Homeవింతలు-విశేషాలుMeet Akhil and Shriya: ఈ దంపతులు దోసెను నమ్ముకున్నారు.. నెలకు కోటి సంపాదిస్తున్నారు!

Meet Akhil and Shriya: ఈ దంపతులు దోసెను నమ్ముకున్నారు.. నెలకు కోటి సంపాదిస్తున్నారు!

Meet Akhil and Shriya: గొప్పగా చెప్పుకునే హోటల్ కాదు. అంతర్జాతీయ స్థాయిలో చెఫ్ లూ లేరు. నోరు తిరగని మెనూ లేదు. సెలబ్రిటీల ప్రమోషనూ లేదు. కేవలం స్వశక్తి మాత్రమే ఉంది. దానిని నమ్ముకున్నారు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నెలకు కోటి వరకు సంపాదిస్తున్నారు.. అలాగని వారితో ఫైవ్ స్టార్ హోటల్ రన్ చేయడం లేదు.. దిమ్మతిరిగే రేంజ్ లో ధరలు అమలు చేయడం లేదు.. ఇంతకీ వారు ఏం చేస్తున్నారంటే..

అది ముంబై… ఆ దంపతుల పేర్లు అఖిల్, శ్రీయ. వారిద్దరు గతంలో కొన్ని కంపెనీలలో పని చేశారు. ఉద్యోగ అనుభవం మాత్రం వచ్చింది కానీ.. గొప్పగా చెప్పుకునే స్థాయిలో వెనకేయలేదు.. దీంతో వారు ఏదైనా చేద్దామనుకున్నారు.. స్నేహితులు, తెలిసిన వాళ్ళ సలహా అడిగారు. వారంతా రకరకాలుగా చెప్పారు. అవేవి వారికి నచ్చలేదు. దీంతో వారిద్దరు ఒకరోజు ఓ హోటల్లో దోశ తింటుండగా ఒక ఆలోచన వచ్చింది. పైగా అది సౌత్ ఇండియన్ కేఫ్.. వారు తింటున్నది ఫేమస్ బెంగళూరు దోస.. ఎందుకైనా మంచిది ఈ వంటకాన్ని ముంబై వాసులకు పరిచయం చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడువుగా రకరకాల చోట్ల పరిశీలించారు. అవేవీ వారి బడ్జెట్లో లేవు. దీంతో తాము ఉంటున్న ప్రాంతంలోనే ఒక చిన్నపాటి సముదాయాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని క్లౌడ్ కిచెన్ లాగా మార్చారు. అంతే ఇక వారి వ్యాపారం మొదలుపెట్టారు.

బెంగళూరులో బెన్ని దోస చాలా ఫేమస్. అది క్రిస్పీగా.. మెత్తగా ఉంటుంది. క్లౌడ్ కిచెన్ ద్వారానే తమ దోస వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తమ వ్యాపారాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఓపెన్ కిచెన్ లోనే తాము దోసలు తయారు చేసే విధానాన్ని చూపించడం ప్రారంభించారు. కాకపోతే గంటలు గంటలు వీడియోలు కాకుండా.. నిమిషాల్లోనే వాటిని ASMR రూపంలో చూపించడం మొదలుపెట్టారు. రుచికి రుచి.. నాణ్యతకు నాణ్యత కొనసాగించడంతో వారి వ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. క్లౌడ్ కిచెన్ కావడంతో వారికి పెద్దగా ఉద్యోగుల అవసరం లేకుండా పోయింది. తద్వారా వారు భారీగా ఆర్డర్లు సొంతం చేసుకుని తిరుగులేని స్థాయిలో తమ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం ప్రతినెలా వారు కోటి వరకు సంపాదిస్తున్నారు. ఇందులో ఖర్చులు పోను.. దాదాపు 70 లక్షల వరకు మిగులుతున్నట్టు తెలుస్తోంది..

బెంగళూరు బెన్నీ దోసలో సగ్గుబియ్యం, మినుములు, రాగులు వాడుతుంటారు. దోస అద్భుతంగా రావడానికి ఎటువంటి కృత్రిమ పదార్థాలు ఉపయోగించరు. దీని తయారీలో పచ్చికొబ్బరి వాడటం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది.. పైగా పల్లి, కొబ్బరి, పండుమిర్చి, దబ్బ కాయల చట్నీలను కస్టమర్లకు అందిస్తుంటారు. వీటితోపాటు కందిపొడి, నువ్వుల పొడి, నెయ్యి కూడా సర్వ్ చేస్తుంటారు. తద్వారా వీరు తయారు చేస్తున్న దోసలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నేటి కాలంలో ఉద్యోగాలు పోయాయని.. కంపెనీలు తొలగించాయని.. జీతాలలో పెరుగుదల లేదని బాధపడే వారికి ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వశక్తిని మించింది లేదని నిరూపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular