

వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా జిల్లా యంత్రాంగం చర్య ఉందని కోర్టు మండిపడింది. వెంటనే హోర్డింగులు తొలగించి ఆ విషయం కోర్టుకు తెలియచేయాలని ఆదేశించింది.

ఇటీవల సీఏఏ నిరసనల్లో హింసాకాండ చెలరేగడంతో అల్లర్లకు పాల్పడిన వారి నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని ప్రకటించిన యోగి సర్కార్ ఈ దిశగా చర్యలు చేపట్టింది.

ఆ క్రమంలోనే సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో హింసాకాండ పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న పలువురు వ్యక్తుల ఫోటోలు, పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను లక్నో జిల్లా యంత్రాగం నగరంలోని కూడళ్లలో ఏర్పాటు చేయడం సంచలనమైంది.

హోర్డింగ్‌ల వల్ల సంబంధితులపై మూకదాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

అప్పుడు సమంతా .. ఇప్పుడు కాజల్ ..?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొరియ‌న్ మూవీస్ రీమేక్ ట్రెండ్ న‌డుస్తోంది. రీసెంట్ గా రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన ఓ బేబితో ఈ ట్రెండ్ మ‌రింత ఊపు అందుకుంది. కొరియ‌న్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా రూపొందిన ఈ సోషియో ఫాంట‌సీ మూవీ.. న‌టిగా స‌మంత‌కి ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు సామ్ బాట‌లోనే ప‌య‌నించేందుకు మ‌రో అగ్ర క‌థానాయిక సిద్ధ‌మైంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్.

‘ఓ బేబి’ నిర్మాతల్లో ఒక‌రైన డి.సురేష్ బాబు మ‌రో రెండు కొరియ‌న్ మూవీస్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వాటిలో ఒక‌టైన ‘మిడ్ నైట్ ర‌న్న‌ర్స్’ ని రెజీనా, నివేదా థామ‌స్ కాంబినేష‌న్ లో చేయ‌నున్న సురేష్.. మ‌రొక‌టైన ‘డాన్సింగ్ క్వీన్’ ని కాజ‌ల్ అగ‌ర్వాల్ తో నిర్మించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఈ రీమేక్ లో కాజల్ తో పాటు ‘అల్ల‌రి’ న‌రేష్ కూడా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి.. ఓ బేబితో సామ్ మెస్మ‌రైజ్ చేసిన‌ట్టే.. ‘డాన్సింగ్ క్వీన్గా’ కాజ‌ల్ కూడా త‌న‌దైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

సిద్ధమవుతున్న కరోనా కమాండో… ఏమి చేస్తారంటే..

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది . చైనా తరువాత ఇటలీలో ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. కరోనా కారణంగా భారతదేశంలో 40 మందికి పైగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి ‘కరోనా కమాండో’ను సిద్ధం చేస్తోంది. వారు ఎక్కడికైనా వెళ్లి కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స అందిస్తారు. ఈ కరోనా కమాండోలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆసుపత్రిలో శిక్షణ ఇస్తున్నారు కరోనా వైరస్ పై పోరాటానికి కెజిఎంసి ఈ ప్రయత్నం చేసింది. కరోనా కమాండోలకు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పల్మనరీ విభాగంలో శిక్షణను ప్రారంభించారు.

నెల రోజుల పాటు సాగే శిక్షణలో కరోనాను ఉపశమింపజేసే విధానాలను తెలియజేయనున్నారు. కరోనా కమాండో అని ఈ బృందానికి పేరు పెట్టారు. అతిపెద్ద ఐసియు యూనిట్‌ను దీనికి అనుసంధానించారు. ఇది కరోనావైరస్‌తో పోరాడటానికి, రోగి కోలుకోవడానికి ఉపకరిస్తుంది. కరోనావైరస్ పై పోరాడటానికి వైద్యుల బృందం అవసరం అయినప్పటికీ, కరోనా కమాండోల బృందం అక్కడికి వెళ్లి వారికి చికిత్స అందించవచ్చు. ఈ యూనిట్ ను డాక్టర్ వేద ప్రకాష్ స్వయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ కమాండోలు ఇతర ఆసుపత్రుల వైద్యులకు నిరంతరం కరోనావైరస్ తో పోరాడటానికి శిక్షణ ఇస్తున్నారు. భారతదేశంలోని ఉత్తమ ఐసియు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పల్మనరీ విభాగానికి చెందిన హెచ్ఓడి వేద్ ప్రకాష్, కరోనా కమాండోలు అనే బృందాన్ని సిద్ధం చేశారు. వీరు శీఘ్ర ప్రతిస్పందన రెస్క్యూ టీం మాదిరిగా వ్యవహరిస్తారు. డాక్టర్ వేద్ ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బృందం గత ఒక నెల రోజులుగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు శిక్షణ ఇచ్చిందన్నారు.

చిరంజీవి కాకుండా మరొకరైతే చేసేది కాదట…

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 152వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “ఆచార్య” అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో దానిలో రెజీనా ఈమధ్య ఆడి పాడింది. దాదాపుగా ఆరు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ పాటకు సంబంధించి రెజీనా మాట్లాడుతూ చిరంజీవి గారు కాబట్టే తాను స్పెషల్ సాంగ్ చేసానని, చిరంజీవితో అవకాశం రావడం అంటే దానిని తాను ఎలా వదులుకుంటానని, తనకు డాన్స్ అంటే ఇష్టమని చిరంజీవి గారి డాన్స్ చూసి తాను చాలా నేర్చుకున్నానని, నా డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి చిరంజీవి గారు పొగడటం కూడా జరిగిందని ముచ్చట్లు చెబుతుంది.

దయచేసి ఈ సాంగ్ ను స్పెషల్ సాంగ్ లా చూడవద్దని, దీనిని సెలబ్రేషన్ సాంగ్ అనాలని కొత్త అర్ధాలు చెబుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ముందుగా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించవలసి ఉన్నా ఇప్పుడు అతడి ప్లేస్ లో మహేష్ బాబు మెరవనున్నాడు. దాదాపుగా మహేష్ బాబు 30 నిమిషాల పాటు కనపడనున్నాడు. ఈ సినిమాను వచ్చే దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

సంక్రాంతి అయిపొయింది ఇక దసరా పని పడతా

ఎన్నడు లేని విధంగా 2020 సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమలో ఆనంద సంబరాలు తీసుకొచ్చింది . ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సినీ పరిశ్రమ చవి చూసింది. అందులో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకంగా, గుర్తుండి పోయేలా ఆనందానుభూతి మిగిల్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో తెలుగునాట బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. ఏకంగా 162 కోట్లకు ఫైగా వసూళ్లను రాబడుతోంది. ఇంకా రాబడుతూనే ఉంది. అమెరికాలో అయితే 3 .65 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డుగా మిగిలింది. రికార్డు పరంగా యు ఎస్ ఏ లో తెలుగు చిత్రాల వసూళ్ల పరంపరలో మూడో స్థానం లో నిలిచింది. అంతటి ఆనందం మిగిల్చిన చిత్రం తరవాతి మూవీ కూడా ప్రత్యేకం గా నిలవాలని బన్నీ ప్లాన్ వేస్తున్నాడు.

బన్నీ సినీ కెరీర్ కి ఆర్య చిత్రం కి ఉన్న లింక్ ప్రేక్షకులు అంత త్వరగా మరువలేరు. అల్లు అర్జున్ నటించిన ఈ రెండో చిత్రం తెలుగు సినిమాకి ఒక కొత్త దారి చూపడమే కాదు, బన్నీ కి కూడా ఒక గట్టి పునాది అయ్యింది. ఇదే చిత్రం తో సుకుమార్ అనే ఒక ఇంటలిజెంట్ డైరెక్టర్ తెలుగు సినిమా కి పరిచయ మయ్యాడు. ఈ దర్శకుడు ఆర్య తరవాత 100 % లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి మరుపురాని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకి అందించి తన సత్తా ఏమిటో చూపించాడు. ఇపుడు తాజాగా అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకి అందించా బోతున్నాడు. శేషాచలం అడవుల్లో జరుగుతున్న గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని మిగిల్చేలా సుకుమార్ మల్చబోతున్నాడు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా , ఆఫీసర్ గా రెండు భిన్న కోణాల్లో ఈ చిత్రంలో కనిపించి ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు అని అంటున్నారు. 2020 దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్రం మరో అద్భుత విజయాన్ని అల్లు అర్జున్ కి అందిస్తుందని బన్నీ సన్నిహితులు అంటున్నారు. కాగా ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Nothing succeeds like success

పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి జంప్!

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న పాత నల్గొండ జిల్లాలో బలమైన పట్టు గల కోమటిరెడ్డి సోదరులు ఆ పార్టీలో కొనసాగే విషయమై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఎవ్వరిని నీయయించినా కలసి పనిచేస్తామని చెప్పుకొంటూ వస్తున్న ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలం రెడ్డి నోటా ఇప్పుడు పార్టీ మార్పు గురించి మాట్లాడు వెలువడుతున్నాయి.

ఈ సారి పిసిసి అధ్యక్ష పదవి తమకు రాని పక్షంలో బీజేపీలో చేరాడమొ లేదా సొంతంగా పార్టీ పెట్టుకోవడమే చేస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పిసిసి నాయకత్వం కోసం కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టడం తెలిసిందే. రాజగోపాలరెడ్డి అన్నగారైన వెంకటరెడ్డి సూర్యాపేట ఎంపీగా ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు రంగం సిద్ధం చేసుకున్నా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువనే భావనతో ఇక్కడే ఉండిపోయారు.

ప్రస్తుత పిసిసి అధినేత ఉత్తమకుమార్ రెడ్డి నాయకత్వంలో వరుసగా కాంగ్రెస్ పార్టీ పరాజయాలను ఎదుర్కొంటూ, తెలంగాణాలో పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్నా ఆయనను మార్చడానికి పార్టీ అధిష్టానం కాలయాపన చేస్తూ ఉండడం పట్ల కోమటిరెడ్డి సోదరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి కనీసం రెండు సార్లు పిసిసి అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు చేసి, మధ్యలో ఆగిపోవడం తెలిసిందే. తెలంగాణలో టి ఆర్ ఎస్ ను ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీని అధికారమలోకి తీసుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నదని చెబుతూ, అందుకు తమకు పార్టీ నాయకత్వం ఇవ్వడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని చెబుతూ సీఎం కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల కారణంగానే కేసీఆర్ గెలిచారని అంటూ కాంగ్రెస్ పార్టీ నేడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు.

మంత్రులకు తెలియకేండానే కేంద్రంలో కీలక నిర్ణయాలు!

కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవ్వరు? పలు కీలకమైన నిర్ణయాలు మంత్రులతో సంబంధం లేకుండానే అమలుకు నోచుకొంటూ ఉండడంతో ఇటువంటి అనుమానం కలుగుతున్నది. ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించే సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంత్రిత్వ శాఖలో జరిగిన తాజా నిర్ణయం ఈ సందర్భంగా వివాదాస్పదంగా మారుతున్నది.

రెండు మలయాళ వార్తా ఛానళ్లపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ తీసుకున్న నిర్ణయం సంబంధిత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియకుండానే వెలువడిన్నట్లు తెలుస్తున్నది.

మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియకుండానే జరిగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్.బీ.ఏ. అధ్యక్షుడు రజత్ శర్మ డిమాండ్ చేయడం గమనార్హం. కేరళలో ఉన్న ఏషియానెట్ న్యూస్‌తో పాటు మీడియా వన్‌ ఛానల్ పై నిషేధం విధించడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

గతంలో పెద్ద నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం కూడా అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వు బంక్ లతో సంబంధం లేకుండా జరిగిన్నట్లు వార్తా కధనాలు వచ్చాయి. గత ఏడాది బాలాకోట్ లో వైమానిక దాడుల విషయం కూడా అప్పటి రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ కు తెలియకుండానే జరిగిన్నట్లు చెబుతారు.

వంటింటి నుండి ఆర్ధిక వ్యవహారాలలోను మగువల పైచేయి!

ఆడవాళ్లు ఇంకెంతో కాలం వంటింటికి పరిమితం కావడం లేదు. ఇప్పుడు మొత్తం ఇంటి బాధ్యతల్నే తలకెత్తుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో ఇల్లాలిదే పైచేయిగా నిలుస్తున్నది. పొదుపు, కష్టార్జితాలపై వారిలో పెరిగిన అవగాహన.. ఇంటికి ఆర్థిక మంత్రులుగా చేసేసింది. పురుషులతో ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్న మగువలు.. అటు సంపాదన, ఇటు పెట్టుబడుల్లోనూ దూసుకుపోతున్నారు.

ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ స్క్రిప్‌బాక్స్‌ చేసిన అధ్యయనంలో పొదుపు, సంపాదన, పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాల్లో గృహిణుల హవా నడుస్తున్నట్లు తేలింది. తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలన్నదానిపై 68 శాతం మందికి మంచి అవగాహన ఉందని సర్వే స్పష్టం చేసింది. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లోనూ వారికి ఎంతో ప్రాధాన్యత పెరిగిందని, మగవారితో పోల్చితే వారి నిర్ణయాలే ఎక్కువని చెప్పింది.

కేవలం 10 శాతం మందే మగవారికి ఆర్థిక నిర్ణయాలను వదిలేస్తున్నారు. గత నెలలో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 600లకుపైగా మహిళలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కంపెనీల బోర్డుల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్నది. దేశంలోని చాలా సంస్థలు తమ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో స్త్రీల ప్రాధాన్యతను గుర్తించాయి. మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌, సర్కారీ-నౌక్రీ.ఇన్ఫో నిర్వహించిన ‘ఉమెన్‌ ఆన్‌ బోర్డ్‌ 2020’ అధ్యయనంలో భారత్‌ 12వ స్థానంలో నిలిచింది.

భారత్‌సహా 36 దేశాల్లోని 7,824 స్టాక్‌ మార్కెట్‌ నమోదిత సంస్థల్లో సర్వేను చేపట్టారు. దేశంలో 628 కంపెనీలు సర్వేలో పాల్గొనగా, గతేడాది కంటే ఈసారి బోర్డ్‌లలో మహిళా డైరెక్టర్లను 14% పెంచామని చెప్పాయి.నెలసరి పొదుపులపై క్రమశిక్షణతో ముందుకెళ్తున్న మహిళలు.. స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

82% మంది తమ పెట్టుబడుల లక్ష్యాల సాధన కో సం స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. 43% మంది స్త్రీలు సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ల వైపు మొగ్గుతున్నారు. బంగారం పెట్టుబడులకూ 25% మంది సై కొడుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్‌ వేదిక గ్రో తెలిపింది. 26వేల మంది మహిళలతో ఈ సంస్థ సర్వేను చేపట్టింది. రిటైర్మెంట్‌ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పొదుపు చేస్తున్నారని పేర్కొన్నది.

ప‌దేళ్ళ త‌రువాత ప్రేమికుడిగా రామ్ చరణ్..?

రామ్ చరణ్, జెనీలియా, షాజన్ పదంసీ హీరోహీరోయిన్లుగా వచ్చిన మూవీ ఆరెంజ్. మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది కాని క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ప‌దేళ్ళ త‌రువాత చ‌ర‌ణ్ మ‌రో ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘మ‌ళ్ళీ రావా’, ‘జెర్సీ’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి.. చ‌ర‌ణ్ కోసం ఓ ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. పంజాబీ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే ఓ తెలుగు కుర్రాడి క‌థ‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌. అంతేకాదు.. చ‌ర‌ణ్ ఏజ్, క్రేజ్, ఇమేజ్ కు త‌గ్గ‌ట్టుగా ఈ స్టోరీని సిద్ధం చేశాడ‌ట గౌత‌మ్. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ‌య్యాక చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమాల్లో.. గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ మూవీ కూడా ఉంటుంద‌ని ప్రచారం సాగుతున్న నేప‌థ్యంలో.. ఇప్పుడీ వార్త మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ‘ఆరెంజ్’ తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేక‌పోయిన చర‌ణ్.. ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటాడేమో చూడాలి.