Home Blog Page 8586

జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించగలరా?

ఇప్పటికే వీలున్న చోటల్లాఅప్పులు  చేస్తూ కాలం గడుపుతున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో చిక్కుకు పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అప్పు పరిమితిని పెంచమని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రం ఆమోదిస్తే మరింత భారీగా రుణాలు సమకూర్చుకునేందుకు చూస్తున్నది. అయితే కేంద్రం నుండి స్పందన లభిస్తున్న దాఖలాలు లేవు.

ప్రస్తుతం జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేరదుకు కేంద్రం అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి 3.5 శాతం వరకు ఈ పరిమితిని పెంచారు. అయితే చాలాసార్లు 3.5 శాతం పరిమితి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు రాలేదు. ఈ నేపథ్యరలోనే నాలుగు శాతానికి పరిమితి పెరచాలని కేంద్రానికి లేఖ రాయడం విశేషం.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వృద్ధి రేటులో మూడు శాతానికి మించి రుణం తీసుకోరాదు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మరో అర శాతం రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించడం లేదు. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం నుండే కేంద్రానికి లేఖలు వ్రాస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, రుణాలను 58.32 శాతాన్ని రాష్ట్రానికి పెంచడం కూడా ఆర్ధిక సమస్యకు కారణమైందని తాజా లేఖలో పేర్కొన్నారు. ఆ రుణాలకు వడ్డీ కూడా రాష్ట్రమే భరించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితిలోకి ఈ రుణాలు చేరుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడుతోందని తెలిపారు.

ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి
కూడా నిరాశాపూరితంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపారు. దీనివల్ల సాధారణ మౌలిక సౌకర్యాల కల్పనకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నీటిపారుదల పథకాలు, రోడ్లు, విద్యా సంస్థలు, ఇతర రంగాల అభివృద్ధికి నిధుల లేమి నెలకొందని వివరించారు. ఇటువంటి ప్రధాన సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రమేష్ కుమార్ తొలగింపుకు రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వ్యవహార శైలిపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకున్న విచక్షణా అధికారాన్ని దుర్నివియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ కుమార్ ని తొలగించే పనిలో జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాల పాటు వాయిదా వేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్.

ఈ మేరకు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం పేషీలోని ఉన్నతాధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల సంఘం పరిధి, అధికారాలు, ప్రభుత్వానికి ఎంతవరకు అజమాయిషీ ఉంటుందన్న అంశంపై చర్చించారు. రాజ్యాంగంలోని 243కే అధికరణం ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంక్రమించిన అధికారులపై ఈ సమీక్షలో చర్చించారు. సీఎం జగన్ అడ్వకేట్ జనరల్, సుప్రీం కోర్టు న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కోర్టులో ఫలితం సానుకూలంగా రాకపోతే రాబోయే వారం రోజుల్లో సంచలనమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివక్షతో వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నికల సంఘం దెబ్బతీసినందున ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ బాధ్యతను జగన్ అప్పగించినట్టు సమాచారం.

అసెంబ్లీలో అభిశంసన బిల్లు పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ను తొలగించేందుకు సిద్ధమవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వారం రోజుల్లోగా పరిస్థితులను చూసి అసెంబ్లీని సమావేశ పరిచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు ఈ అభిశంసన బిల్లు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

యడియూరప్ప వివాహం హాజరుపై దుమారం!

దేశంలో కరోనా వైరస్ మొదటి మరణం బెంగుళూరులో జరగడమే కాకుండా, ఈ వైరస్ పట్ల అక్కడి ప్రభుత్వం తొలుత నిర్లక్ష్యం వహించడంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి.

ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఒక వివాహానికి హాజరు కావడం, ఆ వివాహం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఉండడంతో కరోనా జాగ్రత్తలు గురించి ప్రజలకు చెప్పడమే గాని ప్రభుత్వంలోని ప్రముఖులకు అవి వర్తింపవా అనే దుమారం చెలరేగింది.

పైగా ఆ వివాహం బీజేపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్‌ విప్‌ మహంతేశ్‌ కవాటగిమత్‌ కుమార్తెది కావడం, అతిధులు పెద్ద ఎత్తున రావడంతో వివాదం రేగింది.

ఎగ్జిబిషన్లు, సమ్మర్‌ క్యాంపులు, సమావేశాలు, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, క్రీడా ఈవెంట్లు ఇలా అన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఇలా ఆడంబరంగా జరిగే వివాహానికి రావడం దేనికి సూచిస్తుందని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. నిబంధనలు ప్రజలకు మాత్రమేనా.. నాయకులకు ఉండవా అని మండిపడుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాల్స్‌, సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా జనసమ్మర్ధం ఉన్న చోటకు వెళ్లరాదని.. పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని.. అలా కుదరని పక్షంలో కేవలం 100 మంది కంటే తక్కువ అతిథుల మధ్య తంతు జరిపించాలని ఆదేశించింది. అటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రికి, అధికార పక్షం వారికి వర్తింపవా అని జనం నిలదీస్తున్నారు.

ప్రపంచానికి అమెరికా గుడ్ న్యూస్!

ప్రపంచ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరోనా వైరస్ ని నియంత్రించే వాక్సిన్ గూర్చి గుడ్ న్యూస్ వినపడుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు ఆ వాక్సిన్ ప్రయోగంలో సత్ఫలితాలను చూస్తున్నారు. 43ఏళ్ల జెన్నిఫర్ హాలర్ అనే మహిళ ఈ తొలి ఇంజెక్షన్ తీసుకున్నారు. ఈ ప్రయోగంలో మంచిఫలితాలు రావడంతో కరోనా వైరస్ టీకా మొదటి దశ అధ్యయనం ప్రారంభమైందని సీటిల్‌ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ రిసెర్చ్ ఇన్‌ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు.

“కరోనావైరస్‌ ను ఎదుర్కోవడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలి” అని కైజర్ పెర్మనెంటె అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా జాక్సన్ అన్నారు.

ఎంఆర్ఎన్ఏ-1273 అని పిలుస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యాక్సీన్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మసాచుసెట్స్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా ఇంక్ సంయుక్తంగా రూపొందించాయి.

ఏపీ కాకుండా మరో 3 రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయగా, మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసాయి.

రాజస్థాన్ ప్రభుత్వం కూడా వాయిదా కోరినా కోర్ట్ ఆదేశంతో ఎన్నికలు జరుపుతున్నందును హైకోర్ట్ ను సంప్రదించామని ఎన్నికల కమీషన్ సూచించింది. పశ్చిమబెంగాల్‌, ఒడిషా, మహారాష్ట్రల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజస్థాన్‌లో ఆరు మున్సిపాలిటీలకు నిర్వహించతలపెట్టిన ఎన్నికలను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం కోరగా, హైకోర్టుకు వెళ్లాలని ఈసి సూచించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించతలపెట్టిన మున్సిపల్‌ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నికల వాయిదాకు సంబంధించి ఈసి సోమవారం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించింది. పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న ఈసి ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుంది.

15 రోజుల తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై చర్చిస్తామని, ఆ తరువాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ సౌరవ్‌ దాస్‌ మీడియాకు చెప్పారు. కరోనా వల్ల ఎన్నికలు కొంత ఆలస్యమైనా, ఏ సమయంలోనైనా నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 107 మున్సిపాలిటీలకు జరగాల్సిన ఈ ఎన్నికలను 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారు.

అంతకుముందు కరోనా నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికలు వాయిదా వేస్తే తమకేమీ అభ్యంతరం లేదని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ప్రకటించాయి.

ఒడిషాలో ఈనెల 24న పలు స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఈసి ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు జిల్లా పరిషత్‌లు, ఆరు పంచాయతీలు, ఎనిమిది పంచాయతీ సమితులు, 84 వార్డులకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసి తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో తాజాగా తొలికరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో నిర్వహించాల్సిన అన్ని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉద్దవ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పాటైన ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని జైపూర్‌, కోట జిల్లాలకు చెందిన కలెక్టర్లు స్థానిక స్వపరిపాలన మంత్రిత్వ శాఖను కోరిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

దీనిపై ఈసి నిర్ణయం తీసుకోకుండా హైకోర్టుకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు ఏప్రిల్‌ 18లోగా ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పోలవరం నిధులలో భారీ కోత.. జగన్ మౌనం

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు వ్యయాన్ని తామే పూర్తిగా భరిస్తామని చెబుతూనే కేంద్రం తరచూ మెలికలు పెడుతున్నది. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని ఈ మధ్య చెప్పగా, తాజాగా రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తనకూ వాటా ఇవ్వాలని కేంద్రం మెలిక వేసింది. అంచనా వ్యయంలో భారీగా కొత్త విధించింది. అయినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరు విప్పలేక పోతున్నది.

మరోవంక, 2017-18 ధరల ప్రకారం రాష్ట్రం ప్రతిపాదించిన తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లలోనూ భారీగా కోత విధించింది. అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లేనని పేర్కొంటూ కేంద్ర ఆర్థికశాఖ నియమించిన కమిటీ ఆ మొత్తానికి ఆమోదముద్ర వేసింది. దానితో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం సమస్యగా మారింది.

ఈ విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కోత పడడానికి జగన్మోహన్‌రెడ్డి స్వయంకృపరాధమే అనే విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా పేర్కొంటూ కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. దీనిని కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) పరిశీలించి ఆమోదించింది.

అయితే కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం తుది అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక.. ఇదే మొత్తాన్ని తుది అంచనా వ్యయంగా ఆమోదించాలని కేంద్రాన్ని కోరడం గమనార్హం. అయితే కేంద్ర ఆర్థికశాఖ దీనిపై కమిటీని నియమించింది. ఏకంగా రూ.7931.13 కోట్లకు కోతపెట్టింది.

ఇంత భారీగా కత్తెరవేసినా జగన్ అభ్యంతరం వ్యక్తం చేయక పోవడం విస్మయం కలిగిస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం, ఇంత భారీగా అంచనాలు ఎలా పెంచుతారని కేంద్రానికి పదే పదే ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు అదే కేంద్ర కమిటీ అంచనా వ్యయాన్ని తగ్గించగా మారు మాట్లాడకుండా ఈ నిధులతోనే సరిపుచ్చుకోవలసిన దుస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు చేబుతున్నాయి.

సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు భవన నిర్మాణం (టర్బయిన్లు మినహా) పనులు ఉన్నాయి. వీటి ఖర్చును కూడా హెడ్‌వర్క్స్‌లో భాగంగానే కేంద్రం భరిస్తోంది. ఆ సాకుతో ఇప్పుడు వాటా అడుగుతున్నది.

రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి కేంద్రం జల విద్యుత్‌లో వాటా కావాలని డిమాండ్‌ చేసింది. నాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అంగీకరించలేదు. మళ్లీ ఇప్పుడు జలవిద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయ్యే 960 మెగావాట్లలో తనకూ వాటా ఉంటుందని ఇటీవల సూత్రప్రాయంగా రాష్ట్రం వద్ద ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఇరకాటంలో పడింది.

జగన్‌ సర్కారు స్వయంకృతమే!

ఆచార్య తో జత కట్టేది చందమామ కాదు జేజమ్మ

సినిమా రంగంలో నటీనటుల అవకాశాలు తరచూ మారి పోతుంటాయి. అంతా రెడీ అయ్యాక ఏదో ఒక చిన్న కారణం తో యాక్టర్లు చేంజ్ అయిన సందర్భాలు అనేకం. తాజాగా అలాంటి వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

బాహుబలి చిత్రం తో విశ్వఖ్యాతి దక్కించుకున్న అనుష్క శెట్టి ఈ మధ్య తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. బాహుబలి తరవాత అనుష్క చేసింది రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి భాగమతి కాగా రెండోది సైరా .అలా సంవత్సరానికి మహా అయితే ఒక్క సినిమా చేస్తోంది . ఇక తాజాగా నిశ్శబ్దం సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. నిజానికి ఆ సినిమా ఏప్రిల్ 2 న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఇదిలా ఉంటే అనుష్క మరో భారీ చిత్రాన్ని చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్కకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం లభించిందిట. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమాలో మొదట త్రిషను కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో చిత్రం నుండి తప్పుకుంది. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. వారి ముందుకు వచ్చిన మొదటి పేరు కాజల్ అగర్వాల్. ఇటీవలే చిరంజీవి సరసన ఖైదీ నెం 150లో నటించిన కాజల్ ను మరోసారి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అయితే చందమామ ఈ సినిమా చేయడానికి అడిగిన పారితోషికానికి నిర్మాతలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాంతో సైరాలో అతిధి పాత్రలో మెరిసిన అనుష్క అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. గతంలో స్టాలిన్ లో చిరంజీవి సరసన ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపించిన అనుష్క కి ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారట …. opportunity comes according to behaviour

పార్లమెంట్ లో కరోనా… సమావేశాల కుదింపుకు పట్టు

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుండటంతో పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలను కుదించాలని పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. పాఠశాలలు, థియేటర్లను మూయించడంతో పాటు ఎక్కువమంది జనం గుమికూడె సమావేశాలు, ఉత్సవాలు జరపరాదని ఆంక్షలు విధిస్తు, పార్లమెంట్ సమావేశాలను మాత్రం యధావిధిగా జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఈ విషయమై ఉంభయసభలలోని పలువురు ఎంపీలు ఆ మేరకు ప్రభుత్వానికి సూచించినా అటువంటి ఉద్దేశ్యం లేదని అంటూ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారవేస్తున్నాయి. సమావేశాలను యధావిధిగా జరపడం కోసమే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నది.

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేంత వరకూ పార్లమెంటును వాయిదా వేయడం మంచిదని పలువురు ఎంపీలు ఇటు ఉభయసభల్లోనూ, బయట కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ముందుకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు ముగుస్తాయనే తాను అనుకుంటున్నట్టు అని బీజేపీ నేత ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నందున సమావేశాల కుదింపు అనే ప్రశ్నే తలెత్తదని మరో బీజేపీ ఎంపీ చెప్పారు.

‘సభను నివరధికంగా వాయిదా వేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కరోనా వైరస్ బెడదపై పోరుకు సన్నద్ధమయ్యాం’ అని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, సభ్యుల ఆరోగ్యం చిక్కుల్లో పడకుండా చూడటం కూడా పార్లమెంటు బాధ్యతని, వచ్చే వారం సభ వాయిదా పడే అవకాశం లేకపోలేదని కేంద్ర మంత్రి ఒకరు అభిప్రాయప్డడారు.

కాగా, కరోనా వైరసి వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల కొనసాగింపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ ఎంపీ అయినా కరోనా వైరస్‌తో పార్లమెంటుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, వైరస్ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు ఆయనకు తెలియకపోవచ్చు కూడా. అయితే, అది ఇతర ఎంపీలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి’ అంటూ హెచ్చరించారు.

సమూహాలకు దూరంగా ఉండమని చెబుతున్న ప్రభుత్వం ఏదో ఒక రోజు పార్లమెంటు సమావేశాల కుదింపు విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ఎంపీ బాలసుబ్రమణియన్ సైతం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, షెడ్యూల్ తేదీ కంటే ముందే పార్లమెంటును వాయిదా వేయాలని సూచించారు.

”వర్చువల్‌ కోర్టుల”ను ప్రవేశ పెట్టనున్న సుప్రీం కోర్ట్

కోవిడ్‌-19 మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో న్యాయస్థానాలలో జనసమర్ధన లేకుండా చేయడం కోసం సుప్రీం కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ”వర్చువల్‌ కోర్టులను” అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ తెలిపారు. వచ్చే వారం నుంచి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను వాదించవచ్చునని చెప్పారు.

”కోర్టులు అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే ప్రదేశాలుగా ఉండకూడదన్నదే మా ఉద్దేశం..” అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 143 దేశాలను చుట్టేసిన కరోనా వైరస్‌ కారణంగా… ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో… ఇప్పటికే కోర్టు రూముల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే లాయర్లు, వ్యాజ్యకారులు, పాత్రికేయులకు ప్రవేశం కల్పిస్తున్నారు.

ఈరోజు సుప్రీం కోర్టు బయట థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం ఏర్పాటు చేయడంతో ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని హైకోర్టులతోనూ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే తరచూ సమీక్షిస్తున్నట్టు జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు.

ఇకపై కేసులను డిజిటల్‌ రూపంలో ఫైల్‌ చేయడం, వర్చువల్‌ కోర్టుల ద్వారా విచారణ జరపడం తదితర చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇందుకోసం న్యాయవాదులు, వ్యాజ్యకారులు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కోర్టులకు సహకరించాల్సి ఉంటుందని చెప్పారు.

కరోనా విషయమై ఇప్పటికే అపొల్లో, ఫోర్టిస్‌ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులను సుప్రీం కోర్టు సంప్రదించినట్టు పేర్కొన్నారు. కాగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడదంటూ ఈ నెల 5 న ప్రభుత్వం సూచించిన నేపధ్యంలో… ప్రస్తుతం అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీం కోర్టు గతవారం నిర్ణయం తీసుకుంది.

కరోనా ప్రమాదం లేదన్న నీలం సహానీ లేఖపై దుమారం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయకంపితులను కావిస్తున్నదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన మరుసటి రోజే రాష్ట్రంలో అటువంటి భయం లేదని `నిర్ధారిస్తూ’,  యధాప్రకారం ఎన్నికలు నిర్వహింపమని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కమీషన్ కు లేఖ వ్రాయడం రాజకీయ వర్గాలలో పెను దుమారం రేపుతున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపద్రవం నుండి బైట పడేందుకు ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటూ ఉంటె వాటి పట్ల దృష్టి సారించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చే మూడు నుండి నాలుగు వరాల వరకు రాష్ట్రంలో అటువంటి ప్రమాదం ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు భరోసా ఏ విధంగా ఇవ్వగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో విద్యాసంస్థలు , సినిమా హాళ్లను మూసి వేయడంతో పాటు సుప్రీం  కోర్ట్,  హై కోర్టులు  సహితం అత్యవసర కేసులు మాత్రమే చేబడతామని అంటూ ఉంటె ఆమె ఏ విధంగా అటువంటి భరోసా కల్పిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.

ఆమె లేఖ పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత రెండు వారాలుగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులను `ఏకపక్షంగా ‘ గెలిపించే పనికి ఉంటూ ఈ మరణాంతక వైరస్ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పలు దేశాల నుండి 6,777 మంది ఏపీకి వచ్చారని అంటూ వారెవ్వరూ, వారి పరిస్థితి ఏమిటి ఈ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. అసలు ఈ ఉపద్రవం గురించి రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరిపిందా అంటూ నిలదీశారు. ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే వందలాది మంది ఈ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు వస్తున్నాయని చెబుతూ ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం బేతఖార్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్ళ ఉరి ఇక నుంచి మరో లెక్క!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అనేక మలుపులు తిరుగుతున్న 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసు ఇప్పుడు మరో కొత్త మలుపును తీసుకొంది. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు అంతర్జాతీయ కోర్టు(ఐసిజి)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉద‌యం 5గంటల 30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను మార్చి5న జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది.

మ‌ర‌ణ‌శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని ఈ రోజు ముఖేశ్ సింగ్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. క్ష‌మాభిక్ష పిటిష‌న్ ముగిసింది, ఇప్పుడు నీకు ఎటువంటి అవ‌కాశం లేద‌ని, క్యూరేటివ్ పిటిష‌న్ వ‌ర్తించ‌దు అని సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషన్‌ విచారణ అర్హత లేదని ముఖేశ్‌ పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దింతో త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌లు ఈ రోజు ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్‌ ను ఆశ్రయించారు.

జగన్ పై ఫైర్ అయిన పవన్

2020 ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల నామినేషన్ లలో నెలకొన్న హింస, దౌర్జన్యాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా బలవంతంగా ఉపసంహరింప చేయడం వంటి కుట్ర పూరిత క్రియల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పవన్ ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామని పవన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

“ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో మనల్ని అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తే మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పేట్రేగిపోతారు. కాబట్టి ధైర్యంగా నిలబడదాం. మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎదురైన ఇబ్బందులను, ఎదుర్కొన్న దాడులను వివరంగా తెలియచేయండి. పలు చోట్ల మన అభ్యర్థులపై దాడికి దిగడం, నామినేషన్ వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించడం లాంటివి నా దృష్టికి వచ్చాయి. రాయలసీమలో జనసేన అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు, నామినేషన్ దశలో ఇబ్బందులు పాలుజేసి అడ్డుకొన్న అధికారుల వివరాలు కూడా సమగ్రంగా తెలియచేయండి. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, మీపై దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా రక్షించని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండి. వీటిని క్రోడీకరించి స్వయంగా కేంద్ర హోమ్ శాఖకు అందచేస్తాను. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తా..” అని పవన్ అన్నారు.

కరోనా భూతంతో బోసిపోతున్న హైదరాబాద్

కరోనా వైరస్‌ భయంతో  హైద రాబాద్‌ నగరం కళావిహీనంగా తయారై బోసిపోతున్నది.  ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పార్కులు, బార్లు మూసివేశారు. ఆదివారం రోజుల్లో నిత్యం కళకళలాడే షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు జనంలేక బోసిపో యాయి. సికింద్రాబాద్‌, కోఠిలోని కొన్ని దుకాణాలను యజమానులు ఆదివారం స్వచ్చందంగానే మూసివేశారు.

రద్దీగా ఉండే కోఠి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్‌ తగ్గింది. హైదరాబాద్‌ నగరంలోని పర్యాటక ప్రాంతాలు సాలార్జంగ్‌ మ్యూజియం, జూ పార్క్‌, గోల్కొండ, శిల్పారామం మూసివేశారు.
చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, బిర్లా మందిరం, నెక్లెస్‌ రోడ్‌,హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో రద్దీ తగ్గింది. అశోక్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 7వేల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్ధులు ఇళ్లకు బయల్దేరారు. చాలా చోట్ల సినిమా హాళ్లు నడిచాయి. ముందస్తు బుకింగ్ల కారణంగా నడిపామని, సోమవారం నుంచి పూర్తిగా మూసేస్తామని వాటి మేనేజ్మెంట్లు తెలిపాయి.

కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తల కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలు చేసేలా ప్రభుత్వ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవు, సినిమా హాళ్ల బంద్ తదితర నిర్ణయాలను అమలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్కుమార్ఆదేశాలు జారీ చేశారు.

అన్ని రకాల విద్య సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలి. ఇంటర్, టెన్త్, ఇతర అడ్మిషన్ టెస్టులు యధావిధిగా జరుగుతాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం హాస్టళ్లు, రెసిడెన్షియల్స్కూళ్లు పనిచేస్తాయి. ఈ నెల 21 వరకు సినిమా హాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, జూ పార్కులు, మ్యూజియంలు మూసి వేయాలని ఆదేశాలలో పేర్కొనన్నారు.

ఇప్పటికే ముహూర్తం ఖరారైన పెళ్లిళ్లు మినహా ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకూడదు. ఈ నెల 31 వరకు జరిగే పెండ్లిళ్లకు కూడా 200 కంటే ఎక్కువ మంది రాకుండా చూసుకుంటే మంచిది. 31వ తేదీ తర్వాత నిర్వహించే ఏ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఫంక్షన్ హాళ్లు కొత్త బుకింగ్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు.

ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేష్లన్లలో, మెట్రో స్టేషన్లలో గతంలో కంటే ఎక్కువ పరిశుభ్రత ఉండేలా ఆయా శాఖలతో పని చేయించాలి. పబ్లిక్ మీటింగ్ లు, సమ్మర్ క్యాంపులు వంటి ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే ప్రొగ్రామ్లకు ఈ నెల 21 వరకు పర్మిషన్ ఇవ్వొద్దు. అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మెంబర్షిప్క్లబ్లు, బార్లు, పబ్లు కూడా ఇదే తేదీ వరకు మూసివేయాలిని ఆదేశాల్లో పేర్కొన్నారు.

విపత్తుల నిర్వహణ, అంటు వ్యాధుల నివారణ చట్టాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు హెల్త్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల ప్రిన్సిపల్సెక్రటరీలకు, డీజీపీకి, అన్ని జిల్లాల కలెక్టర్లకు, పోలీసు కమిషనర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా క్లబ్బులు, పబ్బులు, బార్లు, టూరిజం బార్లు, ఏ4 లిక్కర్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్రూం లను ఈ నెల 21 వరకు మూసివేయాలని ఆదేశిస్తూ సీఎస్ మరో ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్చట్టం‌‌లోని 72వ నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

శతాబ్దకాలం నాటి పద్దతిలోనే కరోనాకు చికిత్స

ప్రపంచాన్ని కలసి వేస్తున్న కరోనా వైరస్ తగిన చికిత్స కోసం ఒక వంక శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తుంటే శతాబ్దకాలం క్రితం ఇటువంటి పరిస్థితులలో అనుసరించిన పద్ధతితోనే ఈ మరణాంతక వ్యాధిని కట్టడి చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనాను ఎదుర్కోగలిగే వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు.
 
ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, చికిత్స అందించే కీలకమైన అంశం ఉందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కోనే మందు ‘కన్వాలెసెంట్ సీరమ్’లో ఉందని అంటున్నా.రు
వైరస్ వల్ల ఇన్ ఫెక్ట్ అయిన వాళ్ల రక్తం నుంచి తీసిన సీరమ్ నే కన్వాలెసెంట్ సీరమ్ అంటారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే పదార్థమే సీరమ్. దీనిలోనే మన యాంటీబాడీలు ఉంటాయి. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానితో పోరాడడానికి యాంటిబాడీలు ఈ సీరమ్ లోనే విడుదల అవుతాయి.
అందుకే కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సీరమ్ నుంచి వైరస్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే యాంటిబాడీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించవచ్చన్నది పరిశోధకులు భావిస్తున్నారు.
1918లో స్పానిష్ ఫ్లూ ఇలాగే ఎపిడెమిక్ వ్యాధిగా పుట్టుకొచ్చింది. అప్పుడు ఆ వ్యాధినుంచి కోలుకున్న వాళ్ల రక్తంలోని అంశాలను ఎక్కించడం వల్ల తీవ్రస్థాయి అనారోగ్యంతో ఉన్న రోగుల మరణాలు 50 శాతానికి పడిపోయాయి. కొన్ని దశాబ్దాల క్రితం తట్టు, పోలియో లాంటి వ్యాధులను అరికట్టడంలో కూడా ఈ పద్ధతినే ఉపయోగించారు.
అయితే 1950లలో ఆధునిక వ్యాక్సిన్లు, యాంటివైరల్ మందులు అభివృద్ధి చెందిన తరువాత ఈ తరహా చికిత్స మరుగున పడిపోయిందని చెప్పారు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అర్ టురో కెసాడ్వాల్.
ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి పెరుగుతుండడంతో మళ్లీ ఈ చికిత్సను అభివృద్ధి చేయడం మంచి ఫలితాలను ఇవ్వగలదని ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలంలో ఏ వ్యాక్సిన్లూ లేవు. కాని వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తీసుకున్న కణాలే ఆయా సూక్ష్మజీవుల అంతుచూశాయి.

కరోనా షాదీ అంటున్న యువ హీరోలు

 

ఈ ఏడాది తెలుగు యువ హీరోలకు పెళ్లి మీద మనసు మళ్లింది.దాంతో ఇద్దరు యువ హీరోలు ఒకే రోజు పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 న ఆ ఇద్దరు పెళ్లి కి రెడీ అయ్యారు.

వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది హీరో నితిన్.ఈ యువ హీరో థర్టీ ప్లస్ దాటి ఆరేళ్ళు అవుతుంది. పెళ్లి పీటలు ఎక్కుదామని నితిన్ సిద్దమైన వేళ కరోనా రూపంలో పెళ్ళికి అడ్డంకి వచ్చి చేరింది. నితిన్ తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం కూడా చేసుకున్నాడు. వీరి వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా జరగాల్సివుంది. కానీ దుబాయ్ కూడా కరోనా ప్రభావిత దేశాలలో ఉండడంతో పాటు, ఆ దేశం యొక్క ప్రభుత్వం ఇతర దేశాల నుండి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనితో నితిన్ మ్యారేజ్ సందిగ్ధంలో పడింది. నితిన్ పెళ్లిపై కుటుంబ సభ్యులను వాకబు చేయగా ఏప్రిల్ పదహారున పెళ్లి చేయాలా వాయిదా వెయ్యాలా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదు అన్నారట ..

ఇక ఏప్రిల్ పదహారున పెళ్ళికి రెడీ అవుతున్న రెండో యంగ్ హీరో నిఖిల్. గతేడాది అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫామ్ అందుకున్న ఈ యువ హీరో మంచి జోష్ మీద ఉన్నాడు. అదే ఊపులో తన సంతోషం మరింత రెట్టింపయ్యేలా ఇటీవలే ఫిబ్రవరి 1న తన స్నేహితురాలు పల్లవితో నిఖిల్ కు నిశ్చితార్ధం కూడా అయ్యింది. ఆ క్రమంలో ఏప్రిల్ 16న పెళ్ళికి వీరిద్దరూ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంతవరకూ అంతా సజావుగా జరగ్గా ఇప్పుడు కరోనా వైరస్ భయం వల్ల పెళ్ళికి అడ్డంకి వచ్చింది.పెళ్లి విషయం లో ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే నిఖిల్ ను మీడియా కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెళ్లి వాయిదా వేసే ఉద్దేశమేమైనా ఉందా అని అడగ్గా తనకు అలాంటి ఉద్దేశమేమి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడదని తెలిపాడు. అవసరమైతే గుళ్లో అయినా పెళ్లి చేసుకుంటాం కానీ పెళ్లి వాయిదా అయితే వెయ్యమని తేల్చి చెప్పేసాడు. marriages are made in heaven

తమ్మినేని, రాజకీయ నాయకుడా..?స్పీకరా?


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తమ్మినేని స్పందించారు. రమేష్ కుమార్ పై జనం కోపంతో ఉన్నారని ఆయన కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ఒక రాజకీయ నాయకుని వలె టీడీపీ నేతలపై తమ్మినేని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంటి నీచాతినీచ రాజకీయనాయకులున్నంత వరకూ వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నసంగతి మరిచిపోయి 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు అండగా నిలిచారని, ఎన్నికలకు ముందు జగన్ ఏడాది ముందు నుంచి పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఐదు సంవత్సరాలు ఆగకపోతే పాదయాత్ర చేసుకో బాబు అంటూ చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ఎన్నికల కమీషన్ ను మేం గౌరవిస్తామన్న ఆయన ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని అన్నారు. రమేష్ కుమార్ “ఏం తమాషాగా ఉందా..?” ఎన్నికల కమీషనర్ గా ఎందుకు.. సీఎం కూర్చీలో కూర్చోమనండి” అంటూ వ్యాఖ్యానించారు. కరోనా కోసం ఇప్పటికే 20 లక్షల ఇళ్లను సర్వే చేయించామని, ఎన్నికలు జరిపేందుకు ప్రతిపక్షాలు ఎక్కడ అవకాశాన్ని ఇచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు అంటూ అతి సాధారణ వైసీపీ కార్యకర్త వేలే విమర్శించారు తమ్మినేని.

ఒక రాష్ట్రానికి స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని, రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలో ఉన్న మరో వ్యక్తి పై ఈ స్థాయిలో విమర్శలు చేయడాన్ని అనేకమంది తప్పుపడుతున్నారు. ఒక సాధారణ రాజకీయ నాయకుడి వలే తమ్మినేని ప్రవర్తించాడు. కమ్మ వైరస్, టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు, చంద్రబాబు ఒక చీడ పురుగు అని అతి దారుణమైన పరుష పదాలను వాడడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రాజకీయ నాయకుడుగా కొనసాగాలని ఉంటె అలానే ఉండాల్సింది, కానీ మంచి గౌరవప్రధమైన స్థానంలో ఉండి అతి తక్కువ స్థాయికి దిగజారి రాజకీయాల నాయకులను విమర్శించం ఏమిటని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

ఆచార్య చిత్రంలో మహేష్ బాబు లేనట్టే..

మెగా స్టార్ చిరంజీవి చిత్రం అంటేనే ప్రేక్షకుల్లోఅత్యంత ఆసక్తి ఉంటుంది. అటువంటి అపుడు ఆ చిత్రం లో మరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటించ బోతున్నాడు అన్న సంచలన వార్త బయటికి వచ్చింది. దాంతో మెగా అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగి పోయారు. ఎంతో ఆత్రుత తో అందరూ షూటింగ్ అప్ డేట్స్ గురించి వెయిట్ చేశారు ఎన్నో మలుపులు తిరిగిన ఈ వార్తొదంతం చివరకి మళ్ళీ మొదటికి వచ్చింది.

కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో 152 వ చిత్రం గా తీస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం మొదట రామ్ చరణ్ నే అనుకొన్నారు. కానీ త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్న చెర్రీ బయటికి వచ్చి సినిమా చేసే ఛాన్స్ లేకపోవడం తో ఆ ప్రపోజల్ విరమించు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మహేష్ బాబు పేరు తెర మీదకు వచ్చింది. 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అన్న వార్త వైరల్ అయ్యింది. ఈ వార్త సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్ళింది.. అయితే తాజాగా అందుతున్నవార్తలను బట్టి ” ఆచార్య” చిత్రం లో మహేష్ బాబు నటించడం లేదు. .

ఈ విషయంలోపలు కధనాలు బయటికి వచ్చాయి. ఆచార్య చిత్రం లో నటించేందుకు మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. 30 కోట్ల పారితోషికం ఆయనకు ఇస్తే సినిమా బడ్జెట్ పరిమితి మించుతుందనే ఆలోచనతో సినీ యూనిట్ మరో ఆలోచనలో పడింది. చిరంజీవి తో రామ్ చరణ్ నటించినా కూడా సినిమాకు ఖచ్చితంగా భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం అన్న కారణంగా మహేష్ బాబు లేకున్నా పర్వా లేదని యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు. ఇక పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే మే 5 వ తారీకు నుంచి రామ్ చరణ్ ఆచార్య చిత్రం షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. prevention is better than cure
.