Home Blog Page 171

డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జారీలో ఇదేం జాప్యం?

Desk Journalists Accreditation

Desk Journalists Accreditation : డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పలు జిల్లాల సమాచార, పౌర సంబంధాల అధికారుల (డీపీఆర్వోలు) నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా పలు జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర అయోమయం, ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన డిమాండ్లలో దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో ప్రత్యేక కోటా కల్పించడం, సెంట్రల్ డెస్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కేటాయించే కార్డుల సంఖ్యను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి.

డీజేఎస్ ప్రతినిధుల విజ్ఞప్తులపై స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దివ్యాంగ జర్నలిస్టుల ప్రత్యేక కోటా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే జీవో అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న జిల్లాల డీపీఆర్వోల వ్యవహారంపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో డీజేఎస్ రాష్ట్ర ప్రతినిధులు రాజారాం, రమేశ్, సత్యప్రసాద్, వెంకట్ రమణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా మంగళవారం ఐఅండ్‌పీఆర్ కమిషనరేట్‌లో రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇంకా అక్రెడిటేషన్ కార్డులు పొందని డెస్క్ జర్నలిస్టులందరూ హాజరై కమిటీ సభ్యులకు తమ వినతిపత్రాలు అందజేయాలని డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కమిషనరేట్‌కు తరలిరావాలని ఆయన కోరారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. పశ్చిమాసియా మళ్లీ యుద్ధ తీవ్రం!

Israel Attacks Iran Latest News
Israel Attacks Iran Latest News

Israel Attacks Iran Latest News: పశ్చిమాసియా మరోసారి అస్థిరతకు లోనవుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్‌ కూడా అమెరికాకు అండగా నిలిచిన గల్ఫ్‌ దేశాలతోపాటు ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్‌ చేసిన దాడులకు స్పందనగా ఇజ్రాయెల్‌ బలమైన ప్రతీకార చర్యలు చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, నజాఫాబాద్‌తో సహా ఇరాన్‌లోని ముఖ్య నగరాలపై క్రూయిజ్‌ మిస్సైల్స్‌ యుద్ధ విమానాలతో దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌ వెల్లడించింది.

సీజ్‌ఫైర్‌ తర్వాత తొలి దాడి..
ఏప్రిల్‌ 8న అమలులోకి వచ్చిన యుద్ధవిరామం తర్వాత ఇది ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి తీవ్రమైన సంఘర్షణ. ఇరాన్‌ ఇటీవల ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఈ పరిణామం వేగం పుంజుకుంది. ఇజ్రాయెల్‌ ఈ దాడులను తన భద్రతకు అనివార్య చర్యగా చూస్తోంది.

ట్రంప్‌ సూచనలు విస్మరించిన నెతన్యాహు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ దాడికి ప్రతీకారం చేయవద్దని, అలా చేస్తే శాంతి చర్చలు ప్రమాదంలో పడతాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును స్పష్టంగా హెచ్చరించారు. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగించడం గమనార్హం. ఇది ఇజ్రాయెల్‌–అమెరికా మధ్య సమన్వయ లోపాన్ని బయటపెట్టింది.

ప్రాంతీయ భద్రతపై ప్రభావం..
ఇరాన్‌–ఇజ్రాయెల్‌ పరస్పర దాడులు ప్రాంతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్‌ ఇప్పటికే బలహీన స్థితిలో ఉన్నప్పటికీ, తన మిత్రదేశాలు ద్వారా ప్రతీకారం చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీంతో లెబనాన్, సిరియా, ఇరాక్‌ వంటి ప్రాంతాల్లో సంఘర్షణ వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. నెతన్యాహు ప్రభుత్వం తన దేశ భద్రతను ప్రధాన ప్రాధాన్యతగా చూస్తూ, ఏ చిన్న బలహీనతను కూడా అనుమతించదని స్పష్టం చేస్తోంది. మరోవైపు ట్రంప్‌ శాంతి చర్చలు, ఒప్పందాల ద్వారా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ఈ రెండు వ్యూహాల మధ్య తీవ్రమైన అసమానత కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితి ఎంత త్వరగా అదుపులోకి వస్తుందనేది ఇప్పుడు కీలకం. ఒకవేళ ఇరు వైపులా మరిన్ని దాడులు జరిగితే, ఇప్పటికే జరిగిన ఫిబ్రవరి–ఏప్రిల్‌ యుద్ధం తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున సంఘర్షణ రావచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. రెండు దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా మార్గం వెతకాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.

ఉద్యోగుల కోసం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ 5 Laptops ఇవే..

Top 5 Laptops For Professionals
Top 5 Laptops For Professionals

Top 5 Laptops For Professionals: ప్రస్తుత కాలంలో చాలా కార్యాలయాల్లో ల్యాప్ టాప్ ల అవసరం తప్పనిసరిగా మారింది. ఇలాంటి సమయంలో వారి పనితీరు మెరుగ్గా ఉండడానికి మంచి ల్యాప్ టాప్ కోసం సెర్చ్ చేస్తుంటారు. వృత్తిపరమైన అవసరాలు, పోర్టబిలిటీ, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ల్యాప్‌టాప్‌లు ఇవే.. వీటి గురంచి పూర్తి వివరాల్లోకి వెళితె..

MacBook Neo:
యాపిల్ కంపెనీకి చెందిన MacBook Neo బడ్జెట్ ధరలో ఉద్యోగులకు గొప్ప ఎంపిక. ఇది M-సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, దీనివల్ల బ్యాటరీ లైఫ్, సాఫ్ట్‌వేర్ పనితీరు చాలా అద్భుతంగా ఉంటాయి. రోజువారీ ఆఫీస్ పనులు, ఈమెయిల్స్, డాక్యుమెంట్ ఎడిటింగ్ కోసం ఇది అత్యంత నమ్మకమైన ల్యాప్‌టాప్. దీని ధర సుమారు రూ.85,000 నుండి ప్రారంభమవుతుంది.

HP 14:
ఒక పనిని పూర్తి చేయడంలో ఎటువంటి హంగులు లేకుండా, సూటిగా పనిచేసే ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి HP 14 సరైన ఎంపిక. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 (Intel Core i5) ప్రాసెసర్, మెరుగైన కీబోర్డ్ ఉండటం వల్ల టైపింగ్ సులభం అవుతుంది. ఆఫీస్ మీటింగ్‌లుచ వర్చువల్ కాన్ఫరెన్స్‌ల కోసం ఇందులో మంచి వెబ్‌క్యామ్ , మైక్రోఫోన్ అమర్చారు. దీని ధర సుమారు రూ. 50,000 నుంచి రూ. 60,000 మధ్య అందుబాటులో ఉంటుంది.

Lenovo IdeaPad 5 2-in-1:
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ప్రజంటేషన్లు ఇచ్చేటప్పుడు టాబ్లెట్ లాగా కూడా వాడుకోవాలనుకుంటే Lenovo IdeaPad 5 2-in-1 ఉత్తమమైనది. దీని 360-డిగ్రీల హింజ్ డిజైన్ ,టచ్‌స్క్రీన్ ఫీచర్ మీ పనిని మరింత సులభతరం చేస్తాయి. మంచి ప్రాసెసింగ్ వేగం, స్టైలిష్ లుక్ దీని సొంతం. దీని ధర సుమారు రూ.65,000 నుండి రూ.75,000 వరకు ఉంటుంది.

ASUS Zenbook 14:
డిజైన్ తో పాటు పనితీరులో రాజీ పడని వారి కోసం ASUS Zenbook 14 రూపొందించబడింది. దీని అల్ట్రా స్లిమ్ బాడీ, ఓఎల్ఈడీ (OLED) డిస్‌ప్లే కళ్లకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మల్టీ టాస్కింగ్ చేసే ఉద్యోగులకు దీని పనితీరు ఎంతో సహాయపడుతుంది. ఇది చూడటానికి చాలా క్లాసీగా ఉండటమే కాకుండా, చాలా తక్కువ బరువుతో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.95,000 నుంచి రూ. 1,05,000 వరకు ఉంటుంది.

Dell XPS 14:
అత్యుత్తమ నాణ్యత, బిల్డ్ క్వాలిటీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకుంటే Dell XPS 14 ఒక ప్రీమియం ఛాయిస్. ఇది హై ఎండ్ గ్రాఫిక్స్, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ, స్పీడ్ విషయంలో రాజీ పడదు. బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లకు, హెవీ వర్క్‌లోడ్ ఉండే వారికి ఇది సరైన తోడుగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.1,40,000 కంటే ఎక్కువగా ఉంటుంది.

ముంబై ఇండియన్స్ కు కటీఫ్ చెప్పిన సూర్య.. తర్వాత జరిగేది అదేనా..

Suryakumar Yadav Mumbai Indians Exit
Suryakumar Yadav Mumbai Indians Exit

Suryakumar Yadav Mumbai Indians Exit: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు అంతగా ఆకట్టుకోలేదు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మేనేజ్మెంట్ కొన్ని మ్యాచ్లకు పాండ్యాను దూరం పెట్టింది. సూర్య కుమార్ యాదవ్.. బుమ్రా కొన్ని మ్యాచ్లకు తాత్కాలిక నాయకత్వం వహించారు.

సూర్య కుమార్ యాదవ్ కూడా సరిగా ఆడలేదు. దీంతో మేనేజ్మెంట్ కూడా అతడి ఆట తీరు పట్ల అంతగా సంతృప్తిగా లేనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ ను కూడా వచ్చే సీజన్లో పక్కన పెడతారని.. మేనేజ్మెంట్ అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకుంటుందని ప్రచారం మొదలైంది. దీనిపై ముంబై యాజమాన్యం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో తన దారుణమైన ప్రదర్శనను కొనసాగించాడు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అతడు.. కనీసం తన స్థాయిలో చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

సూర్య కుమార్ యాదవ్ ఇటీవల టీమిండియా టి20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. కెప్టెన్ హోదాను కోల్పోయాడు. ఆటగాడిగా కూడా అవకాశం పొందలేకపోయాడు. దీంతో అతనికి సంబంధించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ముంబై t20 లీగ్ లో కూడా అతడు తన స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా అతడు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అండ్ ఫాలో చేసాడు.. ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఫోటోలు కూడా అతడి సోషల్ మీడియా ఖాతాలో కనిపించడం లేదు.

ముంబై జట్టుకు సారధిగా ఉన్న హార్థిక్ పాండ్యాతో సూర్యకుమార్ యాదవ్ కు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. హార్థిక్ పాండ్యా కూడా ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే చేయడంతో.. ఇతడు కూడా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే సీజన్లో ముంబై జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని మేనేజ్మెంట్ దృడ నిశ్చయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఫొటోగ్రాఫర్లు పాత కెమెరాను తీసేసి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.. ధర ఎంతంటే..

Vivo X300 Ultra Camera Features
Vivo X300 Ultra Camera Features

Vivo X300 Ultra Camera Features: స్మార్ట్‌ఫోన్ కొనే చాలా మంది ఇందులో ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ విషయంలో శ్రద్ధ చూపుతున్నారు. ఈ ఆప్షన్లు బాగుంటేనే మొబైల్ కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు కెమెరా ప్రత్యేకతను కలిగి ఉన్న డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వీటిలో Vivo కంపెనీకి ఓ కొత్త ఫోన్ ఆకర్షిస్తోంది. ఆ ఫోన్ గురించి వివరాల్లోకి వెళితె..

Vivo కంపెనీ నుంచి X300 Ultra అనే మొబైల్ లో కెమెరా ప్రధాన ఆకర్షణ ఉంటోంది. ఇందులో ZEISS భాగస్వామ్యంతో రూపొందించిన మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 200MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరాలు రంగులు, డీటెయిలింగ్‌లో అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా దీని టెలిఫోటో జూమ్ , అదనపు టెలి-ఎక్స్‌టెండర్ యాక్సెసరీలను ఉపయోగించినప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల అద్భుతమైనAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో ఉండే ఇందులో గేమింగ్ ఆడితే చాలా స్మూత్‌గా ఉంటుంది. గరిష్టంగా 4500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండటం వల్ల, ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుండి రక్షణను కలిగి ఉంటుంది.

X300 Ultra అనే మొబైల్ లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనివల్ల మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్చ వీడియో ఎడిటింగ్ వంటి పనులు ఎటువంటి లాగ్ లేకుండా జరుగుతాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది. వివో సంస్థ దీనికి ఐదేళ్ల మేజర్ ఓఎస్ అప్‌డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇందులో 6600mAh బ్యాటరీని అమర్చారు. ఇది రోజంతా ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ చేసినా కూడా ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది, ఇది ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.1,59,999 నుండి ప్రారంభమవుతుంది. మీరు మీ పాత డిజిటల్ కెమెరాకు ప్రత్యామ్నాయంగా ఒక స్మార్ట్‌ఫోన్‌ను వెతుకుతున్నట్లయితే, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎంపికలలో ఒకటి.

సింహాలు, పులులు ఉన్న ఏకైక దేశం ఏదో తెలుసా..

Only Country With Lions And Tigers
Only Country With Lions And Tigers

Only Country With Lions And Tigers: ప్రపంచంలో సింహాలు ఉన్న దేశాలు ఉన్నాయి.. పులులు ఉన్న దేశాలు ఉన్నాయి. అయితే ఇవి ఒకేలాగా అనిపించినా.. వీటి జీవన విధానంలో చాలా తేడాలు ఉంటాయి. అంతే కాకుండా టాంజానియా దేశంలో సింహాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకే ఒక దేశంలో సింహాలు, పులులు కలిసి ఉన్నాయి. ఆ దేశం ఏదీ? పులులు, సింహాల జీవన విధానంలో ఉన్న భేదాలు ఏంటీ?

సింహం, పులి రెండూ పెద్ద పిల్లి జాతికి చెందిన శక్తివంతమైన మాంసాహార జంతువులు. అయితే వీటి రూపురేఖలు, ప్రవర్తన, వేట తీరు, జీవనశైలిలో అనేక తేడాలు ఉన్నాయి.సింహాలు గుంపులుగా జీవిస్తాయి. వీటి గుంపును “ప్రైడ్” అంటారు. ఒక ప్రైడ్‌లో అనేక ఆడ సింహాలు, పిల్లలు, ఒకటి లేదా రెండు మగ సింహాలు ఉంటాయి.సింహాలలో ఎక్కువగా ఆడ సింహాలే వేటాడుతాయి. అవి గుంపుగా కలిసి వేట చేసి పెద్ద జంతువులను కూలదోస్తాయి.సింహాలు ఎక్కువగా గడ్డి మైదానాలు, పొదల ప్రాంతాల్లో జీవిస్తాయి. ప్రస్తుతం అడవి ఆసియాటిక్ సింహాలు ప్రధానంగా గిర్ జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.

పులులు మాత్రం ఒంటరిగా జీవిస్తాయి. జతకట్టే కాలం లేదా పిల్లలను పెంచే సమయం తప్ప ఇతర పులులతో కలిసి ఉండవు. ఇవి ఒంటరిగానే వేటాడుతాయి. అవి నిశ్శబ్దంగా ఆహారానికి దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా దాడి చేస్తాయి. అందుకే పులిని అత్యంత తెలివైన వేటగాడిగా భావిస్తారు.దట్టమైన అడవులు, చిత్తడి నేలలు, పర్వత ప్రాంతాలు, మడ అడవులు వంటి అనేక రకాల వాతావరణాల్లో పులులు జీవించగలవు.

సింహాలు, పులులు రెండూ అడవుల్లో సహజసిద్ధంగా నివసించే ఏకైక దేశం భారత్. ఈ విశిష్టత మరే దేశానికీ లేదు. సింహం, పులి రెండూ అత్యంత శక్తివంతమైన పెద్ద పిల్లి జాతి జంతువులు. ఇవి ఒకే దేశంలో సహజ నివాసాల్లో జీవించడం భారత జీవ వైవిధ్య సంపదకు నిదర్శనం.

భారత్‌లో కనిపించే సింహాలను ఆసియాటిక్ సింహాలు (Asiatic Lions) అని పిలుస్తారు. ఒకప్పుడు ఇవి మధ్యప్రాచ్యం నుంచి భారతదేశం వరకు విస్తరించి ఉండేవి. అయితే వేట, నివాస ప్రాంతాల నష్టం కారణంగా వాటి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలోని అడవి ఆసియాటిక్ సింహాల ప్రధాన నివాసం గిర్ జాతీయ ఉద్యానవనం మరియు దాని పరిసర ప్రాంతాలే.

మరోవైపు, భారత్ ప్రపంచంలోనే అత్యధిక అడవి పులులు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రంతంబోర్ జాతీయ ఉద్యానవనం, బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం, కాన్హా జాతీయ ఉద్యానవనం మరియు సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం వంటి ప్రాంతాల్లో పులులు విస్తారంగా కనిపిస్తాయి. భారత పులులను రాయల్ బెంగాల్ టైగర్స్ అని కూడా పిలుస్తారు.

ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా వణికిపోయిందిగా..

Donald Trump
Donald Trump

Donald Trump Angry Reaction: ఎప్పుడు నవ్వుతాడో తెలియదు.. ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు.. అసలు ఏం చేస్తాడో తెలియదు.. ట్రంప్ గురించి వైట్ హౌస్ వర్గాలలో నిత్యం జరిగే చర్చ ఇది. ఆ మధ్య అమెరికన్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలి మీద కథనాల మీద కథనాలు వచ్చాయి అంటే.. అతడు ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అప్పటికప్పుడు నవ్వుతుంటాడు. అంతలోనే కోపాన్ని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏదైనా చేస్తుంటాడు. మొత్తానికి అపరిచితుడు పాత్రను కళ్ళ ముందు ఉంచుతాడు.

ట్రంప్ కోపం తెచ్చుకోవడం కొత్తకాదు. నవ్వడం కూడా కొత్త కాదు. కానీ ఈసారి ట్రంప్ లో కోపం తారస్థాయికి చేరింది. అతని ఆగ్రహానికి అమెరికా మొత్తం కంపించిపోయింది. అమెరికాలో ఎన్బిసి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ అనే జర్నలిస్ట్ ట్రంప్ తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా రకరకాల ప్రశ్నలను వెల్కర్ అడిగారు. దానికి ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త మధ్యలోనే ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాలిఫోర్నియా ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించాడు. దానికి వెల్కర్ ఆధారాలు ఉన్నాయా అని పదేపదే ప్రశ్నించారు. దీంతో ట్రంప్ లో ఆగ్రహం పెరిగిపోయింది. మరో మాటకు తావు లేకుండా మైక్ ను నేలకు విసిరి కొట్టాడు..”నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తివి.. మీ పత్రిక రంగం మొత్తం అవినీతి మయంగా మారిపోయింది. మీట్ ది ప్రెస్ అనేది అత్యంత మోసపూరితం. ఇక ఇక్కడితోనే ఆపేద్దాం.. థాంక్యూ డార్లింగ్” అంటూ ట్రంప్ వెళ్ళిపోయాడు.

మీట్ ది ప్రెస్ లో గతంలో ట్రంప్ బాగానే మాట్లాడేవాడు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ట్రంప్ చాలా సమయమనంతో ఉండేవాడు. ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో.. అమెరికా మీడియా మొత్తం ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద ప్రశ్నించడం మొదలుపెట్టిందో ట్రంప్ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. దీంతో మీడియా కనిపించగానే ఇలా రుస రుసలాడుతున్నాడు. అంతేకాదు తన ఆగ్రహాన్ని ఈసారి ఏకంగా మైక్ విసిరి కొట్టి ప్రదర్శించాడు. దీంతో ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరోవైపు తన మైకు విసిరి కొట్టడాన్ని ట్రంప్ సమర్ధించుకోవడం విశేషం.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Philippines Massive Earthquake
Philippines Massive Earthquake

Philippines Massive Earthquake: ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు వణికిస్తూనే ఉన్నాయి. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితులతో చాలాదేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం ఫిలిప్పీన్స్‌ను భూకంపం వణికించింది. మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూమి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉండటంతో ప్రకంపనలు తీవ్రంగా అనుభూతి చెందాయి.

భూకంప తీవ్రత మార్పులు..
మొదట భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. తర్వాత 7.8కి, చివరకు 8.2కి చేరింది. ఇటీవలి కాలంలో పసిఫిక్‌ ప్రాంతంలో సంభవించిన అతి బలమైన భూకంపాల్లో ఒకటిగా నిలిచింది. భూకంప తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగెత్తారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలుతున్న దృశ్యాలు, పాఠశాల విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించడం, ఇళ్లలో ఫర్నిచర్, టీవీలు కిందపడటం స్పష్టంగా కనిపించాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాణిజ్య భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయి.

ప్రాణ, ఆస్తినష్టం..
తాజా సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు, నలుగురికి పైగా గాయాలయ్యాయి. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్‌ పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు ఇది ఇటీవలి సంవత్సరాల్లో అనుభవించిన అత్యంత బలమైన భూకంపం అని తెలిపారు.

పొంచి ఉన్న సునామీ ముప్పు..
భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌ మరియు ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వతాలు–భూకంపాల సంస్థ కొన్ని ప్రాంతాల్లో ఒక మీటరు పైగా ఎత్తైన అలలు రావచ్చని హెచ్చరిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వేలాది మంది తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తోంది. సముద్ర మట్టంపై నిపుణులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

ఫిలిప్పీన్స్‌ పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలవబడే అత్యంత భూకంప ప్రమాదకర ప్రాంతంలో ఉంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు కలుసుకునేందుకు భూకంపాలు, అగ్నిపర్వతాలు తరచుగా సంభవిస్తాయి. ప్రస్తుతం అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు తీరప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

రాత్రి పూట ఇవి తింటే నిద్ర భంగం.. మరేం తినాలి..

What Not To Eat Before Bedtime
What Not To Eat Before Bedtime

What Not To Eat Before Bedtime: ఈ మధ్యకాలంలో రాత్రి వేళ ఆకలి వేస్తే చాలా మంది ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను సులభమైన ఆహారంగా ఎంచుకుంటున్నారు. కొన్ని నిమిషాల్లో తయారవడం, రుచిగా ఉండటం వల్ల ఇవి యువత నుంచి ఉద్యోగుల వరకు అందరికీ ఇష్టమైన ఎంపికగా మారాయి. అయితే రాత్రిపూట తరచూ నూడుల్స్ తినడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి తింటే ఏం జరుగుతుందంటే?

ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం (ఉప్పు) మోతాదు ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండి రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారవచ్చు. దీర్ఘకాలం ఇలా కొనసాగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నూడుల్స్‌లో ఎక్కువగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. ముఖ్యంగా రాత్రి వేళ శరీర చలనం తక్కువగా ఉండటంతో ఈ అదనపు శక్తి కొవ్వుగా నిల్వ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో బరువు పెరగడం, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

రాత్రి పడుకునే ముందు భారమైన లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఫలితంగా ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగి, మరుసటి రోజు అలసటగా అనిపించే అవకాశం ఉంటుంది. ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆకలిని తాత్కాలికంగా తీర్చగలవు కానీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి కడుపు నింపినా శరీరానికి సరైన పోషణ అందించలేవు. తరచూ వీటిపై ఆధారపడితే పోషకాహార లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది.

రాత్రిపూట ఆకలి వేస్తే నూడుల్స్‌కు బదులుగా మఖానా (ఫాక్స్ నట్స్), బాదం, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం కూడా మంచి ఎంపిక. ఇవి ఆకలిని తగ్గించడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అప్పుడప్పుడు నూడుల్స్ తినడం పెద్ద సమస్య కాకపోయినా, వాటిని రోజువారీ రాత్రి ఆహారంగా మార్చుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, మంచి నిద్ర మరియు మొత్తం శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.

మార్కెట్లో తళుక్కుమని మెరిసిన Tata Safari EV. ఎప్పుడోస్తుందో తెలుసా..

Tata Safari EV Launch Date
Tata Safari EV Launch Date

Tata Safari EV Launch Date: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఈ వేరియంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయితే Tata కంపెనీ నుంచి టియాగో EV, సియెర్రా ఈవీలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు కొత్తగా SUV వేరియంట్ లో విద్యుత్ వాహనం రాబోతుంది. ఈ కారు ఇటీవల భారత రోడ్లపై ఫస్ట్ స్పాటింగ్ ఐనట్లు ఫొటోలు, క్లిప్స్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కారుపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. అయితే ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ SUV ‘టాటా సఫారీ’కి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజాగా భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ ఈ కారు ప్రోటోటైప్ కనిపించడం, ఈ విభాగంలో భారీ అంచనాలను పెంచింది.
సఫారీ EV రూపకల్పన ప్రస్తుత డీజిల్ వెర్షన్ పోలికలను కలిగి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ కావడంతో కొన్ని ప్రత్యేక మార్పులు చోటుచేసుకున్నాయి. కారు వెనుక భాగంలో సైలెన్సర్ (exhaust) లేకపోవడం దీనిని ఎలక్ట్రిక్ వాహనంగా నిర్ధారిస్తోంది. ముఖ్యంగా, ప్రస్తుత సఫారీలో లేని ‘సైడ్ స్టెప్’ ను ఈ టెస్టింగ్ మోడల్‌లో గమనించారు. ఇది ప్రయాణికులు సులభంగా కారులోకి ఎక్కడానికి ,దిగడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బంపర్లు మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ అని తెలిపే ప్రత్యేకమైన బ్యాడ్జింగ్‌తో ఈ కారు రానుంది.

సఫారీ EV లోపలి భాగం అల్ట్రా-మోడరన్ ఫీచర్లతో నిండి ఉండనుంది. ఇందులో టాటా యొక్క అత్యాధునిక ‘TiDAL’ (Tata Intelligent Digital Architecture Layer) సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను అమర్చారు. దీనివల్ల ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఆటో పార్క్ అసిస్ట్, కారును రిమోట్‌గా కదిలించే ‘సమ్మన్ మోడ్’ లో-స్పీడ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు యూపీఐ ఆధారిత ఇన్-కార్ పేమెంట్స్, 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా వంటి సౌకర్యాలు కారు అనుభవాన్ని మరింత ప్రీమియంగా మార్చనున్నాయి.

టాటా సఫారీ EV ని ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో హారియర్ EV తరహాలోనే 65kWh నుంచి 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ కోసం డ్యూయల్ మోటార్ సెటప్‌ను అందించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 500 Nm కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి, ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 నుండి 550 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించే అవకాశం ఉందని అంచనా.

ఈ ఏడాది పండుగ సీజన్‌లో టాటా సఫారీ EVని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది టాటా మోటార్స్ యొక్క అత్యంత ఖరీదైన మరియు ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. మార్కెట్లో ఇది నేరుగా మహీంద్రా నుంచి రాబోయే ‘XEV 9S’ వంటి మూడు వరుసల సీటింగ్ కలిగిన ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీనివ్వనుంది. అంచనా ధర విషయానికొస్తే, ఇది సుమారు 22 లక్షల రూపాయల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

నల్ల పిల్లి ఎదురైతే చాలు వాళ్లకే పండగే పండగ

black cat
black cat

Black Cat: ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తుంటే.. హఠాత్తుగా నల్ల పిల్లి ఏదైనా ఎదురైతే విపరీతంగా భయపడిపోతుంటాం. ఏదైనా కీడు జరుగుతుందని కంగారు పడిపోతుంటాం. నష్ట నివారణ చర్యగా వెనక్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చొని.. మళ్లీ పని మొదలు పెడతాం.

నల్ల పిల్లి అనేది దురదృష్టానికి సంకేతం అని.. చెడుకు ప్రతిరూపమని మనలో చాలామందికి ఒక బలమైన నమ్మకం. నల్ల పిల్లి ఎదురు రావడం మాత్రమే కాదు.. అది కనిపించినా సరే మనలో చాలామందికి భయం కలుగుతుంది. చిన్నప్పటినుంచి మన పెద్దలు మనలో పాదుకొల్పిన ఒక భయం కావచ్చు.. అందువల్ల నల్ల పిల్లి దురదృష్టానికి సంకేతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నల్ల పిల్లిని అపశకునం లాగా భావిస్తుంటారు. మనదేశంలో ఇలా ఉంటే.. ఇంగ్లాండ్ లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి పాత సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగే రోజున వధూవరులకు నల్లపిల్లి ఎదురైతే అదృష్టమని భావిస్తుంటారు. నల్ల పిల్లి ఎదురు కావడం వల్ల కొత్తజంట జీవితంలోకి రాబోయే నష్టాలను.. ముందే గ్రహిస్తుందని.. తనతో పాటు తీసుకెళ్లి పోతుందని.. అప్పుడు వారు సంతోషాలతో ఉంటారని నమ్ముతుంటారు.

నల్ల పిల్లి ఎదురైనప్పుడు కొన్ని ప్రాంతాలలో సంబరాలు కూడా చేసుకుంటారు. వధూవరులు ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని.. మన కష్టాలు తీరిపోయాయని ఆనందంగా గంతులు వేస్తారు. ఇంగ్లాండ్లో ఈ సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం నల్ల పిల్లిని చెడుకు సంకేతంగా చెబుతుంటారు పెద్దలు. పైగా సినిమాల్లో కూడా నల్ల పిల్లిని ప్రమాదానికి హేతువుగా.. అది కనిపిస్తే ఏదో ఘోరం జరిగిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంటారు.

ఇక ఇటీవల కాలంలో మనదేశంలో కూడా పిల్లులను పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారిలో కొంతమంది నల్ల పిల్లులను ఇష్టంగా పెంచుకుంటున్నారు. వాటికోసం ప్రత్యేకంగా సంరక్షకులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫీడ్ ఇవ్వడం… రకరకాల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నల్ల పిల్లుల మీద తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. జాతులను బట్టి పిల్లుల ధరలు ఉంటున్నాయి. కొంతమంది శ్రీమంతులు విదేశాల నుంచి నలుపు రంగు కు చెందిన పిల్లులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవి ఇంట్లో తిరగడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని.. సానుకూల దృక్పథం ఇంట్లో కనిపిస్తూ ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. కాకపోతే ఈ నల్ల పిల్లులకు ఈ కాలంలో విపరీతంగా డిమాండ్ పెరగడమే ఆశ్చర్యం

రాత్రి సమయంలో మామిడి పండ్లు తింటున్నారా.. ముందు ఇది తెలుసుకోండి..

Eating Mangoes At Night
Eating Mangoes At Night

Eating Mangoes At Night: వేసవి కాలం రాగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. తియ్యటి రుచి, సువాసనతో పాటు అనేక పోషకాలు కలిగి ఉండటంతో వీటిని పండ్ల రాజు గా పిలుస్తారు. మామిడిలో విటమిన్ A, C తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియకు సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇన్ని పోషకాలు ఉన్నా కూడా.. వీటిని సరైన సమయంలో తింటేనే ఆరోగ్యం. కొందరు రాత్రి సమయంలో మామిడి పండ్లను తింటూ ఉంటారు. అలా తినడం వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం..

మామిడి పండ్లు ఎంత ఆరోగ్యకరమైనవైనా.. వాటిని సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో శరీర జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మామిడి పండ్లు తింటే అవి పూర్తిగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

దీని ఫలితంగా కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు రాత్రి మామిడి తింటే అసౌకర్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నిద్రకు ముందు మామిడి పండ్లు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

మామిడి పండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. రాత్రిపూట వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో మామిడి తినకుండా పరిమితంగా తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయం పరగడుపున మామిడి పండ్లు తినడాన్ని కూడా కొంతమంది నిపుణులు నివారించాలని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తిన్నప్పుడు అందులోని సహజ చక్కెరలు రక్తంలో వేగంగా శోషించబడే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో కడుపులో మంట లేదా అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో మామిడి పండ్లు తినడం మరింత మంచిదిగా భావిస్తారు.

అలాగే భోజనం చేసిన వెంటనే మామిడి పండ్లు తినడం కూడా సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం అనంతరం వెంటనే పండ్లు తీసుకుంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియపై ప్రభావం పడవచ్చు. దీనివల్ల కడుపు నిండిన భావన, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కనీసం భోజనం చేసిన ఒకటి నుంచి రెండు గంటల తర్వాత మామిడి తినడం ఉత్తమం.

మామిడి పండ్లు తినడానికి అత్యుత్తమ సమయం ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో శరీర జీవక్రియ చురుకుగా ఉండటంతో పండ్లలోని పోషకాలు సులభంగా శోషించబడతాయి. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాయి.

స్పిరిట్ టీజర్ లో ఆ సీన్స్ చూపించబోతున్నారా..?

Spirit Movie
Spirit Movie

Spirit Movie Teaser Scenes: సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా ఆయన పాన్ ఇండియా బాట పట్టాడు. కాబట్టి ప్రతి ఒక్క సినిమాతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా వచ్చిన రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇమేజ్ కూడా పెద్దగా పడిపోలేదు. దాంతో ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే సినిమా యూనిట్ సైతం వీలైనంత తొందరగా టీజర్ ను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా టీజర్ ని చాలా ఎఫెక్టివ్ గా మలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ సినిమాగా మారబోతుంది.

ఈ టీజర్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ను చూపించబోతున్నారు అనే టాక్ కూడా వస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే మరొక నెల రోజుల్లో టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో సినిమా మీద భారీ హైప్ ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు!

AP Summer Holidays 2026
AP Summer Holidays 2026

Andhra Pradesh summer holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో.. పాఠశాల పునః ప్రారంభం వాయిదా వేయాలని ఎక్కువ మంది కోరుతున్నారు. దీనిపై బిజెపి శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు లేఖ రాశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా.. పాఠశాలల పునః ప్రారంభాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు.

* రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ..
ఈ నెల 12న విద్యా సంస్థలు పునః ప్రారంభం కావాలి. అయితే 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో 15న కానీ, 17న కానీ పాఠశాలలను రీఓపెనింగ్ చెయ్యాలని విష్ణుకుమార్ రాజు కోరారు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు సరిగా ఉన్నాయో? లేదో? పరిశీలించాలని కూడా కోరారు విష్ణుకుమార్ రాజు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తోంది. మరోవైపు వర్షాలు జాడ లేకపోవడంతో చల్లటి వాతావరణం అనేది కనిపించడం లేదు. అందుకే తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు.

* ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేసింది. వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి కాకుండా.. 15 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 13న రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందుకు.. దాని బదులు జూలై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఏపీలో కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ నెల 8 నుంచి 10 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యూషన్ నిర్వహిస్తున్నారు.

ఆ వృద్ధుడిని కలిసేందుకు బయలుదేరిన సీఎం చంద్రబాబు!

Chandrababu
Chandrababu

Chandrababu Meets Sanaboyina Satyanarayana: ఏపీ సీఎం చంద్రబాబుకు రోజురోజుకు అభిమానులు పెరుగుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆయనకు అభిమానులు పెరిగారు. పాలనాపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తుంది. అలా బాధితుడయ్యారు చంద్రబాబు. దీంతో ఆయనపై ఎక్కువగా వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసేవారు కనిపించేవారు. కానీ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభిమానులు పెరుగుతూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విధానాలతో చంద్రబాబు మరింత హైలెట్ అయ్యారు. చంద్రబాబును జైలులో పెట్టిన సమయంలో ఈ అభిమానం మరింత పొంగింది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమాజంలో కొన్ని వర్గాల వారు విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. తాజాగా ఓ వృద్ధుడు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. దానిపై స్పందించారు చంద్రబాబు. అభివృద్ధిని తప్పకుండా కలుస్తానని చెప్పారు.

విపరీతమైన అభిమానం..
పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సాన బోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం. ఒక్కసారైనా ఆయనను కలవాలని భావించారు. ఈ క్రమంలో ఓ యువకుడు సత్యనారాయణ తో మాట్లాడుతూ వీడియో తీశాడు. చంద్రబాబును ఎప్పుడైనా చూసావా? అని అడగగా అందుకు సత్యన్నారాయణ హైదరాబాద్ వెళితే కనిపిస్తారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబును చూస్తావా? అని అడిగితే.. చూస్తానని సమాధానమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని సిద్ధాంతం గ్రామానికి వస్తున్నారని చెప్పగా.. సత్యనారాయణ ఎంతగానో సంతోషించాడు. తాను చూసేందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు మన ప్రాంతానికి వస్తే కచ్చితంగా చూసి తీరాలని అన్నాడు. ఆ వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సీఎం చంద్రబాబు దృష్టి వరకు వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. అది మరింత వైరల్ గా మారింది.

ఈరోజు పశ్చిమగోదావరిలో పర్యటన..
పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. తొలుత మంగళవారం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు భావించిన.. ఒకరోజు ముందుగానే సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. సీఎం చంద్రబాబు స్పందించిన నేపథ్యంలో ఆ వృద్ధుడు సత్యనారాయణ ను కలిసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు గతం కంటే అభిమానులు పెరగడం విశేషం. ఓ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. అప్పటినుంచి ఆయనపై అనేక రకాల ఆరోపణలు విమర్శలు ఉండిపోయాయి. వాటన్నింటినీ దాటుకుని చంద్రబాబు ప్రజాభిమానాన్ని పెంచుకోవడం నిజంగా విశేషమే.

దేవాన్ష్ ఘాట్ వెనుక పెద్ద కథ!

Devansh Ghat

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో ఒక ఘాట్ వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. తక్షణం తొలగించాలని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆ బోర్డును తొలగించారు. అయితే దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసింది కాదని… 2015 గోదావరి పుష్కరాల సమయంలోనే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

* సీతానగరం మండలంలో..
గోదావరి తీరంలో వందలాది ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలిలో ఒక పుష్కర ఘాట్ ఉంది. ఇది దేవాన్ష్ ఘాట్ పేరుతో ఉంది. అయితే ఇప్పటి బోర్డు కాదు అని.. పాత బోర్డు అని చెబుతున్నారు అధికారులు. 2015 లో గోదావరి పుష్కరాలు నిర్వహించిన సమయంలో.. అప్పటి రాజానగరం టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాట్ కు దేవాన్ష్ పేరు పెట్టి ఏర్పాటు చేశారు బోర్డు.. నారా లోకేష్, బ్రాహ్మణిలకు 2015 మార్చి 21న జన్మించారు దేవాన్ష్. గోదావరి పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. అయితే 2015లోనే ఈ బోర్డు ఉందని.. ఇప్పుడు ఏర్పాటు చేసింది కాదు అని అధికారులు తేల్చి చెబుతున్నారు.

* సుదీర్ఘ చరిత్ర..
ఈ పుష్కర ఘాట్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1979 పుష్కరాల సమయంలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే దేవాన్ష్ పేరుతో ఉన్న ఈ పుష్కర ఘాట్ ను ఆదర్శ ఘాట్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని స్వయంగా రాజానగరం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ సైతం ఈ ఘాట్ ను పరిశీలించారు. మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవాన్ష్ ఘాట్ అంటూ వార్త వైరల్ కావడంపై స్పందించారు నారా లోకేష్. వెంటనే ఆ బోర్డు తొలగించే ఏర్పాటు చేశారు.

ఏపీకి ఉపద్రవం తప్పదా?!

Telugu States Sudden Rains
Telugu States Sudden Rains

Andhra Pradesh weather : ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు కూడా సంతరించుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే సూచన ఉంది.

* ఈ జిల్లాలకు హెచ్చరిక..
మరోవైపు తీవ్ర వడ గాలులు సైతం కొనసాగుతున్నాయి. ఈరోజు 56 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్ళొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

* నైరుతి ఆగమనం..
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయి. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. ప్రధానంగా ఈసారి పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.