Uttar Pradesh Incident: వైవాహిక జీవితానికి సరైన ఈడు జోడు కావాలి అంటారు పెద్దలు. అలాంటి కఠినమైన నిబంధన కొనసాగిస్తున్నారు కాబట్టే మనదేశంలో ఇప్పటికీ వివాహ వ్యవస్థ.. కుటుంబ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. కానీ పాశ్చాత్య సంస్కృతి.. సోషల్ మీడియా వల్ల భారతీయులు కొంతకాలంగా కట్టు తప్పుతున్నారు. కఠినమైన నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చివరికి నవ్వుల పాలవుతున్నారు. ఈ సంఘటన కూడా అటువంటిదే.
అతని పేరు చందన్. ఇతడిది ఉత్తరకాండ రాష్ట్రంలోని ఆల్మోడ జిల్లా. ఇతడు వంట పని చేస్తుంటాడు. గతంలో ఇతడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా కాయం గంజ్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వంట పని చేశాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇతడికి పరిచయమైంది. ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. నలుగురు పిల్లలు కూడా. ఆమెతో ఇతడికి ఏర్పడిన సంబంధం వివాహేతర వ్యవహారానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు గట్టిగానే తమ సంబంధాన్ని కొనసాగించారు.
ఆ మహిళ భర్తకు వీరి వ్యవహారం తెలియడంతో వెంటనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాడు. ఈ ఘటన కంటే ముందు చందన్ కు పెద్ద హోటల్లో పనిచేసే అవకాశం రావడంతో ముంబై వెళ్లిపోయాడు. ప్రతిరోజు ఆ మహిళతో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇటీవల ఆ మహిళ భర్త ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేశాడు. తన ప్రియురాలు ఫోన్ మాట్లాడడం మానివేసిన నేపథ్యంలో చందన్ ముంబై నుంచి కాయం గంజ్ ప్రాంతానికి వచ్చాడు. అంతేకాదు నేరుగా సెల్ఫోన్ టవర్ ఎక్కాడు. పైగా తను 112 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకుంటానని అతడు గట్టిగా అరిచాడు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడితో మాట్లాడారు. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అతడు కిందికి దిగి వచ్చాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ తరలించారు.
